– కేంద్ర మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు
న్యూదిల్లీ, జూన్ 29: గ్రామీణ పథకాల అమలులో తెలంగాణ వెనుకబడి ఉందని కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయా పథకాల అమలును పరిశీలించినప్పుడు ఇది కనిపించిందన్నారు. ఈ మేరకు రాష్ట్రంపై ఆయన వ్యాఖ్యలు చేశారు. న్యూదిల్లీలో గ్రామీణాభివృద్ధి పథకాల అమలుపై మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ అధ్యక్షతన సమావేశం సోమవారం జరిగింది. సమావేశానికి 27 రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రం గురించి ఆయన మాట్లాడుతూ పీఎంజీఏసీవై రహదారుల పనులు వేగవంతం కావాలని చెప్పారు. పెండింగ్ రహదారి పనులు పూర్తి చేయాలని సూచించారు. పీఎం ఆవాస్ సర్వే త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రితోపాటు ఉన్నతాధికారులను ఆదేశించారు. గ్రాణాభివృద్ధి శాఖలో ఖాళీలు వెంటనే భర్తీ చేయాలని స్పష్టం చేశారు. అలాగే గ్రామాల అభివృద్ధే వికసిత్ భారత్కు పునాది కావాలని ఆకాంక్షించారు. రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన సూచించారు. జులై 1వ తేదీ నుంచి వికసిత్ భారత్ గ్రామీణ యోజన అమలు చేస్తున్నట్లు చెప్పారు. నిధుల వాటా సమయానికి విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర మంత్రి కోరారు. గ్రామీణాభివృద్ధి పథకాల అమలులో ముందంజలో ఉందంటూ ఆంధప్రదేశ్పై కేంద్ర మంత్రి ప్రశంసలు కురిపించారు. వీబీజీఆర్ఎంఏజీఐకి నోటిఫికేషన్ పూర్తి చేసిన రాష్ట్రాల జాబితాలో ఏపీ ఉందన్నారు. జులై 2న తిరుపతిలో వీబీజీఆర్ఎంఏజీఐ ప్రారంభిస్తామని ప్రకటించారు. ఈ జాతీయ కార్యక్రమం ప్రారంభోత్సవానికి ఆతిథ్య రాష్ట్రంగా ఏపీని ఎంపిక చేశామన్నారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన నాణ్యతలో దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రాల్లో ఏపీకి స్థానం దక్కిందని మంత్రి శివరాజ్సింగ్ పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





