– సాగు నీటి ప్రాజెక్టులకు రూ.5 వేల కోట్ల విడుదలకు లైన్ క్లియర్
– మిడ్మానేరు ఎడమ కాల్వ పనులు వెంటనే పునఃప్రారంభించాలి
– అనుమతుల పేరుతో పనులు ఆగొద్దు.. కలెక్టర్లకు ఆదేశాలు
– పత్తిపాక డీపీఆర్ నెలాఖరులోగా సిద్ధం
– రోళ్లవాగుకు అటవీ అనుమతులు వేగవంతం చేయాలి
-మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 8: రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, పునరావాసం-పునర్నిర్మాణం కోసం ప్రాధాన్యత ప్రాతిపదికన రూ.5 వేల కోట్లు సమకూర్చేందుకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి హామీ ఇచ్చారని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్రెడ్డి వెల్లడించారు. ఇందులో ఇప్పటికే రూ.2 వేల కోట్లు విడుదలయ్యాయని, మిగిలిన రూ.3 వేల కోట్ల విడుదల ప్రక్రియలో ఉందని తెలిపారు. నిధుల కొరత కారణంగా పూర్తికి చేరువలో ఉన్న ఏ సాగునీటి ప్రాజెక్టు కూడా నిలిచిపోవడానికి వీల్లేదని స్పష్టం చేశారు. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల పరిధిలో కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టులపై శనివారం నిర్వహించిన సమగ్ర సమీక్షలో ఉత్తమ్కుమార్రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్బాబు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్, ప్రజాప్రతినిధులు, నాలుగు జిల్లాల కలెక్టర్లు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు.
భూసేకరణకు నిధులు అడగండి.. ఆలస్యం చేయొద్దు
ప్రాజెక్టుల నిర్మాణంలో భూసేకరణ, ఆరఅండఆర్, అటవీ, పర్యావరణ అనుమతులను సాధారణ పరిపాలనాంశాలుగా చూడకుండా అత్యంత ప్రాధాన్యతాంశాలుగా తీసుకోవాలని కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. ఏ ప్రాజెక్టుకు ఎంత నిధి అవసరమో వెంటనే ప్రతిపాదనలు పంపాలని, అవసరమైన ఆర్థిక అనుమతులు, టోకెన్లు పొందడంలో జాప్యం చేయవద్దని సూచించారు. ఇంజినీరింగ్ పనులు కొనసాగుతుండగానే సాధ్యమైన ప్రాంతాల్లో భూసేకరణ, భూ యజమానులకు పరిహారం చెల్లింపు, నిర్వాసిత కుటుంబాల పునరావాస ప్రక్రియను సమాంతరంగా చేపట్టాలని స్పష్టం చేశారు. ఇప్పటికే వేల కోట్ల ల ప్రజాధనం వెచ్చించిన ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తి చేసి వాటి ఫలాలను రైతులకు అందించడంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారని ఉత్తమ్ తెలిపారు.
మిడ్ మానేరు ఎడమ కాల్వకు మళ్లీ కదలిక
సుమారు నాలుగున్నరేళ్లుగా నిలిచిపోయిన మిడ్ మానేరు ఎడమ కాలువ మిగులు పనులను తక్షణమే పునఃప్రారంభించాలని మంత్రి ఆదేశించారు. పనులకు అడ్డంకిగా మారిన భూ సంబంధిత సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. సవరించిన అంచనాలు సిద్ధం చేయడం, భూసేకరణ, టెండర్ల ప్రక్రియ, చట్టబద్ధ అనుమతుల సాధన.. ఇవన్నీ ఒకదాని తర్వాత మరొకటి కాక సమాంతరంగా ముందుకు సాగాలని స్పష్టం చేశారు. ప్రక్రియల పేరుతో మరోసారి పనులు నిలిచిపోకుండా నిర్దిష్ట కాలపరిమితితో కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు.
