‘ఇరిగేషన్‌’ భూముల్లో సౌర విద్యుదుత్పత్తి

– ఆ శాఖకు సొంత విద్యుత్ వనరుల సృష్టే లక్ష్యం
– ప్రాజెక్టుల ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేయాలి
– మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 9: రాష్ట్రంలోని నీటిపారుదల శాఖకు చెందిన అందుబాటులో ఉన్న భూములు, జలాశయాలు, కాలువ వ్యవస్థలను సౌర విద్యుత్ ఉత్పత్తికి వినియోగించే దిశగా కార్యాచరణ చేపట్టాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జలసౌధలో నీటిపారుదల ప్రాజెక్టుల విద్యుత్ అవసరాలపై మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన మంత్రి.. శాఖ కేవలం ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణకే పరిమితం కాకుండా స్వంత విద్యుత్ వనరులను సృష్టించుకునే దిశగా ముందడుగు వేయాలని సూచించారు. ముఖ్యంగా నీటిపారుదల శాఖ భూములు, కాలువలపై సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటును అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని స్పష్టం చేశారు.రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాలు, ఇతర నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణకు భారీ స్థాయిలో విద్యుత్ వ్యయం జరుగుతోందని మంత్రి పేర్కొన్నారు. దీర్ఘకాలికంగా విద్యుత్ వ్యయాన్ని తగ్గించడంతో పాటు పునరుత్పాదక ఇంధన వనరులను పెంపొందించేందుకు సౌర విద్యుత్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల అవకాశాలను విస్తృతంగా పరిశీలించాలని సూచించారు. ప్రతిపాదనల రూపకల్పన కోసం శాఖలోని సాంకేతిక నిపుణుల సేవలను వినియోగించుకోవడంతోపాటు అవసరమైతే బయటినుండి కూడా నిపుణ సంస్థల సహకారాన్ని తీసుకోవచ్చని మంత్రి తెలిపారు. ఇప్పటికే శాఖ వద్ద అందుబాటులో ఉన్న అధ్యయనాలు, ప్రజెంటేషన్లను వినియోగించి ఆలస్యం లేకుండా సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. అందుబాటులో ఉన్న ప్రతి నీటిపారుదల భూమిపై సౌర విద్యుత్ ప్రాజెక్టులే మొదటి ప్రాధాన్యం. ఇతర ఆదాయ వనరులపై తర్వాత దృష్టిపెట్టాలని మంత్రి స్పష్టం చేశారు. సమావేశంలో అధికారుల ప్రజెంటేషన్ ప్రకారం రాష్ట్రంలోని సుమారు 16 జలాశయాల వద్ద సాధ్యతా అధ్యయనాలు నిర్వహించారు. అనుకూలమైన జలాశయాలు, నీటిపారుదల భూముల్లో కేవలం 10 శాతం విస్తీర్ణాన్ని మాత్రమే వినియోగించినా 6,000 నుంచి 7,000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సృష్టించే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ ప్రతిపాదనపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి సంబంధిత చీఫ్ ఇంజనీర్లు, నోడల్ ఏజెన్సీలతో సమన్వయం చేసుకోవాలని మంత్రి సూచించారు. మంజీరా, సింగూరు వంటి జలాశయాల్లో తేలియాడే సౌర విద్యుత్ (ఫ్లోటింగ్ సోలార్) ప్రాజెక్టుల అవకాశాలను కూడా పరిశీలించాలని ఆదేశించారు. సమావేశంలో కాలువలపై సౌర విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన బిల్డ్-ఓన్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్ (బీఓటీ) నమూనా ప్రాజెక్టును అధికారులు వివరించారు. జాగోరా-చందోరా మధ్య సుమారు 15 కిలోమీటర్ల కాలువపై ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వ పెట్టుబడి లేదా భూసేకరణ అవసరం ఉండదని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా 20 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఏర్పడి, సంవత్సరానికి సుమారు 340 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుందని వివరించారు. ఇందులో ప్రాజెక్టు అవసరాలకు సుమారు 84 లక్షల యూనిట్లు వినియోగించుకుని, మిగిలిన 255 లక్షల యూనిట్ల విద్యుత్‌ను విక్రయించడం ద్వారా ఏటా సుమారు రూ.11.5 కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉందని తెలిపారు. అలాగే విద్యుత్ కొనుగోలు వ్యయంలో ఏటా రూ.6.2 కోట్ల వరకు ఆదా అవుతుందని, 25 సంవత్సరాల కాలంలో ఇది సుమారు రూ.155 కోట్ల పొదుపుకు దారి తీస్తుందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 8,000 ఎకరాలకు స్థిరమైన విద్యుత్, నీటి మద్దతు లభించడంతోపాటు పునరుత్పాదక ఇంధన వినియోగం, కాలువలలో నీటి ఉష్ణోగ్రత తగ్గడం, ఆవిరైపోయే నీటి పరిమాణం తగ్గడం వంటి పర్యావరణ ప్రయోజనాలు కూడా కలుగుతాయని వివరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *