జీసీసీలను గ్లోబల్ వాల్యూ యాడెడ్ సెంటర్లుగా మార్చుతాం
ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మారే సత్తా మనకుంది .
గ్రామీణ ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టేలా ప్రోత్సాహం
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11 : టెక్నాలజీ అంటే ప్రపంచం హైదరాబాద్ వైపు చూసేలా తీర్చిదిద్దడమే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. మంగళవారం హెచ్ఐసీసీలో జరిగిన ‘32వ హైసియా నేషనల్ సమ్మిట్ అండ్ అవార్డ్స్’ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల(జీసీసీ)కు హబ్ గా హైదరాబాద్ ను మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పుడు మరో అడుగు ముందుకేసి వాటిని గ్లోబల్ వాల్యూ సెంటర్లు(జీవీసీ)గా మార్చాలని సంకల్పించినట్లుగా వివరించారు. ఈ జీవీసీలు తెలంగాణను.. ముఖ్యంగా హైదరాబాద్ కు అదనపు విలువను జోడిరచి ప్రపంచ టెక్నాలజీ పటంలో అత్యున్నత స్థాయికి చేర్చుతాయన్నారు. తెలంగాణ ఐటీ రంగం వార్షిక వృద్ధి రేటు 13 శాతం పైచిలుకు, ఐటీ ఎగుమతుల విలువ 32 బిలియన్ డాలర్లు, దేశీయ ఐటీ అవుట్ పుట్ 5 బిలియన్ డాలర్లుగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మారే సత్తా తెలంగాణకు ఉందన్నారు. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి పక్కాగా అమలు చేస్తుందన్నారు. గ్లోబల్ ఇన్నోవేషన్, డిజిటల్ ట్రాన్స్ ఫార్మేషన్ లో హైదరాబాద్ గ్లోబల్ లీడర్ గా ఉందన్నారు.
హైదరాబాద్ ను సెమీ కండక్టర్స్, డీప్ టెక్ సొల్యూషన్స్ లోనూ గ్లోబల్ హబ్ మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. హైదరాబాద్ లో 1500కు పైగా ఐటీ కంపెనీలున్నాయని, వీటిలో 15 లక్షల మంది పనిచేస్తున్నారన్నారు. వీరిలో 3 లక్షల మంది ఏఐ నిపుణులు, లక్ష మంది చిప్ డిజైనర్లు ఉన్నారని వివరించారు. టెక్నాలజీ పరంగా రోజుకో కొత్త ఆవిష్కరణ తెరపైకి వొస్తుందని, ఇలా కొత్త ఆలోచనలతో ముందుకొచ్చే వారికి ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. టెక్నాలజీ ఆవిష్కరణలకు హబ్ గా తెలంగాణను మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేయాలని ఐటీ నిపుణులను కోరారు. అన్ని రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తున్న ఏఐ సాయంతో పౌర సేవలను తెలంగాణ ప్రజల ముంగిటకే చేర్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఏఐ, మెషిన్ లెర్నింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్ తదితర అధునాతన సాంకేతిక టెక్నాలజీలకు హబ్ గా తెలంగాణను మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. తెలంగాణ యువతలో ప్రతిభకు కొదువ లేదని, అదే మా ఆస్తి అని అన్నారు.
పెట్టుబడులు హైదరాబాద్ కే పరిమితం చేయకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విస్తరిస్తున్నామన్నారు. గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఆయా ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను కోరారు. విదేశాలకు ముడి వస్తువులు, విడి భాగాలు సరఫరా చేయడానికే పరిమితం కాకుండా ఇక్కడే అంతిమ వినియోగ వస్తువు(ఫైనల్ గూడ్) తయారయ్యేలా చూడటమే తమ లక్ష్యమన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తేవడం, యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడంతోనే ఆగిపోమని, ఏఐ లాంటి అత్యాధునిక టెక్నాలజీని సామాన్యుడి ఉపయోగపడేలా చేయడమే లక్ష్యమని వివరించారు. ఏఐ వల్ల రైతులు, చిరు వ్యాపారులు, విద్యార్థులు ప్రయోజనం పొందేలా ప్రభుత్వం చొరవ తీసుకుంటుందన్నారు. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయంటూ మనందరిలో భయం నెలకొందన్నారు. ఇదంతా నాణేనికి ఒకవైపేనని, మరోవైపు ఇదే ఏఐ కొత్త అవకాశాలను సృషిస్తుందన్నారు. తెలంగాణలో 3 లక్షల మంది ఏఐ నిపుణులు సిద్ధంగా ఉన్నారని, రాబోయే రోజుల్లో టెక్నాలజీ పరంగా అత్యున్నత ఉద్యోగాలు సాధించేలా లక్ష మందిని తీర్చిదిద్దుతామన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, హైసియా అధ్యక్షుడు ప్రశాంత్ నందేలా, ఎస్టీపీఐ హైదరాబాద్ డైరెక్టర్ మెస్సీ కవిత పాల్గొన్నారు.





