-డి జె మోహన రావు
సాహిత్యానికి వ్యాకరణం అవసరమా అనే ప్రశ్న పైకి భాషకు సంబంధించినదిగా అనిపించినా లోతుగా పరిశీలిస్తే అది సృజనాత్మకత సరిహద్దులను శోధించే సాహిత్య తత్వంగా మారుతుంది. భావం ముందు పుట్టిందా, నియమం ముందు పుట్టిందా, కవి హృదయాన్ని అనుసరించాలా, శాస్త్రాన్ని ఆశ్రయించాలా? అనే సందేహాలన్నీ ఇందులో అంతర్లీనంగా ఉంటాయి. వ్యాకరణం భాషకు శరీరమైతే, సాహిత్యం దాని ఆత్మ. శరీరాన్ని నిలబెట్టడానికి ఎముకలకూర్పు ఎంత అవసరమో, భాషకు క్రమబద్ధతను అందించడానికి వ్యాకరణం అంత అవసరం. అయితే ఆత్మను ఎముకలతో కొలవలేనట్లే, సాహిత్యాన్ని కేవలం వ్యాకరణ సూత్రాలతో అంచనా వేయలేము. ఎందుకంటే సాహిత్యం నియమాల ప్రదర్శన కంటే అనుభూతుల వ్యక్తీకరణకు దగ్గరగా ఉంటుంది.
నిజానికి మనిషి మాట్లాడటం నేర్చుకున్నప్పుడు వ్యాకరణ గ్రంథాలు లేవు. ముందుగా భావం వచ్చింది, ఆ భావానికి శబ్దం తోడై భాషగా పరిణమించింది. ఆ భాషలోని అంతర్లీన క్రమాన్ని గుర్తించి మనిషి వ్యాకరణాన్ని నిర్మించాడు. అందువల్ల వ్యాకరణం భాషకు తల్లి కాదు, భాషే వ్యాకరణానికి జన్మనిచ్చింది. జోలపాటలలో, సామెతలలో, జానపద గాథల మౌఖిక సంప్రదాయంలో భాష అప్పటికే తన సహజ ప్రవాహంలో ప్రయాణిస్తూ వచ్చింది. వ్యాకరణం ఆ ప్రవాహాన్ని సృష్టించలేదు, దానికి అక్షరరూపం ఇచ్చింది. ప్రాచీన కాలంలో వ్యాకరణం భాషకు సంరక్షకుడిగా పదాలకు రూపాన్ని, వాక్యాలకు స్పష్టతను అందించింది. అయితే సాహిత్యం కేవలం సమాచార మార్పిడి కాదు. అది ఒక అంతరంగం మరో హృదయంతో జరిపే సంవాదం. అందుకే ఈ సృజనాత్మక యాత్రలో వ్యాకరణం మార్గదర్శి మాత్రమే, గమ్యస్థానం కాదు.
చరిత్రను పరిశీలిస్తే ప్రతి యుగంలో కొత్త సాహిత్యమే పాత నియమాలను సవరించింది. ఒక తరానికి కొత్తగా అనిపించిన ప్రయోగాలు మరో తరానికి సహజమైన భాషగా మారిపోయాయి. వ్యాకరణం లేని భాష అస్తవ్యస్తంగా మారే ప్రమాదం ఉంటే, వ్యాకరణమే ప్రధానమైన భాష నిర్జీవంగా మారుతుంది. నిఘంటువులు పదాలను భద్రపరిస్తే, కవిత్వం వాటికి ప్రాణం పోస్తుంది. నియమాలు భాషను కాపాడితే ఉల్లంఘనలు దాని పరిధిని విస్తరింపజేస్తాయి. తెలుగు సాహిత్య చరిత్రను పరిశీలించినప్పుడు కూడా నన్నయ నుంచి శ్రీశ్రీ వరకు సాగిన ప్రయాణం ఈ నియమం, స్వేచ్ఛల మధ్య కొనసాగిన దీర్ఘ సంభాషణకు సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది.
నన్నయ నుండి సోమనాథుని వరకు:
తెలుగులో నన్నయను “వాగనుశాసనుడు” అంటారు. కానీ ఆయన కేవలం నియమాల కాపలాదారుడు కాదు. ప్రజల మధ్య ఉన్న భాషకు కావ్యరూపం ఇచ్చిన మహాకవి. నన్నయ వద్ద వ్యాకరణం సాహిత్యాన్ని శాసించే అధికారం కాదు, వ్యక్తీకరణకు తోడ్పడే సాధనం. తిక్కన వద్దకు వచ్చేసరికి శాస్త్రం భావప్రవాహానికి అడ్డుగా నిలబడలేదు. సంస్కృత గంభీరత కంటే స్థానిక పదాల లోకవ్యవహారపు సహజత్వానికి ఆయన పీఠం వేశారు. అలాగే పోతన భాగవతాన్ని చదివినవారు వ్యాకరణాన్ని గుర్తుంచుకోరు, అందులోని భక్తి అనుభూతినే ఆస్వాదిస్తారు. శ్రీనాథుని వద్ద భాష సంగీతంలా ప్రవహిస్తూ, శబ్ద సౌందర్యం కోసం నియమాల కాఠిన్యాన్ని సడలించుకుంది.
వేమన శతకాలలో పాండిత్యం కంటే ప్రజల నాలుకపై ఉన్న భాషే ముఖ్యాంశమైంది. గ్రాంథికత తక్కువగా ఉన్నా, శతాబ్దాలను దాటే తాత్వికత ఆయన సొంతం. తాళ్ళపాక అన్నమయ్య సంకీర్తనలలో భక్తి, సంగీతం, సరళత పరస్పరం కలిసిపోయాయి. ఇక జానపద సాహిత్యంలో వ్యాకరణ సూత్రాలు తెలియని గొంతుల నుంచే ఎన్నో అమర గేయాలు పుట్టాయి. అక్కడ భాష పుస్తకాల నుంచి కాదు, సమూహ అనుభవాల నుంచి ఉద్భవించింది. ద్విపద సంప్రదాయంలో పాల్కురికి సోమనాథుడు ఎంచుకున్న మార్గం కూడా ఇదే. ప్రతి యుగంలో సాహిత్యం తనకు అవసరమైన భాషను తానే ఎంపిక చేసుకుంటే, వ్యాకరణం దాని వెనుక నడిచింది.
సాహిత్యాన్ని మలుపు తిప్పిన శ్రీశ్రీ:
ఆధునిక యుగంలో గురజాడ అప్పారావు, గిడుగు రామమూర్తి పంతులు గ్రంథాల భాష కంటే ప్రజల నోట వినిపించే భాషకు సాహిత్యంలో పట్టం కట్టారు. వారి పోరాటం వ్యాకరణానికి వ్యతిరేకంగా కాదు, భాషలోని కృత్రిమత్వానికి వ్యతిరేకంగా సాగింది. శ్రీశ్రీతో తెలుగు కవిత్వం మరో మలుపు తిరిగింది. ఛందస్సు, అలంకారాల కంటే ఆలోచనకు, ఉద్వేగానికి ప్రాధాన్యం పెరిగి వచన కవిత్వం రూపంలో కొత్త అనుభూతుల అన్వేషణ సాగింది. గొప్ప కవులు వ్యాకరణాన్ని తెలియక ఉల్లంఘించలేదు, తెలుసుకుని అధిగమించారు. లోకవ్యవహారం మారినప్పుడు భాష మారుతుంది, భాషతో పాటు వ్యాకరణం కూడా తన రూపాన్ని సవరించుకుంటుంది.
కాబట్టి “సాహిత్యానికి వ్యాకరణం అవసరమా?” అనే ప్రశ్నకు ఒకే మాటలో సమాధానం చెప్పలేము. వ్యాకరణం లేకుండా సాహిత్యం పుట్టవచ్చు, కానీ దీర్ఘకాలం నిలదొక్కుకోవడానికి క్రమబద్ధత అవసరం. అదే సమయంలో వ్యాకరణమే ప్రధానమైతే సాహిత్యపు జీవశక్తి క్షీణిస్తుంది. నియమం-స్వేచ్ఛ, క్రమబద్ధత-సృజనాత్మకత అనే ద్వంద్వాల మధ్య సాగే ఉద్వేగమే గొప్ప సాహిత్యానికి మూలాధారం. భాషా చరిత్రలో శాశ్వతంగా నిలిచేవి వ్యాకరణ సూత్రాలు కావు, మనిషి హృదయాన్ని తాకిన పదాలు మాత్రమే. నియమాలు కాలంతో పాటు మారిపోవచ్చు, కానీ ఒక సజీవమైన వాక్యం తరాలను దాటి ప్రయాణిస్తుంది. సాహిత్యపు నిజమైన వ్యాకరణం బహుశా అక్కడే దాగి ఉంది.





