– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
– పాలమూరు-రంగారెడ్డి పథకం నార్లాపూర్ పంపులు ప్రారంభించి మూడేళ్లు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16 : ఉమ్మడి పాలనలో కరవు, వలసలకు నిలయంగా ఉన్న పాలమూరు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే దిశగా నాటి కేసీఆర్ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నార్లాపూర్ పంపులను ప్రారంభించి నేటికి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన ఈమేరకు స్పందించారు. పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చడం ద్వారా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని పేర్కొన్నారు. పాలమూరు ప్రాంత ప్రజల దశాబ్దాల నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నారాయణపేట, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ జిల్లాల్లోని ప్రాంతాలకు సాగునీరు అందించడంతోపాటు తాగునీటి అవసరాలను తీర్చాలని ప్రణాళిక రూపొందించినట్లు అధికారిక ప్రాజెక్టు పత్రాలు పేర్కొంటున్నాయన్నారు. సుమారు 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు, 1,226 గ్రామాలకు తాగునీరు అందించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించారని, 2023 సెప్టెంబర్ 16న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాగర్కర్నూల్ జిల్లా నార్లాపూర్ వద్ద ఈ ఎత్తిపోతల పథకం తొలి దశ వెట్ రన్ను ప్రారంభించారని గుర్తు చేశారు. నార్లాపూర్ పంప్హౌస్లో భారీ సామర్థ్యం కలిగిన పంపులను ఆన్ చేసి శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీటిని ఎత్తిపోసే ప్రక్రియను ప్రారంభించారంటూ పంపు ప్రారంభించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రాజెక్టులో మిగిలి ఉన్న పనులను ప్రభుత్వం వేగంగా పూర్తి చేసి పంట పొలాలకు నీటిని అందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. పాలమూరు ప్రజల నీటి అవసరాలను ప్రభుత్వం విస్మరించకుండా ప్రాజెక్టు పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు



