భూ రీస‌ర్వేను వేగ‌వంతం చేయాలి

– పెండింగ్ ద‌ర‌ఖాస్తులను స‌త్వ‌రం ప‌రిష్క‌రించాలి
– ప్ర‌జ‌ల‌ను ఇబ్బంది పెడితే స‌హించం
– రూ.230కే సిమెంట్ బ్యాగ్‌
– మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి
– ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లాలో విస్తృత ప‌ర్య‌ట‌న‌
నిజామాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 22 :  రాష్ట్రంలో భూ స‌మ‌స్య‌ల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం చూప‌డ‌మే ల‌క్ష్యంగా ప్ర‌భుత్వం చేప‌ట్గిన భూ రీస‌ర్వేను వేగవంతం చేయాల‌ని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ఏడాదిన్న‌ర లోపు వ్య‌వ‌సాయ భూముల‌తోపాటు ఆబాదీ ఆస్తుల రీసర్వే పూర్తిచేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్లు వెల్ల‌డించారు. శ‌నివారం ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లాలో విస్తృతంగా ప‌ర్య‌టించి ప‌లు అభివృద్ది ప‌నుల‌కు శంకుస్ధాప‌న చేశారు. నాగారంలోని నిర్మితి కేంద్రంలో ఇందిర‌మ్మ హౌసింగ్ ట‌వ‌ర్స్ కోసం స్ధ‌లాన్ని ప‌రిశీలించారు. అలాగే పాముల బ‌స్తీలో ఇందిర‌మ్మ ఇళ్ల ల‌బ్దిదారుల‌తో ముఖాముఖి నిర్వ‌హించారు. త‌ర్వాత డ‌బుల్ బెడ్ రూమ్ ల‌బ్దిదారుల‌కు ఇళ్ళ ప‌ట్టాలు అంద‌జేశారు. అనంతరం క‌లెక్ట‌రేట్‌లో నిజామాబాద్, కామారెడ్డి  జిల్లాల రెవెన్యూ, హౌసింగ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, సర్వే శాఖల అధికారులతో మంత్రి  సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారంలో ప్రజలను అనవసరంగా కార్యాలయాల చుట్టూ తిప్పుతూ ఇబ్బందులకు గురిచేస్తే ఎంతటివారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. పదేపదే సూచించినా పనితీరులో మార్పు రాని అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులు, సాదాబైనామా అర్జీల పరిష్కారంలో జాప్యం చేస్తున్న తహసీల్దార్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే ప్రభుత్వం రీ సర్వే చేపడుతోందని తెలిపారు. ఏడాదిన్నరలోపు వ్యవసాయ భూములతోపాటు ఆబాది ఆస్తుల రీ సర్వే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. తొలి దశలో ప్రతి జిల్లాలో 70 గ్రామాల్లో రీ సర్వే కొన‌సాగుతోందన్నారు. రీ సర్వే జరుగుతున్న గ్రామాల్లో కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పేదల సొంతింటి కలను సాకారం చేసి వారి ఆత్మగౌరవాన్ని పెంపొందించడమే ప్రజా ప్రభుత్వ సంకల్పమన్నారు. కుల, మత, రాజకీయాలకతీతంగా, పట్టణం, గ్రామం, గూడెం, తండా అనే తేడా లేకుండా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని స్పష్టం చేశారు. పట్టణాలు, నగరాల్లో ఇళ్ల స్థలాలు లేని నిరుపేదల కోసం హైదరాబాద్ తరహాలో రాష్ట్రంలోని ప్రముఖ పట్టణాల్లో ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగానే నిజామాబాద్‌లో ప్రయోగాత్మకంగా టవర్స్ నిర్మించేందుకు స్థలాన్ని పరిశీలించినట్లు చెప్పారు.  ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నిర్మాణ వ్యయం తగ్గించేందుకు సిమెంట్ బ్యాగ్‌ను కేవలం రూ.230కే అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 43వ డివిజన్‌లోని పాముల బస్తీలో ఇందిరమ్మ పథకం కింద నిర్మాణం పూర్తయిన ఇళ్లను పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి బిల్లులు సకాలంలో అందుతున్నాయా, నిర్మాణంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తమ సొంతింటి కలను సాకారం చేసిందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటికి కృతజ్ఞతలు తెలిపారు. లబ్ధిదారుల సంతోషంలో భాగస్వామ్యం కావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని మంత్రి పేర్కొంటూ గృహ ప్రవేశం చేసుకున్న కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన వస్త్రాలను బహూకరించారు. చివరి దశలో ఉన్న ఇళ్లను కూడా పరిశీలించి పనులను త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు. అనంతరం ఐడీఓసీని ఆనుకుని నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను మంత్రి పరిశీలించారు. పెండింగ్ పనులను తక్షణమే పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. నిధుల కొరత లేదని, పనులు పూర్తయిన 24 గంటల్లోనే బిల్లులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. డబుల్ బెడ్‌రూమ్ భవన సముదాయాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి హౌసింగ్ శాఖకు అప్పగించాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్, తాగునీరు, పారిశుధ్య పనులను కూడా వెంటనే పూర్తి చేయాలని సూచించారు. స్థానిక రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి చెందిన 400 మంది లబ్ధిదారులకు మంత్రి పొంగులేటి చేతుల మీదుగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపు పత్రాలను పంపిణీ చేశారు. మరో వారం, పది రోజుల్లో మరో 300 మంది లబ్ధిదారులకు ఇళ్లు అందిస్తామని మంత్రి వెల్లడించారు.  డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపులు పూర్తి పారదర్శకంగా, అర్హత ప్రాతిపదికన జరిగేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.  మొదటి విడతలో 4.50 లక్షల ఇళ్లు, రెండో విడతలో 2.50 లక్షల ఇళ్లు, హైదరాబాద్‌లో మరో లక్ష ఇళ్లను కలుపుకుని ఇప్పటివరకు మొత్తం 8 లక్షల ఇళ్లకు మంజూరు ఇచ్చామని మంత్రి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల సాకారం అయ్యే వరకు విడతల వారీగా ఇళ్లను మంజూరు చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో అసంపూర్తిగా ఉన్న‌ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించే బాధ్యతను ప్రజా ప్రభుత్వం తీసుకుందని తెలిపారు. కార్య‌క్ర‌మంలో ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, డాక్టర్ భూపతి రెడ్డి, నగర మేయర్ ఉమారాణి, హౌసింగ్ శాఖ ఎండీ గౌతమ్, కలెక్టర్ భవేష్ మిశ్రా, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, ‘నుడా’ చైర్మన్ కేశ వేణు తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్‌లోనూ ఇందిరమ్మ టవర్స్
రాష్ట్రంలోని నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. హైదరాబాద్‌తో కలిపి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, త్వరలో మరో రెండు విడతల్లో మరిన్ని ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెవెన్యూ, హౌసింగ్, సర్వే, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించిన అనంతరం విలేకరుల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పి.సుదర్శన్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు, శాసనమండలి సభ్యుడు మహేష్‌కుమార్ గౌడ్ కలిసి మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచనల మేరకు, నిజామాబాద్ ప్రజల కోరికకు అనుగుణంగా హైదరాబాద్ తరహాలో నిజామాబాద్‌లోనూ ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి చర్యలు చేపడుతున్నామని మంత్రి ప్రకటించారు. ఇందుకోసం రెండు నుంచి మూడు ఎకరాల స్థలాన్ని గుర్తించి 10-15 రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలిపారు. నిజామాబాద్‌తోపాటు సమీప ప్రాంతాల్లోని అర్హులైన పేదలను గుర్తించి విడతల వారీగా ఇళ్లను మంజూరు చేస్తామని చెప్పారు. నిపుణులు, రైతుల సూచనల మేరకు తొలుత పది జిల్లాల్లోని 70 గ్రామాల్లో సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు. అదేవిధంగా నక్షాలు లేని 413 గ్రామాల్లోనూ సర్వే నిర్వహించామని, ప్రస్తుతం ప్రతి జిల్లాలో 70 గ్రామాల చొప్పున సర్వే కార్యక్రమాన్ని వేగవంతం చేస్తున్నామని వెల్లడించారు. సర్వే సందర్భంగా ప్రజల అభిప్రాయాలను కూడా సేకరిస్తున్నామని, వారి సూచనలను పరిగణనలోకి తీసుకుని తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికే అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, కమీషన్లు తీసుకునేవారు, దందాలు చేసేవారు, విషపూరిత ఆలోచనలతో వ్యవహరించేవారికి తాము ఎలాంటి సమాధానం ఇవ్వబోమని పొంగులేటి స్పష్టం చేశారు.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *