– అందాకా కదిలేది లేదని భీష్మించిన కేంద్ర మంత్రి బండి
– పోలీసులతో వాగ్వాదం
– నర్సంపేటకు తరలివస్తున్న ప్రజలు, కార్మికులు
– నర్సంపేట, ముత్తోజిపేటల్లో ఉద్రిక్తత
– పదేపదే మృతదేహం తరలింపును అడ్డుకుంటున్న పోలీసులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24 : ఆత్మహత్యకు యత్నించి మృతిచెందిన నర్పంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ భౌతికకాయాన్ని నర్సంపేట డిపోకు తీసుకెళితేనే ఆయన ఆత్మకు శాంతి చేకూరుతుందని కార్మికులు, కుటుంబ సభ్యులు పట్టుబట్టారు. శంకర్ గౌడ్ భౌతిక కాయాన్ని నర్సంపేట డిపోకు తీసుకెళితే పోలీసులకు అభ్యంతరం ఏమిటని కేంద్ర మంత్రి బండి సంజయ్ పోలీసులను నిలదీశారు. ఆర్టీసీ కార్మికులు, బీజేపీ శ్రేణుల ఆగ్రహావేశాలతో హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు పదేపదే అడ్డుకుని శవపేటికను రోడ్డుపైనే ఉంచడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శవ పేటిక తీసి శంకర్ గౌడ్ భౌతిక కాయాన్ని నర్సంపేట డిపోకు తీసుకెళ్లేందుకు కార్మికులు, బీజేపీ శ్రేణులు యత్నించారు. శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలంటే ఆయన 22 ఏళ్లుగా పనిచేస్తున్న నర్సంపేట డిపోకు తీసుకెళ్లాల్సిందేనని కుటుంబ సభ్యులు మిట్ట మధ్యాహ్నం మండుటెండలో నడిరోడ్డుపై బైఠాయించగా వారితో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా నిరసన తెలిపారు. పోలీసులు అనవసరంగా అడ్డుకుని శాంతిభద్రతలకు ఎందుకు విఘాతం కలిగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. శంకర్ గౌడ్ కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు ఆయన భౌతిక కాయాన్ని నర్సంపేట ఆర్టీసీ డిపోకు తరలించాలని కోరారు. ఆర్టీసీ కార్మికులు శంకర్ గౌడ్ను కడసారిగా చూసి నివాళులర్పిస్తే నష్టమేంటని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆదేశాలను బండి సంజయ్కు వరంగల్ పోలీస్ కమిషనర్ వివరించారు. నర్సంపేటకు ప్రజలు భారీగా చేరుకుంటున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ కార్మికులు శంకర్ గౌడ్ భౌతిక కాయాన్ని తరలించేందుకు అంబులెన్స్ను రప్పించగా అంబులెన్స్లోకి శంకర్ గౌడ్ భౌతిక కాయాన్ని కేంద్ర మంత్రి బండి తరలించారు.
ముత్తోజీపేటలో తీవ్ర ఉద్రికత : కేంద్ర మంత్రి ఒత్తిడితో తలొగ్గిన ప్రభుత్వం
ఇంతలోనే భౌతిక కాయాన్ని తమ అధీనంలోకి తీసుకున్న పోలీసులు
కేంద్ర మంత్రి సంజయ్ ఒత్తిడితో దిగొచ్చిన పోలీసులు ఆర్టీసీ సంఘాల, కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు నర్సంపేట డిపోకు శంకర్ గౌడ్ భౌతిక కాయాన్ని తరలిస్తున్నారు. మరికొద్ది క్షణాల్లో నర్సంపేట డిపోకు శంకర్ గౌడ్ భౌతిక కాయం చేరుకోనుండగా భౌతిక కాయాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. డెడ్ బాడీని నర్సంపేట డిపోకు తరలించే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. దీంతో ఆర్టీసీ కార్మికులు, బీజేపీ శ్రేణులు మళ్లీ నడిరోడ్డుపై భైఠాయించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ వద్దకు వచ్చి వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ మాట్లాడారు. భౌతిక కాయాన్ని నర్సంపేట డిపోకు తీసుకెళ్లేలా అనుమతించాల్సిందేనని కేంద్ర మంత్రి కరాఖండిగా చెప్పారు. పోలీసుల తీరుతో విసిగిపోయిన శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులు డెడ్ బాడీని మీ దగ్గరే ఉంచుకోండంటూ కేంద్ర మంత్రి వాహనంలోకి ఎక్కారు. మంత్రి కాన్వాయ్ను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు డెడ్ బాడీని తీసుకెళ్లడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తాము లేకుండా పోలీసులు అంత్యక్రియలు ఎట్లా నిర్వహిస్తారని కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. కుటుంబ సభ్యులను దించకపోతే కేంద్ర మంత్రి కాన్వాయ్ను పోనిచ్చేది లేదని పోలీసులు గట్టిగా చెప్పారు.మృతదేహాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో ఆర్టీసీ కార్మికులు, బీజేపీ శ్రేణులు మళ్లీ నడిరోడ్డుపైనే బైఠాయించారు. అయితే పోలీసుల తీరుపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తుండగా ఆర్టీసీ కార్మికులు, బీజేపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. దీంతో నర్సంపేటలో ఉద్రిక్తత కొనసాగుతున్నది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




