*పారదర్శకతను పాటించండి
*సంప్రదింపులకు ముందే ప్రాజెక్టు సంబంధిత పూర్తి సమాచారాన్ని బహిర్గతం చేయాలి
*’నదీ పునరుజ్జీవనం’ ముసుగులో నదులను కాంక్రీటీకరించడాన్ని MJA వ్యతిరేకిస్తోంది
*క్యాబినెట్ సబ్ కమిటీ కీ MJA లేఖ
“మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్ “ కోసం ప్రభుత్వం చేపట్టే ఏవైనా సంప్రదింపులు అర్థవంతంగా ఉండాలంటే, ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ముందుగా బహిరంగ పరచాలని మూసీ జనాందోళన్ వేదిక(MJA) డిమాండ్ చేసింది . శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో “ప్రభుత్వం ప్రాజెక్ట్ వివరాలను వ్యూహాత్మక రహస్యంగా ఉంచుతున్నంత కాలం ప్రజాస్వామ్యబద్ధమైన చర్చలు జరగడం అసాధ్యమని, అందుకే అన్ని దశల డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ (DPRలు), మురుగునీటి నిర్వహణ ప్రణాళికలు, వరద నియంత్రణ వ్యూహాలు మరియు పర్యావరణ ప్రభావ అంచనా రికార్డులను, G.O. 921 (తేది 16/12/25) ప్రకారం, భూసేకరణ కోసం 10,017 నిర్మాణాలు మరియు 3,279 ఎకరాల భూమిని గుర్తించడానికి వినియోగించిన వ్యూహాలు ఇంగ్లీష్, తెలుగు, మరియు ఉర్దూ భాషల్లో ప్రజలకు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేసింది. ప్రస్తుత ప్రాజెక్ట్ నమూనా పర్యావరణ పునరుద్ధరణ కంటే వాణిజ్యపరమైన కాంక్రీట్ కట్టడాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తోందని, దీనివల్ల మొదటి రెండు దశల్లోనే దాదాపు 12,000 కుటుంబాలు నిరాశ్రయులయ్యే ప్రమాదం ఉందని MJA ఆందోళన వ్యక్తం చేసింది. భూసేకరణ, పునరావాస చట్టం (LARR చట్టం, 2013) ప్రకారం, తప్పనిసరి ‘సామాజిక ప్రభావ మదింపు (SIA)’ చేయాలి. కానీ SIA నుండి ప్రాజెక్ట్కు మినహాయింపునిస్తూ, ప్రభుత్వం జారీ చేసిన జీఓ నం. 921ని MJA తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. 2017లో రాష్ట్ర ప్రభుత్వం LARR చట్టం, 2013 లో చేసిన తిరోగమన సవరణను తక్షణమే రద్దు చేయాలని MJA డిమాండ్ చేసింది. కాలుష్య నియంత్రణ లేకుండా కేవలం రివర్ఫ్రంట్ నిర్మించడం వల్ల వరద ముప్పు పెరుగుతుందని, ఇది శాస్త్రీయంగా మరియు రాజకీయంగా తప్పని పేర్కొన్నారు. ఈ సమగ్ర నివేదికను సమర్పించి 10 రోజులు గడుస్తున్నా, ప్రభుత్వం నుండి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక స్పందన రాలేదు. కేబినెట్ సబ్-కమిటీకి త్వరలోనే స్పందించి, మా విజ్ఞాపనలో పేర్కొన్న సమాచారం మరియు పత్రాలన్నింటినీ బహిరంగం చూస్తుందని మేము ఆశిస్తున్నాము. వాటిని విశ్లేషించిన అనంతరం, మా ఆందోళనలు మరియు సూచనల గురించి కమిటీని కలిసి వివరించడానికి మేము మరింత మెరుగైన స్థితిలో ఉంటామని మూసీ జన ఆందోళన్ – మూసీ నది, దాని తీర ప్రాంత ప్రజల హక్కుల రక్షణ పనిచేస్తున్న స్వతంత్ర, రాజకీయేతర ప్రజా ఉద్యమం ప్రకటనలో పేర్కొన్నారు.
ఇతర వివరాలకు ఇ-మెయిల్: musijanandolan@gmail.com





