– సింగిల్ బెంచ్ తీర్పుపై హైకోర్టు స్టే
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1 : కల్యాణలక్క్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. పథకాల అమలుపై సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను సీజే ధర్మాసనం రద్దు చేసింది. పథకాలపై స్టే విధించడాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలుపై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ పథకాల నిమిత్తం ప్రభుత్వం 2014 నుంచి జారీ చేసిన 8 జీవోలను సవాల్ చేస్తూ న్యాయవాది విజయ్గోపాల్ వ్యక్తిగత హోదాలో దాఖలు చేసిన పిటిషన్లో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంతో పథకాల అమలును నిలిపివేస్తూ సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్రెడ్డి వాదనలు వినిపిస్తూ 2014 నుంచి అమలవుతున్న సంక్షేమ పథకాలపై పిటిషన్ దాఖలైందన్నారు. ఈ పథకాల అమలు పిటిషనర్పై ఎలాంటి ప్రభావం చూపడంలేదని, అతని హక్కులకూ భంగం వాటిల్లలేదని, అంతేకాక పథకం లబ్దిదారు కూడా కాదని అన్నారు. ఇది ప్రజాప్రయోజన వ్యాజ్యం కాదన్నారు. షాదీ ముబారక్ లాంటి పథకాన్ని సుప్రీంకోర్టు అనుమతించిందని, అలాంటిదే కల్యాణలక్క్ష్మి పథకమని చెప్పారు. ఈ పిటిషన్ సింగిల్ జడ్జి వద్ద విచారణార్హం కాదని, ప్రభుత్వ విధాన నిర్ణయాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించే పరిధి ఈ డివిజన్ బెంచ్కు ఉందని అన్నారు. పథకం అమలుపై ఉన్న మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరారు. ఏజీ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం స్టేను ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





