– డిప్యూటీ క‌లెక్ట‌ర్‌ రామునాయ‌క్ స‌స్సెన్ష‌న్‌
– అక్ర‌మ రిజిస్ట్రేష‌న్ల‌కు పాల్ప‌డిన‌ట్టు నిర్ధార‌ణ‌
– స‌హ‌క‌రించిన ఉద్యోగుల్లో ఒక‌రు డిస్మిస్‌, మ‌రొక‌రు స‌స్పెన్ష‌న్‌
– స‌బ్ రిజిస్ట్రార్ల పాత్ర‌పై కూడా విచార‌ణ‌
– అక్ర‌మ సేల్ డీడ్‌ల ర‌ద్దుకు ఆదేశం
– రెవెన్యూ మంత్రి పొంగులేటి 
హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూన్ 8: బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ భూములను కొల్లగొట్టిన‌ వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టర్ గా పనిచేస్తున్న రామునాయ‌క్ 2013 నుంచి 2018 వరకు  డిప్యూటేషన్‌పై  హౌసింగ్ బోర్డులో ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ (ఎల్ఎఓ)గా బాధ్యతలు నిర్వహించారు. ఈ సమయంలో అనేక భూ దందాలకు, అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడినట్లు ప్రాథ‌మికంగా నిర్ధారణ కావడంతో తక్షణమే ఆయ‌న‌ను సస్పెండ్ చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి ప్రకటించారు. హైదరాబాద్ క్యూర్ పరిధిలో పేదలకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి స్ధలాల గుర్తింపు కోసం హౌసింగ్ బోర్డు భూములను పరిశీలిస్తున్న సమయంలో రాము నాయ‌క్ భూలీలలు బయటకు వచ్చాయని తెలిపారు. బహిరంగ మార్కెట్లో గజం రూ.2 లక్షలకు పైగా విలువ చేసే హైకోర్టు  5-6  గేట్ల మధ్య ఉన్న హౌసింగ్ బోర్డుకు చెందిన 33.53 చదరపు గజాల స్దలాన్ని రాము నాయ‌క్  2018 ఫిబ్రవరి 17న అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించినట్లు బయటపడింది. దీనిపై లోతైన విచారణ జరపగా ఆయ‌న‌ భూదందాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. రామునాయ‌క్ హౌసింగ్ బోర్డు ఎల్ఎఓగా, గతంలో హౌసింగ్  బోర్డులో వర్క్ ఇన్స్‌పెక్టర్ గా పనిచేసి ఉద్యోగం నుంచి తొలగించ‌బ‌డిన‌  ఇఫ్తాకర్ అహ్మద్ భార్య సుబియా సుల్తానా పేరిట ఈ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన ఈ పైకం నేటి వరకు బోర్డుకు జమకాలేదన్నారు. ఈ భూమికి సంబంధించిన పత్రాలను బోర్డు అనుమతులను పరిశీలించకుండా రిజిస్ట్రేషన్ చేసిన నాటి చార్మినార్ సబ్ రిజిస్ట్రార్ పై కూడా విచారణకు ఆదేశించామని మంత్రి తెలిపారు. ఇదిలాఉండగా  2025 ఏప్రిల్ లో ఈ భూమిని సుబియా సుల్తానా మరొకరికి విక్రయించారు. ఈ మొత్తం వ్యవహారంపై కూడా ప్రభుత్వపరంగా విచారణ జరిపిస్తున్నామని తెలిపారు. రామునాయ‌క్ భూ దందాలకు సంబంధించి 2017 నుంచి పలు కేసులు ఉన్నాయని, అప్పట్లో బిఆర్ఎస్ పాలకులు, అధికారులు స్పందించలేదని మంత్రి అన్నారు. విజయనగర్ కాలనీలో 400 చదరపు గజాలు, తుల్జాగూడలో 22 చదరపు గజాలు, లక్ష్మిగూడలో 130 చదరపు గజాలు, మహబూబ్ గంజ్‌లో 497 చదరపు గజాల స్ధలాలను రామునాయ‌క్ పలువురి పేరిట  అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారని, వీటిపై ఇప్పటికే  లోతైన విచారణ జరుపుతున్నామని తెలిపారు. ఈ కేసులలో  సబ్ రిజిస్ట్రార్‌ల పాత్రపైనా కూడా విచారణ జరపాలని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీని ఆదేశించామని తెలిపారు. ప్రభుత్వ అధికారిగా అక్రమాలకు పాల్పడిన రామునాయ‌క్‌ను  తక్షణమే సస్పెండ్ చేశామని, యుద్ద ప్రాతిపదికన విచారణ పూర్తి చేసి అన్ని ఆధారాలను నిర్ధారించిన తర్వాత శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగిస్తామని ప్రకటించారు భూ అక్రమాలకు సహకరించిన సూపరింటెండెంట్ వివేకానంద్ రిటైర్మెంట్ మరో పది సంవత్సరాలు ఉండగానే విధుల నుంచి శాశ్వతంగా తొలగించామని, మరో సూపరింటెండెంట్ బోనా నాయ‌క్‌ను సస్పెండ్ చేశామ‌న్నారు. ప్రభుత్వ ఉద్యోగి అనే పేరుతో అక్రమాలకు పాల్పడితే శిక్ష మరింత కఠినంగా ఉంటుంది అని మంత్రి పొంగులేటి  స్పష్టం చేశారు. ప్ర‌భుత్వ భూములను అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు, నకిలీ పత్రాలు సృష్టించేందుకు లేదా అధికార దుర్వినియోగానికి పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతోపాటు శాఖాపరమైన చర్యలను కూడా వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. భూ కబ్జాలు, అక్రమ రిజిస్ట్రేషన్లు, అధికార దుర్వినియోగంపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, తప్పు చేసిన వారెవరైనా చట్ట ప్రకారం కఠిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. భూకబ్జాలపై అధికారులు ప్రత్యేక నిఘా పెట్టగా తీగ లాగితే డొంక కదిలినట్లు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
————————————————————————————————————————————————————————————

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.