పత్తిపాకతో 2.40 లక్షల ఎకరాల ఆయకట్టుకు భరోసా
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ప్రతిపాదించిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి పత్తిపాక రిజర్వాయర్ను వేగంగా ముందుకు తీసుకెళ్లాలని ఉత్తమ్ ఆదేశించారు. ఈ పథకం ద్వారా కొత్తగా పదివేల ఎకరాలకు సాగునీరు అందించడంతోపాటు కాకతీయ ప్రధాన కాల్వలో డి-83 నుంచి డి-94 వరకు ఉన్న 2.40 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ధర్మపురి, చొప్పదండి, పెద్దపల్లి, రామగుండం, మంథని నియోజకవర్గాలకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరనుంది. పత్తిపాక వద్ద 3 టీఎంసీలు లేదా 5 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించే రెండు ప్రత్యామ్నాయాలను అధికారులు పరిశీలిస్తున్నారు. లైడార్ సర్వే, డేటా ప్రాసెసింగ్ ఇప్పటికే పూర్తయ్యాయని, బోర్హోల్ డ్రిల్లింగ్, ట్రయల్ పిట్స్, జియోటెక్నికల్ పరిశోధనలు కొనసాగుతున్నాయని అధికారులు మంత్రికి వివరించారు. ఈ నెలాఖరులోగా డీపీఆర్ సమర్పిస్తామని తెలిపారు.
రోళ్లవాగు 96 శాతం పూర్తి
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని రోళ్లవాగు ప్రాజెక్టుపైనా మంత్రి ప్రత్యేకంగా సమీక్షించారు. ఇప్పటికే ప్రాజెక్టు పనులు 96 శాతం పూర్తయ్యాయి. ప్రస్తుతం ఉన్న 0.250 టీఎంసీల నిల్వ సామర్థ్యాన్ని 0.949 టీఎంసీలకు పెంచి, స్థానిక పరీవాహక ప్రాంతం నుంచి లభించే నీటిని సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా చివరి ఆయకట్టులోని దాదాపు 15 వేల ఎకరాలకు సాగునీటి భరోసా కల్పించడం ప్రాజెక్టు లక్ష్యం. మూడు బండ్లు, సర్ప్లస్ వీర్, హెడ్ స్లూయిస్లు సహా ప్రధాన నిర్మాణాలు దాదాపుగా పూర్తయ్యాయి. అయితే బండ్-2లో కొంత భాగం అటవీ భూమిలో ఉండటంతో మిగిలిన పనులు అటవీ అనుమతుల కోసం ఎదురు చూస్తున్నాయి. ప్రత్యామ్నాయ అటవీకరణకు అవసరమైన భూమిని ఇప్పటికే గుర్తించడంతోపాటు వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించిన మిటిగేషన్ ప్లాన్కు ఆమోదం లభించినట్లు అధికారులు వివరించారు. మిగిలిన అనుమతుల ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.
ప్రతీ సమస్యకు ‘యాక్షన్ పాయింట్’
ప్రాజెక్టుల వారీగా పెండింగ్లో ఉన్న భూసేకరణ, ఆరఅండఆర్, అటవీ, పర్యావరణ అనుమతులపై ప్రత్యేక జాబితా సిద్ధం చేయాలని ఉత్తమ్ ఆదేశించారు. ఏ ప్రాజెక్టులో ఏ సమస్య ఉంది.. దాని పరిష్కారానికి ఎంత నిధి అవసరం.. ప్రస్తుతం ఏ దశలో ఉంది.. ఎప్పటిలోగా పరిష్కరిస్తారు అనే అంశాలన్నింటినీ స్పష్టంగా నమోదు చేయాలని చెప్పారు. సమీక్షలో ప్రజాప్రతినిధులు ప్రస్తావించిన ప్రతీ సమస్యను ‘యాక్షన్ పాయింట్’గా మార్చాలని, తదుపరి సమావేశం నాటికి వాటిపై తీసుకున్న చర్యల నివేదికను సమర్పించాలని అధికారులకు స్పష్టం చేశారు. ‘భూసేకరణ, ఆర్అండ్ఆర్ లేదా అటవీ అనుమతుల కారణంగా ఏ సాగునీటి ప్రాజెక్టు నిలిచిపోయినా వెంటనే ప్రతిపాదనలు పంపండి. నిధులకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది.. ప్రాజెక్టులను పూర్తి చేసి నిర్దేశిత ఆయకట్టుకు మరింత ఆలస్యం లేకుండా నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం’ అని ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. సమీక్షలో నాలుగు జిల్లాల కలెక్టర్లతో పాటు ఇంజినీర్-ఇన్-చీఫ్ (జనరల్) ఓ.వి.రమేష్బాబు, నీటిపారుదల శాఖ జాయింట్ సెక్రటరీ కె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





