– అప్రూవర్గా మారేందుకు ఏ4 నిందితుడు ప్రదోశ్ కోర్టులో పిటిషన్
బెంగళూరు, ఆగస్టు 10 : కర్ణాటకలో సంచలనం సృష్టించిన చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ-4 నిందితుడిగా ఉన్న ప్రదోశ్ అప్రూవర్గా మారేందుకు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్లో నటుడు దర్శన్కు వ్యతిరేకంగా పలు తీవ్రమైన ఆరోపణలను కోర్టుకు సమర్పించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను బహిర్గతపరిచేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు, తాను ఈ కేసులో ఇరుక్కోవడానికి దర్శన్ ఒత్తిడే కారణమని ఆయన ఇటీవల కోర్టుకు సమర్పించిన పిటిషన్లో పేర్కొన్నారు. హీరో దర్శన్ మొదట రేణుకాస్వామిని దూషించి ఆ తర్వాత కొట్టారని, అంతేగాక చెప్ప్పుతో కొట్టాలని పవిత్రగౌడకు దర్శన్ సూచించినట్లు ప్రదోశ్ ఆరోపించారు. అయితే రేణుకా స్వామిని హత్య చేయాలనే ఉద్దేశం తనకు లేదని, అక్కడ ఉన్న కొందరు రేణుకాస్వామిని చంపాలని నిర్ణయించుకున్నారని, దాడిని ఆపేందుకు తాను ప్రయత్నించినా ఎవరూ తన మాట వినలేదని పిటిషన్లో పేర్కొన్నారు. సంఘటన సమయంలో రేణుకాస్వామికి భోజనం, నీరు ఇచ్చింది తానేనని, అనంతరం రేణుకాస్వామి మొబైల్ ఫోన్ను తీసుకుని పరిశీలించగా మరిన్ని వివరాలు బయటపడ్డాయని ప్రదోశ్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసులో ప్రదోశ్తోపాటు మరో ఇద్దరు నిందితులు కూడా అప్రూవర్లుగా మారేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అయితే వీరి అభ్యర్థనలను కోర్టు అంగీకరించాల్సి ఉంది. కోర్టు అనుమతి లభిస్తే కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రదోశ్ పిటిషన్లో చేసిన ఆరోపణలు నిజమని కోర్టు ఇంకా నిర్దారించలేదు. ఈ నేపథ్యంలో ఆయన వాంగ్మూలం, పిటిషన్లోని అంశాలు కేసు దర్యాప్తు, తదుపరి న్యాయ పక్రియలో ఎంతవరకు ప్రభావం చూపుతాయనేది ఆసక్తికరంగా మారింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




