– నాడు కేసిఆర్ రైతులకు అండగా నిలబడ్డారు
– కాంగ్రెస్ సర్కార్ చేతులెత్తేయడం తగదు
– మాజీ మంత్రి వేముల
నిజామాబాద్, ప్రజాతంత్ర, జూన్ 19 : ధాన్యం కొనుగోళ్లలో బీఆరఎస్ అధికారంలో ఉన్నప్ప్పుడు కూడా కేంద్రం కక్షపూరితంగా వ్యవహరించిందని, అయినా నాటి సీఎం కేసీఆర్ రైతులకు అన్యాయం చేయలేదని ఎమ్మెల్యే వేముల ప్రశాంతరెడ్డి అన్నారు. రైతులకు అండగా నిలిచి ఊరూరా కొనుగోలు కేంద్రాలతో రాష్ట్ర నిధులు రూ.12వేల కోట్లతో పంటలు కొనుగోలు చేయించారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉత్పత్తి అయిన మొత్తం ధాన్యంలో 3వ వంతు, ఇతర పంటల్లో 25శాతం కొనుగోలు చేయడం ఇప్ప్పుడే అమలు చేసిన కొత్త విధానం కాదని, నాడు బీఆరఎస్ సర్కార్ హయాంలోనూ ఇదే వైఖరిని అవలంబించిందని తెలిపారు. ఒక దశలో కేసీఆర్ ఏకంగా కేంద్రంపై రైతుల తరఫున పెద్ద పోరాటమే చేశారని, అయినా కేంద్రం మన రైతుల పట్ల తన వివక్షను వీడలేదని ఆయన గుర్తు చేశారు. అయితే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం సంబంధం లేదని చెబుతున్నదని, ఈ నేపథ్యంలో ఓ వైపు కేంద్రం 25శాతం పంటల్ని మాత్రమే కొనుగోలు చేయడం, మిగిలిన పంటను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరాకరిస్తుండటంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్లో విక్రయిద్దామంటే మద్దతు ధర దక్కే పరిస్థితి లేదని, తప్పని పరిస్థితుల్లో విక్రయించిన రైతులు నష్టాలు మూటగట్టుకుంటున్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతువ్యతిరేక చర్యలతో ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఉత్పత్తుల విక్రయం దైవాధీనంగా మారిందన్నారు. తాము అధికారంలోకి వస్తే ప్రతి పంటనూ మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని, మద్దతు ధరకు అదనంగా బోనస్ కూడా చెల్లిస్తామని ప్రకటించి తీరా అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేండ్లలోనే పంటల కొనుగోళ్లపై రేవంత్ ప్రభుత్వం చేతులెత్తేసిందని మండిపడ్డారు. ఉత్పత్తి చేసిన మొత్తం పంటలను కొనుగోలు చేయాలని, లేకుంటే రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




