– ప్రజలను మోసగించే వారు సమాజానికి చేటు
– అలాంటివారు జైల్లో ఉండడమే కరెక్ట్
- సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు
న్యూదిల్లీ, జూన్ 17: సైబర్ నేరస్థులు అమాయక ప్రజలను మోసంచేసి కోట్లాది రూపాయలు కాజేసే పరాన్నజీవులని సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న వారిపై చట్టాలను మరింత కఠినతరం చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. ఈ మేరకు ఓ సైబర్ ఫ్రాడ్ కేసులో నిందితుడికి బెయిల్ నిరాకరించి ఆ పిటిషన్ను తిరస్కరిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది న్యాయస్థానం.ఈ పిటిషన్ విచారణ సందర్భంగా సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం సైబర్ నేరాలపై పెరుగుతున్న ముప్పుపై ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజలను ఆకర్షించి భారీ లాభాలొస్తాయని నమ్మబలికి వారిని మోసగించే వ్యక్తులు సమాజానికి ప్రమాదకరమన్నది. వీరు పరాన్నజీవులు.. పెట్టుబడిదారుల నుంచి డబ్బు తీసుకుని మోసం చేస్తున్నారు. ఇలాంటి వారు జైల్లో ఉండటమే సమాజానికి శ్రేయస్కరం. సైబర్ నేరస్థుల విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలి. ఇలాంటి నేరాలు ఎప్పుడూ పాన్ ఇండియా స్థాయిలో జరుగుతూ ఉంటాయి. గుజరాత్లో ఒకరు, ఆ తర్వాత ముంబై మరొకరి నుంచి.. ఇలా అందరి నుంచి డబ్బులు వసూలు చేస్తారు అని ధర్మాసనం పేర్కొంది. ఈ సందర్భంగా కోర్టుకు అందించిన వివరాలను ప్రస్తావిస్తూ గతేడాది చివరి నాటికి దేశంలో డిజిటల్ మోసాల కారణంగా రూ.3 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్టు పేర్కొంది. సైబర్ నేరాల తీవ్రతను ఇది విస్పష్టంగా తెలియజేస్తోందని వ్యాఖ్యానించింది. కాగా, నేషనల్ క్రైమ్ రికార్డస్ బ్యూరో గణాంకాల ప్రకారం 2021 నుంచి 2023 మధ్య సుమారు 63 శాతం సైబర్ మోసాలు పెరగడంతో కేసుల సంఖ్య 86 వేల మార్కును దాటింది. వీటిలో కర్ణాటక తొలి స్థానంలో ఉండగా తెలంగాణ, ఉత్తర్ప్రదేశ్, మహారాష్ట్ర ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





