3.43కోట్ల మందికి ‘స్మార్ట్’ ఆహార భద్రత

– 15న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం
– సీఎం కార్యక్రమ ఏర్పాట్లలో లోపం ఉండొద్దు
– పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 11: రాష్ట్రంలో ఆహార భద్రతకు ఇక ‘స్మార్ట’ రూపం రానుంది. రాష్ట్రవ్యాప్తంగా 3.43 కోట్ల మంది లబ్దిదారులకు సంబంధించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి స్వాతంత్య్ర దినోత్సవమైన 15వ తేదీన ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. సంగారెడ్డిలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించనుండగా అదే రోజు రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లో ఏకకాలంలో పంపిణీ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఏర్పాట్లపై పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ రోహిత్ సింగ్ తదితర ఉన్నతాధికారులతో మంత్రి మంగళవారం సమీక్ష నిర్వహించారు. సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్‌తోనూ మాట్లాడి ముఖ్యమంత్రి పర్యటన, బహిరంగ సభ ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,06,28,092 ఆహార భద్రత కార్డుల ద్వారా 3.43 కోట్ల మంది లబ్దిదారులు లబ్ది పొందుతున్నారని తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డుల ప్రవేశంతో ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత, సామర్థ్యం, లబ్దిదారుల సౌలభ్యం మరింత పెరుగుతాయని చెప్పారు.

ఏడాదిన్నరలో 16.32 లక్షల కొత్త కార్డులు

2025 జనవరి 26 నుంచి ఇప్పటివరకు 16,32,810 కొత్త ఆహార భద్రత కార్డులను జారీ చేసి వాటి ద్వారా 61,08,544 మంది లబ్దిదారులకు ఆహార భద్రత కల్పించినట్లు మంత్రి వెల్లడించారు. ఆగస్టు 2026 నాటికి రాష్ట్రంలో మొత్తం ఆహార భద్రత కార్డుల సంఖ్య 1.06 కోట్లకు చేరిందన్నారు. ఆహార భద్రత కార్యక్రమం ఏ స్థాయిలో కొనసాగుతోందో ఇందుకు ప్రభుత్వం చేస్తున్న వ్యయమే నిదర్శనమన్నారు. రేషన్ బియ్యం కోసం ఏటా సుమారు రూ.14 వేల కోట్లు, రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు మరో రూ.20 వేల కోట్ల వరకు ప్రభుత్వం వెచ్చిస్తోందని తెలిపారు.

లబ్ధిదారుడికి ఇబ్బంది కలగొద్దు

సంగారెడ్డి కార్యక్రమాన్ని ప్రతిష్థాత్మకంగా నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. లబ్దిదారుల తరలింపు, సీటింగ్, భద్రత, కార్డుల పంపిణీతోపాటు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ప్రతీ అంశాన్ని ముందుగానే పకడ్బందీగా ప్రణాళిక చేయాలన్నారు. కార్యక్రమానికి సంబంధించిన మినిట్-టు-మినిట్ షెడ్యూల్ సిద్ధం చేసి నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని సూచించారు. వాస్తవ లబ్దిదారులను గుర్తించి ముఖ్యమంత్రి చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డులు అందించాలన్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా కార్డుల పంపిణీలో లబ్దిదారుల గుర్తింపును ధ్రువీకరించి, పూర్తి పారదర్శకతతో కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మిగిలిన జిల్లాల్లో నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించి కలెక్టర్లకు స్పష్టమైన మార్గదర్శకాలు పంపాలని, అవసరమైన వ్యయంపై ముందుగానే స్పష్టత ఇవ్వాలని పౌర సరఫరాల శాఖ అధికారులకు సూచించారు.

ప్రతి అర్హుడికీ ఆహార భద్రతే లక్ష్యం

‘రాష్ట్రంలో 1.06 కోట్ల ఆహార భద్రత కార్డుల ద్వారా 3.43 కోట్ల మంది ప్రజలకు ఆహార భద్రత కల్పిస్తున్నాం.. ప్రతి అర్హుడికి నెలకు ఆరు కిలోల సన్న బియ్యాన్ని ఉచితంగా అందిస్తున్నాం.. ఇంత భారీ సంక్షేమ కార్యక్రమాన్ని మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా లబ్దిదారుడి చెంతకు తీసుకెళ్లడమే స్మార్ట్ రేషన్ కార్డుల లక్ష్యం’ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ ఆహార భద్రత కార్యక్రమం విస్తృతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. 1.06 కోట్ల కార్డులు-3.43 కోట్ల లబ్దిదారులు-ఉచిత సన్న బియ్యం వంటి కీలక అంశాలతో ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాతోపాటు షార్ట్ వీడియోలు, రీల్స్ ద్వారా విస్తృత ప్రచారం చేపట్టాలని సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *