‌దేవుడి పేరుతో అరాచకాలు సాగిస్తే ఊరుకోం

  • ఆలయం వద్ద బందోబస్తు ఏర్పాటు చేయండి
  • అధికారులకు మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశం
హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి11:  దేవుడు పేరు చెప్పుకొని మంచి పనులు చేయాలని.. కానీ దాడులు చేయడం సరికాదని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. రామరాజ్యం పేరుతో అరాచకాలు సాగిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి అమానవీయ చర్య, తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మంగళవారం చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌ను జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్‌ ‌బాబు, ప్రభుత్వ చీఫ్‌ ‌విప్‌ ‌డాక్టర్‌ ‌పట్నం మహేందర్‌ ‌రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య, సీనియర్‌ ‌కాంగ్రెస్‌ ‌నాయకుడు వి.హనుమంతరావు పరామర్శించారు.
సౌందర్య రాజన్‌ను కలిసి ఆరోగ్య పరిస్థితిపై శ్రీధర్‌ ‌బాబు, మహేందర్‌ ‌రెడ్డి ఆరా తీశారు. దాడి ఘటనను అడిగి నేతలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా  శ్రీధర్‌ ‌బాబు మీడియాతో మాట్లాడారు. చిలుకూరు బాలాజీ దేవాలయం వద్ద భద్రత పెంచాలని పోలీసులను ఆదేశించారు. రాముని పేరుపై దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
రంగరాజన్‌పై దాడి చేసిన నిందితుల్లో ఇప్పటికే కొందరిని పోలీసులు అరెస్టు చేశారని శ్రీధర్‌ ‌బాబు గుర్తుచేశారు. రాముడు పేరు మీద దాడులు చేయడం దురదృష్టకరమని ప్రభుత్వ చీఫ్‌ ‌విప్‌ ‌డాక్టర్‌ ‌పట్నం మహేందర్‌ ‌రెడ్డి అన్నారు. చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. నిందితులను ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని మహేందర్‌ ‌రెడ్డి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *