- లక్షలాదిగా భక్తులు తరలి వొచ్చే అవకాశం
- రవాణా, పారిశుద్ధ్యం, భద్రతా, వైద్యం పక్కాగా ఉండాలి
- సమ్మక్క – సారక్క జాతర అనుభవాలతో ఏర్పాట్లు చేయాలి
- అధికారులకు మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు ఆదేశం
జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర మే 6 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద ప్రవహించే “అంతర్వాహిని” సరస్వతీ నదీ పుష్కరాలకు (Saraswathi Pushkaralu 2025) పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. మంగళవారం మంత్రి సురేఖ ఆధ్వర్యంలో కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలపై సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. అత్యంత పవిత్రమైన ఈ త్రివేణి సంగమ పుష్కరాలకు మన రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది భక్తులు వొస్తారని తెలిపారు. సరస్వతీ నది పుష్కరాలు బృహస్పతి మిథున రాశి (మిథునరాశి )లోకి ప్రవేశించినప్పటి నుంచి 12 రోజుల పాటు జరుగుతాయని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో వొచ్చిన పుష్కరాలు తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడిన తర్వాత వొచ్చాయన్నారు. 2025 మే 14న రాత్రి 10.35 గంటలకు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించే సమయంలో పుష్కరకాలం ప్రారంభమవుతాయని, అప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి కావాలని స్పష్టం చేశారు. మరుసటి రోజు సూర్యోదయం నుంచి భక్తులు పుష్కర పుణ్యస్నానాలు ఆచరిస్తారని తెలిపారు.
ఈ పుష్కరాల నిర్వహణ కోసం ప్రభుత్వం చేపట్టిన ఏర్పాట్ల వివరాలు భక్తులకు సమగ్రంగా తెలిపేందుకు కాళేశ్వరం సరస్వతి పుష్కరాల వెబ్ పోర్టల్, మొబైల్ యాప్ను మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు ఇటీవల ప్రారంభించారు. ‘సరస్వతీ పుష్కరాలు’ పండుగకు స్నాన ఘాట్ల విస్తరణతో సహా వివిధ అభివృద్ధి పనులను విస్తృతం గా చేపట్టినట్లు మంత్రులు తెలిపారు. చిన్న చిన్న పనులు పెండింగ్ లో ఉన్నాయని… అవి కూడా పుష్కరాలు ప్రారంభమయ్యేలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. సమ్మక్క సారక్క జాతర, కొమురవెల్లి కల్యాణం, భద్రాచలం కల్యాణం మాదిరి ఈ పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించుటకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.
చలువ పందిళ్లు, టెంట్లు, శాశ్వత మరుగుదొడ్లు ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు వివరించారు. కాళేశ్వరంకు సంబంధించిన వివరాలన్నీ వెబ్ సైట్, యాప్ ద్వారా తెలియ జేయాలన్నారు. ఆర్టీసీ బస్సులను విస్తృతంగా నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. ప్రజా ప్రభుత్వం వచ్చాక అమలు చేసిన ఉచిత బస్సు పథకం ద్వారా దేవాదాయ శాఖకు ఆదాయం చేకూరిందని, మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయాలకు వస్తున్నట్టు మంత్రి కొండా సురేఖ వివరించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని మంత్రి సురేఖ సూచించారు. ‘ఉత్తరాన ప్రయాగ వద్ద, దక్షిణ భారతంలో కేవలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో మాత్రమే సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుందని మంత్రి కొండా తెలిపారు. పవిత్ర సరస్వతీ పుష్కర స్నానం చేసిన వారికి సమస్త పాపములు తొలగిపోతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వాసిస్తారని ఆమె తెలిపారు.
పీఠాధిపతులో పవిత్ర పుష్కర స్నానం…
సరస్వతి పుష్కరాల సందర్భంగా ప్రతి రోజు ఒక పీఠాధిపతి ఈ పుష్కర స్నానం చేయనున్నట్టు మంత్రి కొండా సురేఖ తెలిపారు. పుష్కర ప్రారంభం మే 15, 16వ తేదీన గురుమదనానంద సరస్వతి పీఠం, రంగంపేట, మెదక్ నుంచి మాధవానంద సరస్వతి స్వామి పాల్గొని సరస్వతి పుష్కరాలను ప్రారంభిస్తారన్నారు. ఈ సమీక్ష సమావేశంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, సీఎస్ రామకృష్ణరావు, డీజీపీ జితేందర్, దేవాదాయ శాఖ ప్రిన్స్ పల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, ఆర్ అండ్ బీ ప్రిన్స్ పల్ సెక్రటరీ వికాస్ రాజ్, పంచాయతి రాజ్ గ్రామీణాభివృద్ధి సెక్రటరీ లోకేష్. కుమార్, సెర్ఫ్ సీఈఓ దివ్యా దేవరాజన్, దేవాదాయ శాఖ కమిషనర్ వెంకటరావు, భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పి కిరణ్ ఖరే ఇతర శాఖల ఉన్నతాధికారులు, ఆలయ ఈఓ మహేశ్, ఆలయ ప్రధాన, ఉప ప్రధాన అర్చకులు తదితరులు పాల్గొన్నారు.