– సమగ్ర దర్యాప్తు దిశగా చర్యలు
– ‘సిట్’ వేసే ప్రభుత్వ యోచన
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 7: ధరణి పోర్టల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. భూ రికార్డులు, రిజిస్ట్రేన్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం విజిలెన్స్ విభాగం ద్వారా లేదా ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసి విచారణ జరిపించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే వెలుగులోకి వస్తున్న అక్రమాలపై ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. భూమి యజమాని వేలిముద్ర, ఓటీపీ ధ్రువీకరణ లేకుండానే రిజిస్టేష్రన్లు జరిగినట్లు ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. భద్రతా వ్యవస్థలను బైపాస్ చేస్తూ ప్రత్యేక సాప్ట్వేర్లను వినియోగించి లావాదేవీలు నిర్వహించినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడిస్తోంది. అంతేకాకుండా విదేశాల్లో ఉన్న భూ యజమానులకు తెలియకుండానే వారి పేర్లలో మార్పులు చేసిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణకు ఆదేశించనున్నట్లు తెలుస్తోంది. ధరణి పోర్టల్లో జరిగిన సుమారు రూ.8 లక్షల లావాదేవీలకు సంబంధించిన ఆడిట్ పక్రియ పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ పరిశీలనలో దాదాపు 22 వేల రిజిస్ట్రేషన్లలో తేడాలు ఉన్నట్లు సమాచారం. అలాగే ‘ఘోస్ట్ ఐడీలు’ ఉపయోగించి లక్షల ఎకరాల భూ రికార్డులను మార్చినట్లు ఆరోపణలు రావడం మరింత సంచలనంగా మారింది. కొందరు సిస్టమ్లోని టైమ్ క్లాక్ను మార్చి పాత తేదీలతో రిజిస్ట్రేషన్లు చేసినట్లు తెలుస్తోంది. కేరళకు చెందిన సైబర్ సెక్యూరిటీ ఆడిట్ సంస్థ నిర్వహించిన పరిశీలనలో ఈ అంశాలు బయటపడినట్లు సమాచారం. ఈ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకోవడం, భూ రికార్డుల భద్రతను మరింత బలోపేతం చేయడం, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ధరణి పోర్టల్కు సంబంధించిన ఈ వ్యవహారం రాజకీయ, పరిపాలనా వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ప్రభుత్వం చేపట్టబోయే విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





