లక్ష్యం 2028..! తెలంగాణ,కర్ణాటక పై అందరి దృష్టి

దక్షిణ భారతదేశంలో  బీజేపీ రాజకీయ వ్యూహం బలహీనంగా మారడమే కాకుండా, దాని ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్‌కు ఇక్కడ వరుసగా బలం పెరుగుతోంది. దక్షిణాదిలో బీజేపీకి గట్టి పట్టు ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక. అయితే అక్కడ కూడా ప్రస్తుతం పార్టీ అంతర్గత విభేదాలతో సతమతమవుతోంది. ఈ పరిస్థితుల్లో 2028లో జరగనున్న తెలంగాణ, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి అత్యంత కీలకంగా మారనున్నాయి. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కాంగ్రెస్‌ను బలహీనపరుస్తూ బీజేపీ తన ఆధిపత్యాన్ని కొనసాగించినప్పటికీ, దక్షిణ భారతదేశంలోని రాజకీయ పరిణామాలు మాత్రం ఆ పార్టీకి ఆందోళన కలిగిస్తున్నాయి.

మరోవైపు, కాంగ్రెస్ బలహీనపడిన ప్రతిసారీ దక్షిణాది రాష్ట్రాలు ఆ పార్టీకి అండగా నిలిచిన చరిత్ర ఉంది. ప్రస్తుతం దక్షిణ భారతదేశంలోని ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. వాటిలో కేరళ, తెలంగాణ, కర్ణాటకల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్నారు. తమిళనాడులో  తమిళగ వెట్రి కళగం విజయ్  నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామిగా ఉంది.

ఇక బీజేపీ విషయానికి వొస్తే, దక్షిణాదిలో ఆ పార్టీకి స్వతంత్రంగా అధికారంలో ఉన్న ఒక్క రాష్ట్రం కూడా లేదు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే తెలుగు దేశం పార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. కేంద్ర పాలిత ప్రాంతాలైన పుదుచ్చేరి, లక్షద్వీప్‌లలో కూడా బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో భాగమే. లోక్‌సభ ప్రాతినిధ్యం పరంగా చూస్తే, దక్షిణ భారతదేశంలోని 131 స్థానాల్లో బీజేపీకి కేవలం 29 స్థానాలే ఉన్నాయి.

బలహీనమైన కాంగ్రెస్‌కు దక్షిణాది ఎప్పుడూ ఊపిరి

2029 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 2028లో తెలంగాణ, కర్ణాటకల్లో విజయం సాధించడం ద్వారా దక్షిణాదిలో తన బలాన్ని పెంచుకోవాలని, కాంగ్రెస్ ఎదుగుదలను అడ్డుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ కూడా తన బలమైన నియోజకవర్గాలను  కాపాడుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది.

గత చరిత్రను పరిశీలిస్తే, కాంగ్రెస్‌కు దక్షిణ భారతదేశం అనేక సందర్భాల్లో ప్రాణాధారంగా నిలిచింది. బీజేపీకి మరో పెద్ద సవాలు తమిళనాడు, కేరళల్లో ఇప్పటికీ గణనీయమైన రాజకీయ పురోగతి సాధించలేకపోవడమే. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ మద్దతుపైనే ఆధారపడుతోంది.

ఇందిరా గాంధీకి దక్షిణాదే రాజకీయ పునరాగమనం కల్పించింది

1977లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఘోర పరాజయం పాలై, అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ కూడా ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ, దక్షిణ భారతదేశంలో మాత్రం కాంగ్రెస్ తన బలాన్ని నిలబెట్టుకుంది. రాయ్‌బరేలీలో ఓటమి అనంతరం ఇందిరా గాంధీ కర్ణాటకలోని చిక్కమగళూరు ఉపఎన్నికలో విజయం సాధించి మళ్లీ లోక్‌సభలో అడుగుపెట్టారు.1980లో కాంగ్రెస్ మళ్లీ కేంద్రంలో అధికారంలోకి వొచ్చినప్పుడు కూడా ఇందిరా గాంధీ అప్పటి ఆంధ్రప్రదేశ్‌లోని మెదక్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి విజయం సాధించడం విశేషం.

ఇరు పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారనున్న 2028 ఎన్నికలు

గత లోక్‌సభ ఎన్నికల్లో 240 స్థానాలకు పరిమితమైన బీజేపీ మళ్లీ బలపడాలంటే ఉత్తర, తూర్పు, మధ్య, పశ్చిమ భారతదేశంతో పాటు దక్షిణాదిలోనూ గట్టి పట్టు సాధించాల్సిన అవసరం ఉంది. మరోవైపు, కాంగ్రెస్ దక్షిణ భారతదేశంలో తన బలాన్ని మరింత పెంచుకుని, దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ప్రభావాన్ని విస్తరించడం ద్వారా మళ్లీ కేంద్రంలో అధికారానికి చేరువ కావాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ నేపథ్యంలో 2028లో జరగనున్న కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కేవలం అధికార పోరాటమే కాదు; 2029 లోక్‌సభ ఎన్నికలకు ముందు దక్షిణ భారత రాజకీయ సమీకరణాలను నిర్ణయించే కీలక ఎన్నికలుగా మారనున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ తన సీనియర్ సంస్థాగత వ్యూహకర్తలను, ఎన్నికల నిర్వహణ నిపుణులను రంగంలోకి దించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

కర్ణాటకలో కాంగ్రెస్ బలోపేతం.. బీజేపీలో అంతర్గత విభేదాలు

లోక్‌సభ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, రాజకీయ వ్యూహరచన ఇప్పటికే ప్రారంభమైంది. 2029 సాధారణ ఎన్నికలకు ముందు 2028లో తెలంగాణ, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ఈ రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ అధికారంలో ఉంది.కర్ణాటకలో కాంగ్రెస్ అంతర్గత సమీకరణాలను చక్కదిద్దుతూ నాయకత్వ మార్పును విజయవంతంగా నిర్వహించింది. మరోవైపు, ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ మాత్రం వర్గపోరుతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇటీవల జరిగిన శాసన మండలి ఎన్నికల్లో కూడా ఆ పార్టీ ఎమ్మెల్యేల క్రాస్‌ వోటింగ్‌ ఎదుర్కోవాల్సి వొచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *