గోదావరి పుష్కరాల నాటికి ఆలయ పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలి

*గోదావరి పుష్కరాల నాటికి భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలి: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

*పుష్కరాలకు 15 రోజుల ముందే పునరుద్ధరణ పనులు పూర్తయ్యేలా ప్రత్యేక కార్యాచరణ

*ఆలయ పునరుద్ధరణ పనుల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియమించాలని ఆదేశం

*ప్రతి 10 రోజులకు ఒకసారి క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించాలని సూచన

*భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నాణ్యతా ప్రమాణాలతో పనులు చేపట్టాలి

భద్రాచలం, ప్రజాతంత్ర, జులై 19 : రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదివారం భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి స్వామివారిని ఆదివారం దర్శించుకున్నారు.ఈ పర్యటనలో భాగంగా జిల్లాకు విచ్చేసిన మంత్రి కి సారపాక ఐ టి సి గెస్ట్ హౌస్ నందు జిల్లా కలెక్టర్ అంకిత్ మొక్క అందించి స్వాగతం పలికారు. అనంతరం ఆలయానికి విచ్చేసిన మంత్రికి దేవస్థానం అర్చకులు, వేద పండితులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. స్వామివారి ప్రత్యేక దర్శనం చేసుకున్న మంత్రి వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి సత్కరించారు.దర్శనం అనంతరం మంత్రి జిల్లా కలెక్టర్ అంకిత్, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రోహిత్ రాజు, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, భద్రాచలం గ్రామ సర్పంచ్ పూనెం దొర, దేవస్థానం ఈవో దామోదర్ రావు లతో కలిసి ఆలయంలో కొనసాగుతున్న పునరుద్ధరణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంజినీరింగ్ శాఖ అధికారులు ఆలయ పునరుద్ధరణ పనుల రూపకల్పన, పురోగతి, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మ్యాప్‌ల ద్వారా మంత్రికి వివరించారు.ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన అనంతరం శ్రీరామనవమి పర్వదినాన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుట్టారని తెలిపారు.ఆలయ పునరుద్ధరణ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.351 కోట్లు మంజూరు చేసిందని, ఆలయ అభివృద్ధి, విస్తరణ కోసం అవసరమైన భూసేకరణకు సుమారు రూ.75 కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. వచ్చే గోదావరి పుష్కరాల నాటికి పునరుద్ధరణ పనులను వంద శాతం పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు .భద్రాచలం దేవస్థానం ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఆలయ పునరుద్ధరణ పనులను ఆగమశాస్త్రాలకు అనుగుణంగా, శాస్త్రోక్తంగా చేపడుతున్నామని మంత్రి తెలిపారు. ముఖ్యంగా ఆలయ గోపురాలు, పురాతన నిర్మాణాల నాణ్యతను నిపుణులతో పరిశీలించి, వాటి ప్రాచీన వైభవానికి ఎలాంటి భంగం కలగకుండా పనులు కొనసాగిస్తున్నట్లు చెప్పారు.వచ్చే గోదావరి పుష్కరాలను పురస్కరించుకొని గోదావరి పరివాహక ప్రాంతంలో నూతన స్నాన ఘాట్ల నిర్మాణం, యాత్రికుల సౌకర్యాల విస్తరణ, మౌలిక వసతుల అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. స్థానిక ప్రజలు, భక్తుల విజ్ఞప్తుల మేరకు అవసరమైన ప్రాంతాల్లో నూతన స్నాన ఘట్లు పనులను కూడా కార్యాచరణలో చేర్చినట్లు చెప్పారు.పునరుద్ధరణ పనుల కారణంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనం, క్యూలైన్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రత తదితర సౌకర్యాలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.అనంతరం భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇంజినీరింగ్ శాఖ, దేవాదాయ శాఖ అధికారులతో ఆలయ పునరుద్ధరణ పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.సమీక్ష సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆలయ పునరుద్ధరణ పనుల పర్యవేక్షణ కోసం ఇంజినీరింగ్ శాఖ నుంచి ప్రత్యేక అధికారిని వెంటనే నియమించాలని దేవాదాయ కమీషనర్ హనుమంతరావు టెలిఫోన్ ద్వారా ఆదేశించారు. దేవాదాయ శాఖ కమిషనర్ ప్రతి 10 రోజులకు ఒకసారి క్షేత్రస్థాయిలో పర్యటించి పనుల పురోగతిని సమీక్షించాలని సూచించారు.వచ్చే గోదావరి పుష్కరాలకు 15 రోజుల ముందుగానే అన్ని పనులు పూర్తయ్యేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ఒకవైపు పనులు పూర్తయిన తర్వాత మరోవైపు పనులు ప్రారంభించేలా ప్రణాళిక రూపొందించాలని, తద్వారా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. ఎక్కువ పనులు చేపట్టాల్సిన ఉత్తర భాగంలో పనులను ప్రాధాన్యతతో ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.డ్రాయింగ్‌లు, డిజైన్‌లు, సాంకేతిక అనుమతుల్లో జాప్యానికి తావు ఇవ్వకుండా శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని, సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. బాధ్యత కలిగిన అధికారులను మాత్రమే పనుల పర్యవేక్షణకు నియమించి వారు నిరంతరం క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు.అవసరమైన చోట ప్రస్తుతం ఉన్న కార్మికుల కంటే 25 శాతం అదనంగా కార్మికులను నియమించి, నిరనంతరం పనులను వేగవంతం చేయాలని, రిటైనింగ్ వాల్స్, కాంక్రీట్ నిర్మాణాలు, ఇతర మౌలిక వసతుల పనులను నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని సూచించారు. రాతి నిర్మాణాలు, శిల్పకళా పనులను అనుభవజ్ఞులైన శిల్పులు, నిపుణులతోనే చేపట్టి నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని మంత్రి స్పష్టం చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, ఆలయ పునరుద్ధరణ పనులకు అవసరమైన ఇసుకను చట్టబద్ధంగా అందుబాటులో ఉన్న ప్రాంతాల నుంచి సకాలంలో సరఫరా అయ్యేలా అవసరమైన అనుమతులు జారీ చేస్తామని తెలిపారు. నిర్మాణ పనులకు అన్ని విధాలుగా జిల్లా యంత్రాంగం సహకరిస్తుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు, ఆర్కిటెక్ మూర్తి, ఇంజినీరింగ్ శాఖ అధికారులు, దేవస్థానం అధికారులు, ఆలయ అర్చకులు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *