చేనేత నేల నుంచి చందమామ దాకా…

  • అంతరిక్షాన్ని తాకిన సిరిసిల్ల యువతేజాలు
  • విక్రమ్‌-1 ‌విజయగాథలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఇంజినీర్ల అరుదైన ఘనత
  • రాజన్న సిరిసిల్ల జిల్లాకు దేశవ్యాప్తంగా గుర్తింపు…
  • సోషల్‌ ‌మీడియాలో ప్రశంసల వెల్లువ..

సిరిసిల్ల టౌన్‌, ‌ప్రజాతంత్ర 21:   రాజన్న సిరిసిల్ల (Rajanna Sirisilla)చేనేత కార్మిక క్షేత్రంగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నేల. మగ్గం శబ్దాలతో మారుమోగే ఈ గడ్డ నుంచి ఎన్నో ప్రతిభావంతులు వివిధ రంగాల్లో తమ సత్తా చాటుతున్నారు. ఇప్పుడు అదే సిరిసిల్ల పేరు అంతరిక్ష రంగంలోనూ మార్మోగుతోంది. భారత ప్రైవేట్‌ అం‌తరిక్ష చరిత్రలో మైలురాయిగా నిలిచిన విక్రమ్‌-1 (Vikram-1)  ‌రాకెట్‌ ‌విజయగాథలో సిరిసిల్లకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువ ఇంజినీర్లు కీలక పాత్ర పోషించి జిల్లా ఖ్యాతిని ప్రపంచ వేదికపై నిలబెట్టారు. చేనేత కార్మిక క్షేత్రం నుంచి చందమామ దాకా సాగిన ఈ విజయ ప్రస్థానంపై ప్రజాతంత్ర ప్రత్యేక కథనం…

 భారత అంతరిక్ష చరిత్రలో కొత్త అధ్యాయం..

శ్రీహరికోటలోని సతీష్‌ ‌ధావన్‌ అం‌తరిక్ష కేంద్రం (షార్‌) ‌నుంచి హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్‌ ఏరోస్పేస్‌ ‌ప్రైవేట్‌ ‌లిమిటెడ్‌ ‌రూపొందించిన తొలి ఆర్బిటల్‌ ‌ప్రయోగ వాహకం విక్రమ్‌-1 ‌విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. తొలి ప్రయత్నంలోనే ఉపగ్రహాలను దిగువ భూకక్ష్యలో ప్రవేశపెట్టి భారత ప్రైవేట్‌ అం‌తరిక్ష రంగం ప్రపంచ వేదికపై తన సత్తా చాటింది. ఈ విజయంతో భారత అంతరిక్ష పరిశోధనలో మరో చారిత్రక అధ్యాయం ప్రారంభమైనట్లు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్‌ ఏరోస్పేస్‌ ‌సంస్థ రూపొందించిన విక్రమ్‌-1 ‌రాకెట్‌ ‌విజయవంతమైన ప్రయోగంలో సిరిసిల్లకు చెందిన ముగ్గురు యువ ఇంజినీర్లు అత్యంత కీలక బాధ్యతలు నిర్వహించారు. రాకెట్‌ ‌రూపకల్పన నుంచి ప్రయోగానికి ముందు జరిగే సాంకేతిక పరీక్షలు, విద్యుత్‌ ‌వ్యవస్థల సమీకరణ వరకు ప్రతి దశలోనూ తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఒక రాకెట్‌ ‌విజయవంతం కావడానికి వేలాది గంటల పరిశోధన, ఖచ్చితమైన సాంకేతిక నైపుణ్యం అవసరం. అలాంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో సిరిసిల్ల యువత భాగస్వాములు కావడం జిల్లాకు దక్కిన గొప్ప గౌరవంగా చెప్పవచ్చు.

ముగ్గురు… మూడు కీలక బాధ్యతలు..

