– రెండు గంటలపాటు బురద నీటిలోనే
న్యూదిల్లీ, సెప్టెంబర్ 3 : నేపాల్ను అతలాకుతలం చేస్తున్న వరదల్లో 91 ఏళ్ల వృద్ధురాలి పోరాటం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. మెడ వరకు బురదలో కూరుకుపోయి, జేసీబీ స్కూప్లో కూర్చుని ఉన్న గుణ మాయ బోహరా చిత్రం ఈ విపత్తులో ఆశకు, మొక్కవోని సంకల్పానికి ప్రతీకగా నిలిచింది. నువాకోట్లోని దేవీఘాట్లో ఉన్న సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆశ్రమంలోని వారు అల్పాహారం తీసుకుంటున్న సమయంలో ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. చాలామంది పై అంతస్తులకు పరుగులు తీసినప్పటికీ కొందరు తప్పించుకోలేకపోయారు. ఈ దుర్ఘటనలో ఏడుగురు వృద్ధులు ప్రాణాలు కోల్పోయారు. కింది అంతస్తులోని గదిలో ఉన్న గుణ మాయ బోహరా వరద నీరు వేగంగా గదిలోకి వస్తున్నా ధైర్యం కోల్పోలేదు. కాళ్లకు సంబంధించిన అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కిటికీ తలుపులు తెరిచి రెండు నుంచి మూడు గంటలపాటు బురద నీటిలో తన తలను పైకి ఉంచి ప్రాణాలతో నిలిచారు. స్థానిక వలంటీర్లు ఆమెను గుర్తించి సురక్షితంగా వెలికితీశారు. అనంతరం ఆమెను, మిగిలిన వారిని ఖాట్మండులోని ఒక తాత్కాలిక శిబిరానికి తరలించారు. ప్రస్తుతం వారంతా ఆహారం, వైద్య సదుపాయాలతో క్షేమంగా ఉన్నారు. ఈ వరదల వల్ల నేపాల్లో ఇప్పటివరకు 1,252 మంది మరణించినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నేపాల్లో సుమారు 4,216 మంది, టిబెట్లో మరో 541 మంది గల్లంతయ్యారు.
—————————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు



