త్రిభాషా సూత్రం కాంగ్రెస్ హయాంలోనిదే..
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 29 : దేశంలో త్రీ లాంగ్వేజ్ ఫార్ములా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోనే రూపుదిద్దుకుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. దేశంలో హిందీ తప్పనిసరిగా నేర్చుకోవాలని ఒత్తిడి చేశామా? కొత్త విద్యా విధానం తీసుకొచ్చేందుకు తమిళనాడుకు చెందిన కస్తూరి రంగరాజన్ నేతృత్వం వహించారు. ఆయన సూచనల మేరకే 2022లో కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త విద్యా విధానం తీసుకొచ్చిందని ఆయన పేర్కొన్నారు. టీవీ 9 కాంక్లేవ్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఇన్నేళ్ల తర్వాత స్టాలిన్కు కొత్త ఎడ్యుకేషన్ పాలసీ గుర్తుకొచ్చింది. ఎన్నికలు వొస్తున్నాయనగానే ఎక్కడ లేని సమస్యలు ఆయనకు గుర్తొస్తాయి.
నాలుగేళ్లలో తమిళనాడులో ఏం జరిగిందో అందరికీ తెలుసు. అవినీతి, లిక్కర్ స్కామ్ నుంచి తమిళనాడు ప్రజలను పక్కదారి పట్టించేందుకు సీఎం స్టాలిన్ కొత్త నాటకాలకు తెరలేపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ రాష్ట్రానికి వెళ్లినా అక్కడి భాషతోనే ఆయన ప్రసంగం ప్రారంభిస్తారు. ప్రాంతీయ భాషలకు ఆయన అంతలా గౌరవం ఇస్తారు. ఉన్నత పాఠశాల విద్య వరకు మాతృభాషలోనే చదువుకోవాలని కొత్త విద్యా విధానం చెబుతోంది. తమిళనాడు నుంచి ఆలిండియా సర్వీసులకు ఎవరైనా ఎంపికై ఉత్తరప్రదేశ్ లో పనిచేయాల్సి వొస్తే ఎలా పని చేస్తారు.
హిందీ నేర్చుకుంటే ఉత్తరాదిలో పనిచేయడం సులభం కదా.. తమిళనాడు డీఎంకే నేతల పిల్లలందరూ దిల్లీలో, ఉత్తరాదిన చదువు కుంటున్నారు. డీఎంకే నేతలు నిర్వహించే విద్యాసంస్థల్లో హిందీ బోధన ఉంది. తమిళనాడులో సీబీఎస్ఈ సహా ప్రైవేట్ విద్యాసంస్థల్లో హిందీ బోధన జరుగుతుంది. వ్యాపారాలు చేసుకునేందుకు హిందీ అవసరం కానీ.. రాజకీయాలకు వొచ్చే సరికి హిందీ వద్దా..? తమిళనాడు ప్రజల్లోనూ హిందీ విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదు. రాజకీయాల కోసమే డిఎంకే నేతలు, కాంగ్రెస్ నాయకులు ఈ నాటకాలు చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు తెలంగాణ, కర్ణాటకలో ఎన్నికలు జరిగితే బీజేపీ అధికారంలోకి వొస్తుంది. ఇటీవల తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ రెండు సీట్లు గెలుచుకుంది.
తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నుంచే 60% ఆదాయం వస్తోంది. అలాంటప్పుడు హైదరాబాద్ను వదిలి ఆదిలాబాద్లో ఎలా ఖర్చు చేస్తారని ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది? దేశంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. దేశాభివృద్ధి కోసం వివిధ ప్రాంతాల్లో ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కొన్ని పార్టీలు రాష్ట్రాల్లో గ్యారంటీల పేరుతో ఏవేవో హామీలు ఇస్తున్నారు. వాటిని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదా? మీరు గ్యారంటీలు ఇచ్చి, అందుకు నిధులు మేం ఇవ్వాలంటే ఎలా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వంద శాతం. తప్పకుండా అమలు చేస్తున్నాం. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి మోదీ ప్రధాని అయ్యే వరకు ఎన్ని జాతీయ రహదారులు ఉన్నాయో, ఈ పదేళ్లలో అన్ని రహదారులు కొత్తగా ఏర్పడ్డాయి. బీజేపీలో ప్రజాస్వామ్యం ఉంటుంది. కేసీఆర్ తర్వాత పార్టీ అధ్యక్షుడు ఎవరో చెప్పొచ్చు.
బీజేపీలో అలా కాదు. జేపీ నడ్డా తర్వాత అధ్యక్షుడు ఎవరో ఆ దేవుడు కూడా చెప్పలేడు. బీజేపీ అధికారంలోకి రాకపోతే, మోదీ ప్రధాని కాకపోతే ఆర్టికల్ 370 రద్దు సాధ్యపడేది కాదు. రామజన్మభూమి ఆలయ నిర్మాణం జరిగి ఉండేది కాదు. పాకిస్తాన్ ఐఎస్ఐ కుట్రలు, సీమాంతర ఉగ్రవాద దాడులు కొనసాగుతూ ఉండేవి. బీజేపీకి అన్ని పార్టీలు భయపడుతున్నాయి. బీజేపీని ఎదుర్కోలేక కొన్ని పార్టీలు ఏకమవుతున్నాయి. వారసత్వ పార్టీలన్నీ ప్రైవేటు కంపెనీలుగా మారి డబ్బులు దండుకోవడమే పనిగా పనిచేస్తున్నాయి. గతంలో డబ్బులు తెచ్చి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి ఇచ్చిన వారికే గనుల కేటాయింపులు జరిగేవి. ఇప్పుడు పూర్తి పారదర్శకంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వేలం ప్రక్రియ ద్వారా గనుల కేటాయింపు జరుగుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.





