-నిస్సారం, నిష్ఫలం, నిరర్థకం…ఇదీ రేవంత్ పాలన
-ప్రజాదర్బార్ ఫిర్యాదులు చెత్త కుప్పల్లో
-ప్రజాభవన్లో జల్సాలు, విందులు
– మంత్రుల భారీ కుంభకోణాలు
– అటకెక్కిన ఆరు గ్యారంటీలు
– ఇది కాంగ్రెస్ కాదు “స్కాంగ్రెస్”
– మాజీ మంత్రి హరీష్రావు విమర్శ
కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్న కడగండ్లకు రెండేళ్లు ముగిసాయని బీఆర్ ఎస్ నేత హరీష్రావు విమర్శించారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్లో మాట్లాడుతూ కాంగ్రెస్కు ఇంకా మిగిలింది రెండేళ్లే. మూడో ఏడాది ఎన్నికల హడావిడే. ఈ రెండేళ్ల రేవంతు రెండేళ్ల పాలనను మూడు మాటల్లో వివరించవచ్చు. అవి వరుసగా నిస్సారం, నిష్పలం, నిరర్ధకం. రేవంత్ రెడ్డి అనాలోచిత, అపసవ్య విధానాలతో రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలు చేసి, తిరోగమన బాట పట్టించిండు. ప్రజాదర్బార్ను ప్రహసనంగా మార్చాడన్నారు. ప్రజాదర్భార్ లో వచ్చిన ఫిర్యాదు కాపీలు చెత్త కుప్పల్లో, రోడ్ల మీద కుప్పలు కుప్పలుగా కనిపిస్తున్నాయన్నారు.
ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడని ప్రజాభవన్ ఇయ్యాల కాంగ్రెస్ నేతల జల్సాలు, విందులు, వినోదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిందన్నారు. పొద్దున బ్రేక్ ఫాస్ట్ మీటింగులు, మధ్యాహ్నం డిప్యూటీ సిఎం ఫ్యామిలీ సెటిల్మెంట్లు, సాయంత్రం గానా భజానాలు, సంగీత్ లు, పెళ్లిళ్లు, రిసప్షన్లతోని ప్రజాభవన్ ప్రీమియం భవన్ గా మారిందన్నారు. సీఎల్పీ మీటింగ్ లు పెట్టుకొని పార్టీ మీటింగ్ లకు అడ్డాగా మారింది. ఢిల్లీ బాసులకు గెస్ట్ హౌజ్ గా మార్చారన్నారు. మంత్రులు భారీ కుంభకోణాలకు పాల్పడుతున్నార న్నారు. మొదటి రోజు మొదటి అసెంబ్లీలోనే ఆరు గ్యారెంటీలకు చట్టబద్దత కల్పిస్తామని చెప్పిన హామీని తుంగలో తొక్కడంతో సోకాల్డ్ ప్రజాపాలన ప్రస్థానం ప్రారంభమైందన్నారు. ఆరు గ్యారంటీలను అటకెక్కించారు. తొలి అడుగులో మెట్రో రైలు రద్దు అన్నడు, హైద్రాబాద్ అభివృద్దికి అడ్డంపడ్డాడని విమర్శించారు. హైడ్రా పేరిట కూల్చివేతల అరాచకంతో సృష్టించాడు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ ఆగమైపోయిందన్నారు. ఇంత ఆర్గనైజుడ్ గా కరప్షన్ చేసిన ముఖ్యమంత్రి, మంత్రులు దేశంలో ఎక్కడ ఉండరు అనుకుంటానన్నారు. రేవంత్ రెడ్డి కి టాక్స్ కట్టలేక పెర్సెంటేజ్ లు ఇవ్వలేక కొందరు భవన నిర్మాణాల్నే వాయిదా వేసుకున్న సందర్భాలు అనేకమున్నాయన్నారు. దోచుకున్న దాంట్లో కొంత ఢిల్లీ కి కప్పం రూపం లో కడుతుండటం తో కాంగ్రెస్ అధిష్టానం అవినీతి విచ్చలవిడిగా జరుగుతున్నా చోద్యం చూస్తున్నదని ఆరోపించారు. అందుకే ప్రజలు కాంగ్రెస్ ను స్కాంగ్రెస్ అని పిలుచుకుంటారన్నారు. కాదేదీ స్కాంకు అనర్హం అని రేవంత్ రెడ్డి అనడమే కాదు, తన చేతలతో నిరూపిస్తున్నడాని ఎద్దేవా చేశారు. ఫీజు రీ ఇంబర్స్ మెంట్ పథకం కింద ఉన్న పాత బకాయిల చెల్లింపు తనకు సంబంధం లేనట్టుగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారన్నారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా సచివాలయం ఆర్థిక శాఖ కార్యాలయం ముందు కాంట్రాక్టర్లు ధర్నా చేశారని గుర్తు చేశారు. పీఆర్సీ గురించి అడిగితే ఉద్యోగ సంఘాల నేతలపై ఏసీబీ దాడుల పేరుతో వార్నింగులు, ఆరోగ్య శ్రీ బిల్లులు అడిగితే ఆసుపత్రులు మీద దాడులు చేయిస్తున్నడని ఆరోపించారు. హక్కులు అడిగినందుకు పోలీసులను బ్లాక్ మేయిల్ రాజకీయాలు చేస్తూ రేవంత్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నడన్నారు. 