– నాలుగు నెలల్లో ఒక్కటి మాత్రమే జారీ
– అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హళవార్డ్ లుట్నిక్
వాషింగ్టన్, ఏప్రిల్ 24: అమెరికాలో శాశ్వత నివాసం కోరుకునే విదేశీయుల కోసం గతేడాది డిసెంబర్లో ట్రంప్ ప్రభుత్వం గోల్డ్ కార్డు స్కీమ్ను ప్రారంభించింది. కొత్త స్కీమ్ అమల్లోకి వచ్చి నాలుగు నెలలు కావస్తున్నా ఇప్పటివరకూ కేవలం ఒక్కరికే గోల్డ్ కార్డు దక్కింది. ఈ విషయాన్ని అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హళవార్డ్ లుట్నిక్ పేర్కొన్నారు. అమెరికా కాంగ్రెస్ (చట్టసభలు) కమిటీకి ఈ వివరాలను గురువారం ఆయన వెల్లడించారు. గోల్డ్ కార్డు కావాలనుకునే విదేశీయులు 1 మిలియన్ డాలర్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు అదనం. అయితే, ఈ స్కీమ్కు డిమాండ్ అద్భుతంగా ఉందని మొదట్లో లుట్నిక్ తెలిపారు. ఏకంగా 1.3 బిలియన్ డాలర్ల విలువైన వాటిని జారీ చేశామని అప్పట్లో అన్నారు. ఇందుకు భిన్నంగా ఆయన కేవలం ఒక్క గోల్డ్ కార్డును మాత్రమే జారీ చేశామని తాజాగా పేర్కొనడం ప్రాధాన్యం సంతరించుకుంది. వందల సంఖ్యలో దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని లుట్నిక్ కాంగ్రెస్ కమిటీకి చెప్పారు. వీసా కోసం జనాలు క్యూకట్టారని కూడా అన్నారు. అధికారులు ఇటీవలే పూర్తిస్థాయి వ్యవస్థను ఏర్పాటు చేశారని, ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని కూడా చెప్పారు. ఈ పథకం కింద ఎంపికైన వారికి కేవలం ఐదేళ్లల్లోనే పౌరసత్వానికి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లభిస్తుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





