– విద్యార్థులతో చర్చించేందుకు సిద్దమని సంకేతాలు
– లాఠీఛార్జ్లో గాయపడ్డ విద్యార్థులను పరామర్శించిన జెపి నడ్డా
న్యూదిల్లీ, జూలై 21: నీట్ ప్రశ్నపత్రం లీక్, విద్యా వ్యవస్థలో లోపాల నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) సోమవారం చేపట్టిన ’చలో పార్లమెంట్’ యాత్ర ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో సీజేపీ ఆందోళనకు శాంతియుత పరిష్కారం చూపే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విద్యార్థి ప్రతినిధులతో చర్చలకు సిద్ధమని కేంద్రం ప్రకటించినట్లు సమాచారం. ఈ సమస్యలకు చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందని కేంద్రం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అందుకోసం ఆ దిశగా చర్యలు చేపట్టింది. విద్య మంత్రిత్వ శాఖ లేదా ఉన్నతాధికారుల స్థాయిలో విద్యార్థులతో సమావేశం నిర్వహించే ఆస్కారం ఉందని తెలుస్తోంది. దీంతో నీట్ నిర్వహించే పరీక్షా వ్యవస్థలో పారదర్శకతతో పాటు సంస్కరణల దిశగా ముందడుగు పడనుంది. సోమవారం చలో పార్లమెంట్ యాత్రలో విద్యార్థులు, యువతపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ ఘటనలో గాయపడిన వారు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వారిని మంగళవారం కేంద్ర మంత్రి జేపీ నడ్డా పరామర్శించారు. అనంతరం విద్యార్థులతో కేంద్రం చర్చలకు సుముఖంగా ఉందనే ప్రచారం ప్రారంభమైంది. నీట్ ప్రశ్నపత్రం లీక్, పోటీ పరీక్షల్లో అవకతవకలతో పాటు పేపర్ లీకేజీ వ్యవహారంపై విద్యార్థి లోకం భగ్గుమంది. దీంతో జాతీయ స్థాయిలో విద్యార్థుల నిరసనలు, నిరాహార దీక్షలు ఉధృతమయ్యాయి. దాంతో విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ’చర్చల కోసం తలుపులు తెరిచే ఉన్నాయని’ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మరో వైపు ఈ అంశంపై ప్రధాని మోదీకి విద్యావేత్తలతో పాటు సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఒంకోవైపు నీట్ లీకేజీ వ్యవహారంపై ప్రధాని మోదీ తొలిసారి స్పందించారు. మంగళవారం న్యూదిల్లీలో మంగళ్ మిలన్ పేరిట ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నీట్ పేపర్ లీక్ ఘోర పాపమని అన్నారు. ఇలాంటివి పునరావృతం కాకూడదని స్పష్టం చేశారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు. ఈ పేపర్ లీకులను నివారించడం జాతీయ బాధ్యత అని ప్రధాని మోదీ తెలిపారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో సీజేపీ ప్రతినిధులు సోమవారం భేటీ అయిన సంగతి తెలిసిందే.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





