విద్యుత్ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి!
విద్యుత్ కోతలతో రైతులు, సామాన్య ప్రజానీకం నిత్యం కష్టాలు ఎదుర్కొంటున్నారు. మసిపూసి మారేడుకాయ చందంగా ఇప్పుడు విద్యుత్ వ్యవస్థ తయారయ్యింది. ఈ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సి ఉంది. అప్పుడే సమస్యలు తీరుతాయి. గత కెసిఆర్ ప్రభుత్వం నిరంతర విద్యుత్ పేరుతో ఊదరొగట్టింది. అప్పులు చేసి విద్యుత రంగాన్ని కుప్పచేసిన వారు ఇప్పుడు మొసలు కన్నీరు కారుస్తు న్నారు. నిజానికి విద్యుత్ బిల్లులు, విద్యుత్ కోతలు ముందునుంచీ తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఇరు తెలుగు రాష్ట్రాల్లో వివిధ విద్యుత్ సమస్యలు వేధిస్తున్నాయి. గతంలో ప్రభు త్వాలు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించు కోలేదు.లోపాలు బయటకు రాకుండా… లోపాల వార్తలను ప్రచురించ కుండా కట్టడి చేయించింది. ఇప్పుడేమో గతంలో అధికారంలో ఉన్న పార్టీ గగ్గోలు పెడుతున్నది. విద్యుత్ అందక ఆందోళనలు చేసిన రైతులు అప్పుడూ ఉన్నారు.. ఇప్పుడు కూడా ఉన్నారు. ఇప్పుడు అవే వార్తలను బలంగా ప్రచారం చేస్తున్న తీరు గత పాలకుల దుర్నీతిని తెలియ చేస్తోంది. తెలంగాణలో బెటర్మెంట్ ఛార్జీలతో షాక్లు ఇచ్చారు.
విద్యుత్ ఛార్జీలను విపరీతంగా పెంచేశారు. ఇక ఎపిలో వ్యవసాయ మోటర్లకు విరీటర్లు బిగించడంతో పాటు..విద్యుత్ కోతలు ఆందోళనకు గురి చేస్తున్నాయి.. ఛార్జీల పెంపు ఇప్పటికే తడిసి మోపెడు చేశారు. తెలంగాణలో 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పినా నష్టాలను తట్టుకోలేని విధంగా తయారు చేశారు. గత కెసిఆర్ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు ఆందోళన కలిగించేలా ఉన్నాయి. వినియోగదారులకు దిమ్మతిరిగేలా బిల్లులు వస్తున్నాయి. ఒక్కసారిగా వేల రూపాయల విద్యుత్ బిల్లులు చూసి వినియోగదారులు షాక్కు గురవుతున్నారు. కోలుకోలేని విధంగా విద్యుత్ చార్జీలు అప్పుడే పెంచేసారు. విద్యుత్ వినియోగంలో పెరిగిన లోడ్కు సంబంధించి డెవలప్మెంట్ చార్జీల రూపంలో సెక్యూరిటీ డిపాజిట్లు వసూలు చేయడం వంటివన్నీ చేసేశారు. దీనిని కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సవరించాల్సి ఉంది. కిలోవాట్ లోడ్ జీఎస్టీతో కలుపుకుని సుమారు రూ.1500 డెవలప్మెంట్ చార్జీలు వడ్డించినట్లు నాటి విద్యుత్శాఖ అధికారులు చెప్పారు. బాయిలకాడ విరీటర్లు పెట్టమని చెబుతూ వచ్చిన కెసిఆర్..ఇలా గృహ వినియోగ దారులపై ఎడాపెడా ఛార్జీలు వేసి ముక్కు పిండి వసూలు చేయించారు. ఘనత వహించిన పాలకుల కాలంలో వందల్లో వచ్చే బిల్లులు వేల రూపాయల్లో వచ్చాయి. వివిధ ఛార్జీల పేరుతో అదనపు బాదుడు సామాన్య, మధ్య తరగతి ప్రజలను షాక్కు గురిచేసాయి.
వీటిని సవరించాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎపిలో కూడా జగన్ హయాంలో విద్యుత్ చార్జీల భారం మోపారు. వాటిని కూడా అధికారంలోకి వచ్చిన టిడిపి సవరించడం లేదు. ఇళ్లలో ప్రతినెల రూ.200 నుంచి రూ.500లోపు విద్యుత్ బిల్లులు వస్తుండేవి. డెవలప్మెంట్ చార్జీలు ఒక్కసారి మాత్రమే వస్తాయని అవి తప్పనిసరిగా కట్టాల్సి ఉంటుందని విద్యుత్శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ భారం ఇప్పటికీ పడుతూనే ఉంది. ఇక ఎపిలో పరిస్థితి మరోలా ఉంది. పల్లెల్లో ఎప్పుడంటే అప్పుడు విద్యుత్ కట్ అవుతోంది. 9గంటల వ్యవసాయ విద్యుత్ అమలు కావడం లేదని రైతులు వాపోతున్నారు. విద్యుత్ కోసం రాత్రిళ్లు రైతులు పొలాల వద్ద పడిగాపులు పడుతున్నారు. లోడ్ పెరగడమే కారణం అంటున్న అధికారులు జిల్లాల్లో అనధికార విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారు. కరెంటు ఎప్పుడు వస్తుందో… ఎప్పుడు పోతుందో తెలియక ప్రజలు అల్లాడుతున్నారు. ముఖ్యంగా సమాచారం ఇచ్చేవారు లేకపోవడంతో విద్యుత్ మోటార్ల వద్ద రైతులకు కాలం గడుపుతున్నారు. వేసవి ప్రారంభం కాకుండానే ఇలా ఉంటే మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల కాలం కావడంతో పట్టించుకునే వారు కరువయ్యారు.
చిన్న పరిశ్రమలకూ విద్యుత్ కష్టాలుతప్పడం లేదు. పూర్తిస్థాయిలో వరిసాగుకు నీరు అందటం లేదు. రాత్రిపూట ఫీడర్లు, సబ్స్టేషన్ల వారీగా కరెంటు ఇవ్వడంతో రైతులు వంతుల వారీగా రాత్రిపూటే పొలాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఇకపోతే గ్రావిరీణ ప్రాంతాల్లో అనధికార విద్యుత్ కోతలను అమలు చేశారు. ముఖ్యంగా విద్యుత్ వినియోగం అనూహ్యంగా పెరిగిన సందర్భాల్లో గృహ విద్యుత్ వినియోగదారులకు సాయంత్రం, రాత్రి సమయాల్లో గంటనుంచి రెండుగంటల పాటు అనధికార కోతలు విధిస్తున్నారు. విద్యుత్ లోడ్ పెరిగిన సమయంలో అందుకు అనుగుణంగా డివిజన్ల వారీగా కోతలు విధిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ కోతలు మరింత పెరిగే అవకాశముందని అధికార వర్గాల సమాచారం. వ్యవసాయ సర్వీసులకూ గంటనుంచి రెండు గంటలపాటు అనధికార కోతలు అమలు చేస్తున్నారు. వ్యవసాయ అవసరాలకు పగటిపూట 9 గంటల పాటు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్న ప్రభుత్వ ప్రకటనలు క్షేత్రస్థాయిలో అమలు కావటం లేదు. పరిశ్రమలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండటం లేదని చెబుతున్నప్పటికీ చిన్నతరహా పరిశ్రమలకు కోతల బెడద తప్పటం లేదు. దీనితో రైతులకు తీవ్ర ఇక్కట్లు తప్పడం లేదు. రబీలో మొక్కజొన్న, జొన్న పంటలూ అధికంగా సాగు చేస్తున్నారు. ఈ పరిస్థితిలో 5 గంటలకే కుదిస్తే ఎలాగని రైతులు మండిపడుతున్నారు.
గ్రావిరీణ ప్రాంతంలో 5 గంటల నుంచి 8 గంటలపాటు విద్యుత్ కోత విధిస్తున్నారు. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు గ్రామాల్లో లోవోల్టేజ్ సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు. వ్యవసాయపంపు సెట్లకు ఉదయం 9గంటల విద్యుత్ సరఫరా చేయాల్సివుంది. అది సక్రమంగా అమలు కాకపోవడంతో మొక్కజొన్న, తెల్లజొన్న, అపరాల సాగుకు వ్యయ ప్రయాసలకోర్చి నీరు పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. పట్టణ ప్రాతాల్లో రోజుమార్చి రోజు ఏదో ఒక ప్రాంతంలో విద్యుత్ ల్కెన్ల మరమ్మతులు చేస్తున్నారు. దీనితో ఐదు గంటలపాటు సరఫరా నిలిపివేస్తున్నారు. వేసవి ప్రారంభం ముందే కోతలు మొదలయ్యాయని ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మిట్టపల్లి మహేందర్
సీనియర్ జర్నలిస్ట్
9030899144





