– 30లోగా కేవైసీ, బయోమెట్రిక్ పూర్తి చేసుకోవాలి
న్యూదిల్లీ, జూన్ 17: వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉజ్జ్వల పథకం లబ్దిదారులతోపాటు సబ్సిడీ పొందుతున్న సాధారణ గ్యాస్ వినియోగదారులు కూడా జూన్ 30 లోగా తమ బయోమెట్రిక్ పక్రియను కచ్చితంగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఈ గడువులోగా బయోమెట్రిక్ పూర్తి చేయని వారి ఖాతాల్లో సబ్సిడీ జమ కాకుండా నిలిపివేయనున్నారు. ఏడాదిగా ఈ-కేవైసీ పక్రియ కొనసాగుతున్నా ఇంకా పూర్తి కాకపోవడంతో ఈ నెల 30లోపు పూర్తి చేయాలని కేంద్రం నిర్దేశించింది. ఒకవేళ గడువు దాటిన తర్వాత బయోమెట్రిక్ పూర్తి చేసుకుంటే ఆ తేదీ తర్వాత తీసుకునే సిలిండర్లకు మాత్రమే సబ్సిడీ లభిస్తుంది. కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ మే 18న జారీ చేసిన ప్రకటన ప్రకారం బయోమెట్రిక్ పక్రియ పూర్తి కాలేదనే నెపంతో వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ల సరఫరాను మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ నిలిపివేయకూడదు. అయితే, క్షేత్రస్థాయిలో అందుతున్న సమాచారం ప్రకారం బయోమెట్రిక్ పూర్తి చేయని వారికి సిలిండర్ల డెలివరీని ఆలస్యం చేయాలని లేదా నిలిపివేయాలని ఆయిల్ కంపెనీల నుంచి గ్యాస్ డీలర్లకు అనధికారిక ఆదేశాలు అందాయి. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరగడంతో ఈ నెల 7న సిలిండర్ ధరను రూ.29 మేర పెంచారు. ప్రస్తుతం హైదరాబాద్లో సబ్సిడీ లేని గృహోపయోగ సిలిండర్ ధర రూ.994 పలుకుతోంది. కేంద్రం ఉజ్జ్వల పథకం కింద ప్రతి సిలిండర్పై రూ.300 సబ్సిడీ ఇస్తుండగా, మిగిలిన అర్హులైన సాధారణ వినియోగదారుల బ్యాంక్ ఖాతాల్లో స్వల్ప మొత్తంలో సబ్సిడీ జమ అవుతోంది. మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన కుటుంబాలకు రూ.500కే సిలిండర్ అందిస్తోంది. రాష్ట్రంలో 1.26 లక్షలకు పైగా క్రియాశీలక గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ కంపెనీలు బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోని వారి వివరాలను రాష్ట్ర ప్రభుత్వాలతో కూడా పంచుకోనున్నాయి. గ్యాస్ కనెక్షన్ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా బయోమెట్రిక్ అప్డేట్ చేయని వారు వెంటనే తమ పరిధిలోని గ్యాస్ ఏజెన్సీని సంప్రదించి ఈ పక్రియను పూర్తి చేసుకోవాలి. 30 లోగా ఈ పని పూర్తి చేసుకుంటేనే ఎలాంటి అంతరాయం లేకుండా సబ్సిడీ డబ్బులు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి.గ్యాస్ కనెక్షన్లను ఆధార్తో అనుసంధానం చేయడంతోపాటు ముఖ గుర్తింపు, వేలిముద్రలు లేదా ఐరిస్ వంటి మూడు విధానాలతో ఎల్పీజీ వినియోగదారుల ఈ-కేవైసీని పూర్తి చేయనున్నారు. ఈ పక్రియ కోసం వినియోగదారులే నేరుగా ఆయిల్ కంపెనీల మొబైల్ యాప్ ద్వారా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. డీలర్ల వద్ద ఈ-కేవైసీ పూర్తి చేసేందుకు కూడా అవకాశం కల్పించారు. కొన్ని గ్యాస్ ఏజెన్సీలు సిలిండర్ డెలివరీ సమయంలోనే ఈ పక్రియను పూర్తి చేస్తున్నాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





