ఫాస్ట్ ట్రాక్‌లో 22-ఏ పరిష్కారం

– ఉన్నతస్థాయి అధికారులతో కమిటీ ఏర్పాటు
-118 జీవో ప్రకారం నేటినుంచి రెగ్యులరైజేషన్
– అసెంబ్లీలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 18 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసన సభలో చేసిన ప్రకటనకు అనుగుణంగా 22-ఏకు సంబంధించిన అన్ని అంశాలను ఫాస్ట్ ట్రాక్‌లో పరిష్కరించడానికి ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి శుక్రవారం శాసనసభలో ప్రకటించారు. ఇందుకు సంబంధించి జీ.ఓ.ఆర్.టి నెం.564ను జారీ చేసినట్లు తెలిపారు. ఈ కమిటీకి చైర్మన్‌గా సీసీఎలఏ డి.ఎస్.లోకేష్ కుమార్ వ్యవహరిస్తారని, లా సెక్రటరీ పాపిరెడ్డి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు సభ్యులుగా ఉంటారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడిగా ఉన్నపుడు ఎల్బీనగర్ నియోజకవర్గంలోని పలు కాలనీల్లో ఉన్న రెగ్యులరైజేషన్ సమస్యను పరిష్కరిస్తానని ఇచ్చిన హామీ మేరకు ఆ నియోజకవర్గంలో 118 జీవో ప్రకారం 9,700 ప్లాట్ల రేగ్యులరైజేషన్‌కు సంబంధించిన మెమోను శుక్రవారం జారీ  చేసినట్లు చెప్పారు. ఈ జీవో ప్రకారం ఆ ప్రాంతంలో శనివారం నుంచి రెగ్యులరైజేషన్ ప్రక్రియ ప్రారంభిస్తున్నామని, ఇది నిరంతర ప్రక్రియ అని, ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని చెప్పారు. దశాబ్దాలుగా అక్కడ ప్లాట్లు తీసుకుని ఇండ్ల నిర్మాణం చేసుకున్న వారు 118 జీవో ప్రకారం స్థానిక అధికారులను సంప్రదించి నిబంధనల ప్రకారం రెగ్యులరైజ్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సింగరేణి ప్రాంతంలో ఇండ్ల స్ధలాల  రెగ్యులరైజేషన్‌కు సంబంధించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జీవో 76ను జారీ చేశారని, ఆ జీవోను అనుసరించి శనివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి రెగ్యులరైజేషన్ ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు. అలాగే రెవెన్యూ రికార్డులలో 22ఎలో ఉండి హెచఎండీఏ, డీటీసీపీ జీహెచ్ఎంసీ అనుమతులతో లేఅవుట్లు వేసిన ప్రాంతాలను 22ఎ నుంచి తొలగించే విషయంలో ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రకటించిన 10-12 అంశాలపై నెల రోజుల వ్యవధిలోనే నిర్ణయం తీసుకుని 22ఎ దరఖాస్తుదారులకు ఉపశమనం కల్పిస్తామని మంత్రి పొంగులేటి సభలో ప్రకటించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *