పుల్వామా తరహాలో మరో దాడికి కుట్ర‌

– ఐఎస్‌ఐ ఉ‌గ్రవాద ముఠా అరెస్ట్

‌న్యూదిల్లీ, జూన్‌ 17 : ‌పాకిస్థాన్‌ ‌గూఢచారి సంస్థ అయిన ఐఎస్‌ఐ ‌మద్దతుతో భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న అంతర్జాతీయ ఉగ్రముఠాను దిల్లీ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఏడుగురిని అరెస్ట్ ‌చేయగా.. వారిలో ఆరుగురు ఉత్తర్‌‌ప్రదేశ్‌లోని ఘ‌జియాబాద్‌ ‌వాసులుగా పోలీసులు గుర్తించారు.
గాజియాబాద్‌లో అరెస్టయిన ఆరుగురిలో నలుగురు గతంలో పుల్వామా ప్రాంతాన్ని సందర్శించినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి సున్నితమైన సమాచారాన్ని పాక్‌కు పంపినట్లు అనుమానిస్తున్నారు. పుల్వామా తరహాలో మరో పెద్ద దాడికి పాక్‌ ‌ప్లాన్‌ ‌చేస్తోందనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు. ఈ ముఠా దిల్లీ నుంచి జమ్మూ వరకు గల ప్రముఖ రైల్వే స్టేషన్ల వద్ద సోలార్‌ ‌సంబంధిత సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేసి భారత సైనికుల కదలికలను గుర్తించేందుకు యత్నించినట్టు పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే వీరు ఢిల్లీలోని కాంట్‌, ‌హరియాణాలోని సోనిపట్‌ ‌రైల్వే స్టేషన్ల వద్ద అలాంటి కెమెరాలను అమర్చినట్టు గుర్తించారు.  దర్యాప్తులో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. భారతీయ ఫోన్‌ ‌నంబర్లకు వచ్చే ఓటీపీలను విదేశీయులకు పంపిస్తూ వాట్సాప్‌, ‌సోషల్ ‌మీడియా అకౌంట్లను నిర్వహించుకునేందుకు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకు రూ.500 నుంచి రూ.5 వేల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. సిమ్‌ ‌కార్డుల చోరీ, గతంలోనే యాక్టివేట్‌ ‌చేసిన సిమ్‌లను కొనుగోలు చేయడం వంటివి వినియోగించినట్లు సమాచారం. ఆర్థిక లావాదేవీలనూ తమ సొంత అకౌంట్ల ద్వారా కాకుండా జనసేవా కేంద్రాలు, స్థానిక దుకాణాల ద్వారా నగదు రూపంలో స్వీకరించి పోలీసుల కళ్లుగప్పేందుకు యత్నించినట్టు అధికారులు తేల్చారు. ఈ కేసులో మరికొందరి ప్రమేయంపైనా విచారణ కొనసాగుతోందని, దేశ భద్రతకు ముప్పుగా మారే ఇలాంటి నెట్‌వర్క్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *