దేశవ్యాప్తంగా 9 మంది వీఐపీలకు ఎన్‌ఎస్‌జీ సెక్యూరిటీ తొలగింపు

కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు

న్యూదిల్లీ,అక్టోబర్‌16: హైరిస్క్‌ జాబితాలో ఉన్న 9 మంది వీఐపీలకు నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్స్‌(ఎన్‌ఎస్‌జీ) కమాండోలను విత్‌ డ్రా చేసుకుని వారి స్థానంలో సీఆర్‌పీఎఫ్‌ కమాండోలకు బాధ్యతలు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్లు అధికారిక వర్గాలు బుధవారం తెలిపాయి. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖప్రత్యేకంగా శిక్షణ పొందిన సిబ్బందితో కూడిన తాజా బెటాలియన్‌ను కూడా మంజూరు చేసింది. ఇటీవల పార్లమెంట్‌ సెక్యూరిటీ విధుల నుంచి ఉపసంహరించుకోబడిన సీఆర్‌పీఎఫ్‌-వీఐపీ సెక్యూరిటీ వింగ్‌ని ప్రముఖుల భద్రత కోసం వినియోగించనున్నారు. ప్రస్తుతం దేశంలో ఎన్‌ఎస్‌జీ ‘బ్లాక్‌ క్యాట్‌’ కమాండోల భద్రతలో 9 మంది వీఐపీలు ఉన్నారు. వీరందరికి కూడా సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌(సీఆర్‌పీఎఫ్‌)తో భద్రత కల్పిస్తారు. ఈ తరహా ‘’జెడ్‌ ప్లస్‌’’ కేటగిరీలో ఉన్నవారిలో ఉత్తర్‌ ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, యూపీ మాజీ సీఎం మరియు బీఎస్పీ అధినేత్రి మాయవతి, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, సీరియర్‌ బీజేపీ నేత ఎల్‌కే అద్వానీ, కేంద్ర షిప్పింగ్‌ మంత్రి సర్బానంద సోనోవాల్‌, ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం రమణ్‌ సింగ్‌ ఉన్నారు.

జమ్మ కాశ్మీర్‌ మాజీ సీఎం గులాం నబీ ఆజాద్‌, ఎన్సీ నేత ఫరూఖ్‌ అబ్దుల్లా వంటి ప్రముఖులు కూడా ఈ సెక్యూరిటీ కవర్‌లో ఉన్నారు. ఆరు వీఐపీ సెక్యూరిటీ బెటాలియన్లు కలిగిన సీఆర్‌పీఎఫ్‌, దీని కోసం ఏడో బెటాలియన్‌ని స్వీకరించాలని కోరింది. తాజా బెటాలియన్‌ కొన్ని నెలల క్రితం పార్లమెంట్‌ రక్షణగా ఉండేది. గతేడాది పార్లమెంట్‌లో సెక్యూరిటీ ఉల్లంఘటన తర్వాత, సీఆర్‌పీఎఫ్‌ని తీసేసి పార్లమెంట్‌ రక్షణని సీఐఎస్‌ఎఫ్‌కి అప్పగించారు. కొత్త టాస్క్‌ని చేపట్టడం కోసం ముఖ్యమంత్రి భద్రతను ఎన్‌ఎస్‌జీ నుంచి సీఆర్‌పీఎఫ్‌కి మార్చడానికి ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ టీం ఇటీవల దిల్లీ వెళ్లినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సమాచారం ప్రకారం.. ఈ తొమ్మిది మందిలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సీఆర్‌పీఎఫ్‌ చేపడుతున్న అధునాతన భద్రతా అనుసంధాన(ఏఎస్‌ఎల్‌) ప్రోటోకాల్‌ని కలిగి ఉంటారని తెలుస్తోంది.

ఏఎస్‌ఎల్‌ ప్రోటోకాల్‌ ప్రకారం.. వీఐపీలు సందర్శించాల్సిన ప్రదేశం మొత్తం భద్రతా అధికారుల నిఘాలోకి వెళ్లిపోతుంది. ఇలాంటి ప్రోటోకాల్‌ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, గాంధీ కుటుంబంలోని ముగ్గురితో సహా ఐదుగురికి ఈ ప్రోటోకాల్‌ ఉంది. యాంటీ టెర్రర్‌ ఆపరేషన్స్‌ నిర్వహిచే ఎన్‌ఎస్‌జీ కమాండోలను ఇకపై పూర్తిగా టెర్రర్‌ ఆపరేషన్లపై దృష్టిసారించేలా చేయడం కేంద్ర ప్లాన్‌గా తెలుస్తోంది. వీరిని వీఐపీ భద్రత విధుల నుంచి తప్పించే ప్రణాళిక 2012లోనే తయారైంది. కేంద్రం ఎన్‌ఎస్‌జీని పునర్నిర్మాణం చేయాలని భావిస్తోంది. ఎన్‌ఎస్‌జి తీవ్రవాద వ్యతిరేక మరియు హైజాక్‌కి వ్యతిరేక ఆపరేషన్స్‌ చేయడానికి వీలు కలుగుతుంది. వీఐపీ భద్రతా నుంచి ఎన్‌ఎస్‌జీని విత్‌ డ్రా చేసిన తర్వాత 450 మంది భద్రతా బాధ్యతల నుంచి రిలీవ్‌ అవుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *