- ప్రకటించిన ఉద్యోగ సంఘాల జేఏసి
- మంత్రి పొన్నంతో చర్చలు సఫలం
- ముగ్గురు ఐఎఎస్లతో కమిటీ ఏర్పాటుకు నిర్ణయం
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 6 : తెలంగాణలో ఆర్టీసి సమ్మె (RTC strike ) వాయిదా పడింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో జరిపిన చర్చలు సఫలం కావడంతో ఆర్టీసి కార్మిక సంఘాల నేతలు సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. బుధవారం నుంచి రాష్ట్రంలో సమ్మె చేయనున్నట్లు కార్మిక సంఘాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చర్చలకు పిలుపునివ్వడంతో మంగళవారం తమ సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తో కార్మిక సంఘాల నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లారు. పలు సమస్యలపై చర్చించారు. అనంతరం మంత్రి పొన్నం మాట్టాడుతూ.. సమ్మె ఆలోచన విరమించుకోవాలని కార్మిక సంఘాల నేతలకు విజ్ఞప్తి చేశారు. సమ్మెకు వెళ్లి ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దని కోరారు. ఇప్పుడిప్పుడే సంస్థ కోలుకుంటుందని.. సమ్మె చేస్తే నష్టం జరుగు తుందని చెప్పారు. కార్మికుల సమస్యలను సిఎం దృష్టికి తీసుకెళ్తామని మంత్రి పొన్నం హా ఇచ్చారు. త్వరలోనే కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని మంత్రి చెప్పడంతో తాత్కాలికంగా సమ్మెను వాయిదా వేస్తున్నట్లు కార్మిక సంఘాల నేతలు వెల్లడించారు.
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కమిటీ
కాగా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో లోకేశ్ కుమార్, కృష్ణభాస్కర్, నవీన్ మిత్తల్ ఉంటారు. కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చించి వారంలోగా పరిష్కారం చూపాలని సర్కార్ ఆదేశాలిచ్చింది. కాగా తమ డిమాండ్లకు మంత్రి సానుకూలంగా స్పందించడంతో ఉద్యోగ సంఘాలు సమ్మెను వాయిదా వేసుకున్నాయి. ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మె వాయిదా వేస్తున్నట్లు సచివాలయం మీడియా పాయింట్ వద్ద వెల్లడించారు. పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ కోదండరాం, సీపీఐ ఎమ్మెల్యే సాంబశివరావులతో అనేక అంశాలపై చర్చించినట్లు పేర్కొన్నారు. ఆర్టీసీ యూనియన్ లపై ఆంక్షల తొలగింపు, అన్ని కేటగిరీల్లో ఖాలీ భర్తీ, గుర్తింపు ఎన్నికల నిర్వహణ, కారుణ్య నియామకాలు, ఉద్యోగ భద్రతపై సర్క్యూలర్, నేరుగా ఆర్టీసీకే ఎలక్ట్రిక్ బస్సులు, 2025 నుంచి రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ చెల్లింపులు, 2017లో రిటైర్ అయిన వారికి వేతన సవరణ ప్రకారం బెనిఫిట్స్ వంటి డిమాండ్లపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. అలాగే 2019 లో సమ్మె కాలంలో ఉద్యోగులపై వేసిన పోలీస్ కేసులను మాఫీ, ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికుల విలీనం చేయాలని కోరినట్లు వెల్లడించారు. తమ అని డిమాండ్లను విడతల వారీగా పరిష్కరిస్తామని సర్కార్ హామీ ఇచ్చిందని పేర్కొన్నారు.