12 లక్షల ఎకరాల్లో, 8000 కోట్ల పంట నష్టం జరిగితే ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇచ్చింది లేదన్నారు. రైతులకు యూరియా కూడా అందడంలేదన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతుల బతుకులు సంక్షోభంలోకూరుకుపోయాయన్నారు. మద్యం దుకాణాలను గ్రామాలకు, గల్లీలకు మార్చేందుకు అనుమతినిచ్చింది. ఒకటి కాదు రెండు కాదు దాదాపు మూడు వేల కోట్లు కేవలం దరఖాస్తుల ద్వారానే దండుకున్నదని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ కు రూపాయి విడుదల చేయని రేవంత్ రెడ్డి, బడా కాంట్రాక్టర్లకు మాత్రం రూ.9000 కోట్లు విడుదల చేసిండన్నారు. దేశంలో ఎన్నికలు ఎక్కడ జరిగినా కలెక్షన్ మాత్రం తెలంగాణలో జరుగుతోందన్నారు. ఇప్పుడు మహిళలను కోటీశ్వరులను చేస్తాం అంటూ కొత్త కథలు చెబుతున్నారు. నెలకు రూ. 2500 ఇవ్వనోడు ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తాడట అని ఎద్దేవా చేశారు. రూ. 500కే గ్యాస్ సిలిండర్ అన్నారు. తీరా చూస్తే దానికి బొచ్చెడు నిబంధనలు. సగం మందికి వర్తించదు.. వర్తించిన వారికి సబ్సిడీ పడదన్నారు. బతుకమ్మ పండుగకు చీరెలు ఇవ్వడం బంద్ పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికల ముందు ఒక జత మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నదన్నారు. దళిత, గిరిజనుల సమగ్రాభివృద్ధి కోసం కేటాయించిన స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ ఎస్సీ/ ఎస్టీ/ ఎస్డీఎఫ్ నుండి గత రెండేళ్లలో ఏకంగా 20 వేల కోట్లను పక్కదారి పట్టించిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికే దక్కిందన్నారు. వేల మంది రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ బెన్ఫిట్స్ ఎగవెట్టి, విజయోత్సవాలు చేసుకుంటున్న ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నామన్నారు. జర్నలిస్టులకు రెండేళ్లలో కనీసం అక్రిడేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్నారు. దేవాదుల ఏ బేసిన్ లో ఉందో తెలియదు. బనకచర్ల ఏ బేసిన్లో కడుతున్నారో తెలియదు. ఖమ్మం జిల్లాలో పెద్దవాగు కొట్టుకుపోయింది. పాలమూరు జిల్లాలో వట్టెం పంప్ హౌజ్ జలమయమైంది. నల్గొండ లో ఎస్ ఎల్ బి సి కుప్ప కూలింది.కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల వద్ద మానేరుపై నిర్మించిన చెక్డ్యామ్ను బాంబులతో పేల్చేయడం దారుణం. మేడిగడ్డలో 85 పియ్యర్స్ ఉంటే అందులో ఒక పియ్యర్ కుంగిపోతే మొత్తం ప్రాజెక్టే కుప్ప కూలిందని ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి, రెండేళ్ల పాలనలో జరిగిన ఘటనలకు ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. 2014లో 30 శాతంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి డెలివరీలను రెట్టింపు కంటే ఎక్కువ చేశాం 70 % శాతానికి తీసుకు వెళ్ళాం. రెండేళ్ల పాలనలో ఇప్పుడు 55%కు పడిపోయాయన్నారు. హాంమినిస్ట్రీని ముఖ్యమంత్రే స్వయంగా చూస్తున్నా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లాపతా అయిందన్నారు. 23 తో పోలిస్తే 2024లో 9.8శాతం క్రైం రేట్ పెరిగింది. 2024 కంటే 2025 అక్టోబర్ వరకే ఇది 14 శాతం పెరిగింది. 2023లో 2.13 లక్షల కేసులు నమోదైతే 2024 లో వాటి సంఖ్య 2.24 లక్షలకు పెరిగింది. 2025 అక్టోబర్ నాటికి ఈ సంఖ్య 2.38 లక్షలకు చేరింది. నడిరోడ్డుపై హత్యలు, చైన్ స్నాచింగ్ లు, దొంగతనాలు కామన్ అయ్యాయి. 2024లో 856 మర్డర్ లు జరిగితే 2025 అక్టోబర్ నాటికి ఈ లిస్ట్ వెయ్యి దాటింది. 2023 తో పోలిస్తే మర్దర్ కేసులు 16 శాతం పెరిగాయి. దారుణం ఏంటంటే 2025 అక్టోబర్ వరకు నడిరోడ్డుపై 88 హత్యలు జరిగాయన్నారు. రేవంత్ పాలనలో పోలీసులకే రక్షణ లేదు..ఇక ప్రజల ప్రాణాలకు గ్యారెంటీ ఎక్కడిదని ప్రశ్నించారు.





