- నేరగాళ్లకు అడ్డాగా మారిన మెసేజింగ్ ప్లాట్ఫామ్
- కేంద్ర ప్రభుత్వం సంచలన ఆరోపణలు
– దిల్లీ హైకోర్టుకు నివేదిక సమర్పణ
న్యూదిల్లీ, జూన్ 18: మెసేజింగ్ ప్లాట్ఫామ్ టెలిగ్రామ్పై కేంద్రం సంచలన ఆరోపణలు చేసింది. ఈ యాప్ను కొత్త డార్క్ వెబ్’గా పేర్కొన్న కేంద్రం.. ఇది నేరగాళ్లకు అడ్డగా మారిందని ఆరోపించింది. సైబర్ నేరగాళ్లు, అతివాదులు, డ్రగ్ ముఠా సభ్యులు చట్టం నుంచి తప్పించుకునేందుకు ఈ యాప్ ను ఎక్కువగా వినియోగిస్తున్నారని దుయ్యబట్టింది. ఈమేరకు దిల్లీ హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. ‘నీట్’ రీఎగ్జామ్ నేపథ్యంలో దేశంలో టెలిగ్రామ్ వినియోగంపై కేంద్రం ఇటీవల తాత్కాలిక నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ మెసేజింగ్ ప్లాట్ఫామ్ దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణలో భాగంగా కేంద్రం గురువారం అఫిడవిట్ దాఖలు చేసింది. ‘నీట్ ‘ యూజీ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం లేపిన నేపథ్యంలో ఈనెల 21న రీ టెస్ట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పరీక్షకు సంబంధించిన కొన్ని ముఠాలు టెలిగ్రామ్ వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపిస్తూ దీనిపై కేంద్రం ఇటీవల తాత్కాలిక నిషేధం విధించింది. ప్రశ్నపత్రాల లీకేజీ, తప్పుడు వార్తల వ్యాప్తిని నివారించేందుకు, మోసపూరిత నెట్వర్క్లను అరికట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ సందర్భంగా క్రిమినల్ నెట్వర్క్లు, అతివాద ముఠాలు, సైబర్ నేరగాళ్లు ఈ యాప్ను దుర్వినియోగం చేస్తున్న తీరును కేంద్రం అందులో వివరించింది. గోప్యతకు సంబంధించి టెలిగ్రామ్లో ఉన్న అధునాతన ఫీచర్లు క్రిమినల్ నెట్వర్క్లను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయని పేర్కొంది. ఇందులోని ప్రైవసీ సెట్టింగ్లతో యూజర్లు తమ టెలిగ్రామ్ ఐడీలు, ఫోన్ నంబర్లు వంటి గుర్తింపు వివరాలను దాచిపెట్టేందుకు వీలు లభిస్తోంది. దీనివల్ల అసలు వ్యక్తులు ఎవరో గుర్తించడం దర్యాప్తు అధికారులకు కష్టంగా మారుతోంది. ఈ ఫీచర్ల వల్లే నేరగాళ్లు ఈ యాప్ను దుర్వినియోగం చేసి మాదకద్రవ్యాల అక్రమ రవాణా, దోపిడీ, ఉగ్రదాడులు, మోసాలు వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇది కొత్త డార్క్ వెబ్గా మారింది. క్రిమినల్స్ డార్క్ వెబ్ లింక్లతో పరస్పరం అనుసంధానం చేసుకుంటున్నారు. దీంతో అధికారులు వారిని ట్రాక్ చేయలేక పోతున్నారని కేంద్రం తమ అఫిడవిట్లో ఆరోపించింది. ఇక, హింసాత్మక, తీవ్రవాదం, ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన కంటెంట్ను ప్రచారం చేయడానికి టెలిగ్రామ్ గ్రూపులు, ఛానెళ్లను ఉపయోగిస్తున్నారని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. దీనివల్ల తప్పుడు సమాచారం వేగంగా వ్యాప్తి చెందుతోందని, ఫలితంగా శాంతిభద్రతలకు భంగం వాటిల్లుతోందని ఆరోపించింది. పిల్లలపై లైంగిక దాడుల వంటి దృశ్యాలను ఈ యాప్ గ్రూప్ల్లో విపరీతంగా షేర్ చేస్తున్నట్లు తెలిపింది. సైబర్ నేరగాళ్లు ఈ వేదికపై నకిలీ ఖాతాలను సృష్టించి.. ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారని మండిపడింది. ఈ మెసేజింగ్ ప్లాట్ఫామ్ దుర్వినియోగంపై ఇటీవలి కాలంలో నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్కు ఫిర్యాదులు పెరిగినట్లు పేర్కొంది. హ్యాకర్ గ్రూప్లు కూడా ఈ టెలిగ్రామ్ ఛానళ్లను ఉపయోగించి పెద్ద ఎత్తున డేటా చౌర్యానికి పాల్పడుతున్నట్లు కేంద్రం తన అఫిడవిట్లో వెల్లడించింది. అంతేగాక, యూజర్ల వ్యక్తిగత డేటా అయిన మొబైల్ నంబర్లు, ఆధార్ వివరాలు, ఇతర సున్నితర సమాచారాన్ని యాక్సెస్ చేసేలా టెలిగ్రామ్ బాట్స్ పనిచేస్తుండటంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మాధ్యమంలో పైరసీ సినిమాలు, వెబ్ సిరీస్లు, కాపీరైట్ కంటెంట్ కూడా ప్రసారమవుతున్న విషయాన్ని కేంద్రం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