ఈ ప్రయోగంలో అడుప సంతోష్‌ ‌కుమార్‌ అవియానిక్స్ ‌చెక్‌ అవుట్‌ ‌లీడ్గా రాకెట్‌లోని అన్ని ఎలక్ట్రానిక్‌ ‌వ్యవస్థల తనిఖీలు, పరీక్షలు, ప్రయోగానికి ముందు జరిగే కీలక గ్రౌండ్‌ ‌చెక్‌అవుట్‌ ‌కార్యకలాపాలకు నాయకత్వం వహించారు. అడుప కిరణ్‌ ‌రాకెట్‌ ‌సి ఎ డి డిజైనర్‌గా రాకెట్‌ ‌నిర్మాణ రూపకల్పన, డిజైన్‌ ‌పనుల్లో కీలక పాత్ర పోషించగా, బొమ్మదేని నాగరాజు ఎలక్ట్రికల్‌ ఇం‌టిగ్రేషన్‌ ఇం‌జినీర్గా రాకెట్‌ ‌విద్యుత్‌ ‌వ్యవస్థల సమీకరణను సమర్థవంతంగా పూర్తి చేశారు. ఈ ముగ్గురి కృషి విక్రమ్‌-1 ‌విజయానికి బలమైన సాంకేతిక ఆధారంగా నిలిచింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువ ఇంజినీర్లు ఒకే అంతరిక్ష ప్రయోగంలో కీలక బాధ్యతలు నిర్వహించడం దేశంలోనే అరుదైన సంఘటనగా నిలిచింది. సాధారణంగా ఒక కుటుంబంలో ఒకరు మాత్రమే శాస్త్ర, సాంకేతిక రంగాల్లో రాణించడం చూస్తుంటాం. కానీ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు ఒకే రాకెట్‌ ‌ప్రయోగ విజయానికి తమ మేధస్సును అందించడం విశేషం. వారి విజయం కుటుంబ సభ్యులకే కాకుండా మొత్తం రాజన్న సిరిసిల్ల జిల్లాకు గర్వకారణంగా మారింది. దేశ ప్రతిష్ఠను ప్రపంచ వేదికపై నిలబెట్టిన ఈ చారిత్రక విజయగాథలో సిరిసిల్ల పేరు కూడా చిరస్థాయిగా నిలిచిపోయిందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

యువతకు స్ఫూర్తి..

చేనేతకు ప్రసిద్ధి చెందిన సిరిసిల్ల ఇప్పుడు విజ్ఞానం, సాంకేతికతకు కూడా చిరునామాగా మారుతోంది. గ్రామీణ ప్రాంతం నుంచి ఉన్నత విద్యను అభ్యసించి ప్రపంచ స్థాయి అంతరిక్ష ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించడం ద్వారా ఈ ముగ్గురు యువ ఇంజినీర్లు కొత్త తరానికి ఆదర్శంగా నిలిచారు. కష్టపడితే చిన్న పట్టణం నుంచి కూడా ప్రపంచ వేదికపై నిలబడవచ్చని వారు తమ విజయంతో నిరూపించారు. జిల్లాలోని విద్యార్థులు, ఇంజినీరింగ్‌ ‌చదువుతున్న యువత ఈ విజయాన్ని ఆదర్శంగా తీసుకుని పరిశోధన, అంతరిక్ష, సాంకేతిక రంగాల్లో ముందుకు సాగాలని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. విక్రమ్‌-1 ‌ప్రయోగం విజయవంతం కావడంతో పాటు సిరిసిల్ల యువ ఇంజినీర్ల ఘనత సోషల్‌ ‌మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. ఫేస్‌బుక్‌, ఎక్స్, ‌వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ‌వంటి వేదికల్లో వారి ఫొటోలు, వివరాలు విస్తృతంగా షేర్‌ అవుతున్నాయి. ‘‘చేనేత నగరి నుంచి అంతరిక్ష విజయగాథ వరకు’’, ‘‘సిరిసిల్ల నుంచి స్పేస్‌ ‌వరకు’’, ‘‘మన జిల్లా… మన గర్వం’’ అంటూ నెటిజన్లు అభినందనలు తెలియజేస్తున్నారు.
ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యావేత్తలు, యువజన సంఘాలు కూడా ఈ ముగ్గురు ఇంజినీర్లను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వారి విజయం సిరిసిల్ల యువతలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచిందని పలువురు పేర్కొంటున్నారు.

సిరిసిల్లకు దక్కిన అపూర్వ గౌరవం..

ఇప్పటివరకు చేనేత పరిశ్రమతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సిరిసిల్ల… ఇప్పుడు అంతరిక్ష రంగంలోనూ తన ప్రతిభను చాటుకోవడం జిల్లా చరిత్రలో మరో మైలురాయిగా నిలిచింది. భారత అంతరిక్ష రంగం సాధించిన ఈ విజయగాథలో సిరిసిల్ల యువత భాగస్వాములు కావడం జిల్లాకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. ఈ ముగ్గురు యువ ఇంజినీర్ల విజయం భవిష్యత్‌ ‌తరాలకు స్ఫూర్తిగా నిలవనుంది. విజ్ఞానం, సాంకేతికత, పరిశోధన రంగాల్లో మరింత మంది యువత ముందుకు రావడానికి ఇది మార్గదర్శకంగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతరిక్ష రంగంలో సిరిసిల్ల యువత సాధించిన ఈ ఘనత జిల్లాలోని విద్యార్థులకు కొత్త స్ఫూర్తిని అందిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ నాణ్యమైన విద్య, పట్టుదల, కృషి ఉంటే ప్రపంచ స్థాయి ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావచ్చని ఈ ముగ్గురు యువ ఇంజినీర్లు నిరూపించారు. వీరి విజయాన్ని ఆదర్శంగా తీసుకొని మరింత మంది విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక రంగాల వైపు అడుగులు వేయాలని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *