తెలంగాణ పోలీస్‌కు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు

˜సైబర్‌ క్రైమ్‌ కేసుల పరిష్కారంలో మనమే మిన్న
˜పోలీస్‌ శాఖ అవసరాలు తీరుస్తాం
˜డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22 : రాష్ట్రంలో ప్రతి పౌరుడు సురక్షితంగా జీవిస్తున్నారన్న భరోసాతో ఉండాలని, ఆ మేరకు పోలీసు శాఖ అవసరాలు తీర్చే బాధ్యత తాము తీసుకుంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివారం అంబేడ్కర్‌ సచివాలయంలో హోం శాఖ ప్రీ బడ్జెట్‌ సమావేశాల్లో ఆయన పలు అంశాలపై పోలీసు ఉన్నతాధికారులతో చర్చించారు. తెలంగాణ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుం దన్నారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉన్న మూడు నగరాలకు తోడు నాలుగో నగరం ఫ్యూచర్‌ సిటీ సైతం సిద్ధమవుతోంది. రీజినల్‌ రింగ్‌ రోడ్డు పనులు వేగవంత మవుతున్నాయని తెలిపారు.

రాష్ట్రంలో ఉన్న ఆర్థిక వనరులు, వాతావరణం, ఉపాధి అవకాశాల నేపథ్యంలో పెద్ద ఎత్తున హైదరాబాద్‌ కు, రాష్ట్రానికి వలసలు పెరుగుతున్నాయని ఈ మేరకు భద్రత విషయంలో హోం శాఖ సిద్ధం కావాల్సిన అవసరముందని గుర్తుచేశారు. సరిహద్దుల్లో ఉండే సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించి పరిష్కరిస్తామని పోలీసు ఉన్నతాధికారులకు డిప్యూటీ సీఎం భరోసా ఇచ్చారు. దేశంలోనే తెలంగాణ పోలీస్‌ శాఖకు మంచి పేరు ఉంది. ప్రధానంగా సైబర్‌ క్రైమ్‌ కేసుల పరిష్కారం విషయంలో దేశంలో అగ్రస్థానంలో ఉన్నారని..  అందుకు ఉన్నతాధికారులు, సిబ్బందికి డిప్యూటీ సీఎం అభినందనలు తెలిపారు. పోలీస్‌ అధికారులు, సిబ్బంది నివాసానికి క్వార్టర్స్‌ నిర్మించాల్సి ఉందని, రాష్ట్రంలో ఎక్కడెక్కడ పోలీస్‌ క్వార్టర్స్‌ నిర్మాణానికి అవకాశం ఉందో వెంటనే ప్రతిపాదనలు పంపించాలని డిప్యూటీ సీఎం పోలీస్‌ ఉన్నతాధికారులను కోరారు.

సిఎస్‌ఆర్‌ నిధులు సమీకరించేందుకు అవకాశం ఉన్న ప్రతి చోట అధికారులు యత్నం చేయాలని, పోలీస్‌ శాఖ బలోపేతానికి వాటిని వినియోగించుకోవాలని సూచించారు. గత ఏడాది కాలంగా పోలీస్‌ శాఖలో భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్య, ప్రస్తుతం ఉన్న ఖాళీల వివరాలపై సమీక్షించారు. గ్రేహౌండ్స్‌, నార్కోటిక్స్‌, ఇంటలిజెన్స్‌, ఫైర్‌, ఎక్స్‌ సర్వీస్‌ మెన్‌ మొత్తం ఎనిమిది విభాగాల ఉన్నతాధికారులు వారి బడ్జెట్‌ అవసరాల పై సమావేశంలో నివేదిక సమర్పించారు. డిజిపి జితేంద్ర మొత్తం శాఖ పరంగా రానున్నయ్యడానికి అవసరమైన బడ్జెట్‌ పై నివేదిక సమర్పించారు. సమావేశంలో స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రామకృష్ణారావు, హోం శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ రవి గుప్తా, డీ జీఅభిలాష్‌ బిస్త్‌, గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌ అడిషనల్‌ డీజీ స్టీఫెన్‌ రవీంద్ర, హైదరాబాద్‌ సిటీ కమిషనర్‌ సివి ఆనంద్‌, రాచకొండ సి పి సుధీర్‌ బాబు, సైబరాబాద్‌ సీపీ అవినాష్‌ మహంతి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *