– రాజీనామా లేఖలో పేర్కొన్న ధర్మేంద్ర ప్రధాన్
న్యూదిల్లీ, జూలై 25: తన రాజీనామా లేఖను ప్రధాని నరేంద్ర మోదీకి పంపినట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. జంతర్ మంతర్తోపాటు దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని దేశ వ్యతిరేక శక్తులు దీనిని ఉపయోగించుకోకుండా ఉండేందుకు, జాతీయ ఐక్యత కాపాడేందుకు, విద్యార్థుల భవిష్యత్తు న్యాయపరమైన చిక్కుల్లో పడకుండా ఉండేందుకు తాను రాజీనామా సమర్పించినట్లు వెల్లడించారు. యువత, కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నిరసనల నేపథ్యంలో ఆయన దిగి వచ్చినట్లయింది. గత నాలుగు దశాబ్దాలుగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యా సంస్కరణలోకి పనిచేస్తున్నామని, దేశ యువత ఆకాంక్షలను నెరవేర్చడం తన నైతిక బాధ్యతగా భావించినట్లు రాజీనామా లేఖలో ఆయన పేర్కొన్నారు. 2026 మే 3న నిర్వహించిన ‘నీట్’లో అవకతవకలు వెలుగులోకి రావడంతో కేంద్ర ప్రభుత్వం వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించిందని ధర్మేంద్ర గుర్తు చేశారు. పరీక్షను రద్దు చేసి, మళ్లీ నిర్వహించడంతోపాటు వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. 20 లక్షల మందికి పైగా విద్యార్థుల కోసం తిరిగి పరీక్ష విజయవంతంగా నిర్వహించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో జూన్ 21న పరీక్ష విజయవంతంగా పూర్తయిందని అన్నారు. ఎగ్జామ్ మాఫియా వల్ల ప్రతిభావంతులైన విద్యార్థులు నష్టపోకుండా కృషి చేశానని ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. ఈనెల 16న ప్రకటించిన ఫలితాల్లో పేద, వెనకబడిన వర్గాలకు చెందిన అనేకమంది విద్యార్థులు విజయాన్ని సాధించడం సంతోషకరమని అన్నారు. ఇదే సమయంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు విద్యార్థుల్ని తప్ప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం తనను బాధించిందన్నారు. పది రోజులుగా జరిగిన పరిణామాలు కలిచివేశాయని, ఇది తన వ్యక్తిగత ప్రతిష్ఠకు సంబంధించిన విషయం కాదని స్పష్టం చేశారు. తనపై నమ్మకం ఉంచిన ప్రధాని మోదీకి, కేంద్ర మంత్రివర్గ సహచరులకు, విద్యాశాఖ అధికారులకు ధన్యవాదాలు చెప్పారు. దేశ సేవే తన జీవిత లక్ష్యమని, భవిష్యత్తులోనూ ఒడిశా ప్రజలు, దేశ యువత కోసం సేవ చేస్తూనే ఉంటానన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





