– ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ మెరుపు ధర్నా
– జంతర్మంతర్ ఆందోళనకారులపై లాఠీఛార్జికి నిరసనగా..
న్యూదిల్లీ, జూలై 21: ప్రధాని నరేంద్ర మోదీ నివాసం దగ్గర కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధర్నా చేపట్టారు. జంతర్మంతర్ వద్ద నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్కు నిరసనగా చేపట్టిన ఈ ధర్నాలో రాహుల్తో పాటు ఖర్గే, కేసీ, ప్రియాంక, పలువురు కాంగ్రెస్ ఎంపీలు పాల్గొన్నారు. కాంగ్రెస్ నేతలు చేతులకు సంకెళ్లు వేసుకుని నిరసన తెలిపారు. గూండాగిరి, నిరంకుశత్వం వద్దంటూ.. అణచివేత చర్యలు నడవవంటూ నిరసనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రధాని మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ నేతలను దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేస్తుంటే పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారంటూ కాంగ్రెస్ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేసారు. ధర్నా సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. నిన్న యువతపై లాఠీచార్జ్కు బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ లీకేజీపై పార్లమెంట్లో చర్చకు అంగీకరించలేదని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో జవాబుదారీతనం లేదని పేర్కొన్నారు. ప్రధాని మోదీ మౌనం వీడాలని, నీట్ అంశంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ మార్చ్ సందర్భంగా దిల్లీ పోలీసులు విద్యార్థులు, నిరసనకారులపై లాఠీఛార్జ్ చేశారు. విద్యార్థులపై అణచివేతకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ, మల్లికార్జున ఖర్గేలతోపాటు కాంగ్రెస్ నాయకులు లోక్కళ్యాణ్ మార్గ్లోని ప్రధాని నివాసం ముందు ధర్నాకు దిగారు. ధర్నాలో పవన్ ఖేరా, పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్, దీపేందర్ హూడా, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ సహా పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. విద్యార్థుల్ని బీజేపీ ప్రభుత్వం క్రూరంగా హింసించిందని, కానీ బాధ్యత వహించడానికి, పార్లమెంట్లో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని రాహుల్ గాంధీ ఆరోపించారు. మంగళవారం మధ్యాహ్నం కాంగ్రెస్ నేతల ధర్నాతో ఒక్కసారిగా దిల్ల్లీలో హైడ్రామా చోటుచేసుకుంది. రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ కాంగ్రెస్ ధర్నా చేస్తున్న ప్రదేశానికి చేరుకుని రాహుల్ గాంధీతో చర్చిస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆ ప్రాంతాన్ని వెంటనే ఖాలీ చేయాలని రాహుల్ గాంధీకి నచ్చచెప్పేలా ప్రయత్నిస్తున్నారు. రాహుల్తో పాటు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో చర్చించారు. మరోవైపు, కాంగ్రెస్ శ్రేణులు రాజీనామా చేయాలంటూ నినాదాలు చేస్తున్నారు.
సీజేపీ మార్చ్ సందర్భంగా లాఠీఛార్జి పై ప్రధాని మౌనం వీడాలి
సీజేపీ మార్చ్ సందర్భంగా విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యను కాంగ్రెస్ అగ్రనాయకుడు, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఖండించారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వీడాలని డిమాండ్ చేశారు. పోలీసుల లాఠీచార్జి, టియర్ గ్యాస్ ప్రయోగంలో గాయపడిన విద్యార్థులను రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ కలిసి పరామర్శించనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది పార్లమెంట్ వెలుపల డియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ, విద్యార్థులపై జరిగిన పోలీసు చర్య గురించి ప్రధాని మోదీ ఇప్పటివరకు స్పందించకపోవడం ఆశ్చర్యకరమన్నారు. విద్యార్థులపై జరిగిన ఘటనకు ప్రధాని క్షమాపణ చెప్పాలని, ఇలాంటి చర్యలు వెంటనే ఆగాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీలు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి ఈ ఘటనపై అత్యవసర చర్చ నిర్వహించాలని కోరారు. పోలీసు చర్యలో గాయపడిన విద్యార్థులు చికిత్స పొందుతున్న రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్కి రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వెళ్లి వారిని పరామర్శించనున్నారు. విద్యార్థుల గొంతును అణచివేసే ప్రయత్నాలను కాంగ్రెస్ సహించబోదని రాహుల్ స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు, పరీక్షల వ్యవస్థలో నెలకొన్న సంక్షోభం, పోలీసు చర్యపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
దేశ యువత కోసం రాహుల్ పోరాటం: రేవంత్
హైదరాబాద్ : యువత భవిష్యత్ కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. దిల్లీలో విద్యార్థులపై లాఠీఛార్జీకి బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రధాని నివాసం వద్ద ధర్నా చేపట్టారు. ఈ ఆందోళనకు మద్దతు తెలుపుతూ సీఎం రేవంత్రెడ్డి ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంకా గాంధీ మద్దతుగా నిలిచారని చెప్పారు. యంగ్ ఇండియాకు కాంగ్రెస్ అండగా ఉంటుందని సీఎం పేర్కొన్నారు.
రాహుల్, ఖర్గేల అరెస్ట్ అమానుషం : మంత్రి సీతక్క
హైదరాబాద్: ఢిల్లీలో విద్యార్థుల గొంతుకగా నిలబడి ప్రశ్నించిన ప్రతిపక్ష అగ్రనేతలను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వంటి అత్యంత కీలక అంశంపై సమాధానాలు ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం, ప్రశ్నించే వారిని అణచివేయడానికి ప్రయత్నించడం దురదృష్టకరం. విద్యార్థుల పక్షాన నిలబడి మాట్లాడితే అరెస్టు చేస్తారా.. ఇదేనా ప్రజాస్వామ్యం.. అని మంత్రి సీతక్క విమర్శించారు. మల్లికార్జున ఖర్గే, రాహుల్, ప్రియాంక సహా కాంగ్రెస్ అగ్రనేతల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తక్షణం కేంద్ర మంత్రి ధర్మెంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తు, దేశ విద్యా వ్యవస్థ విశ్వసనీయత.. రాజకీయాలకు అతీతమైన అంశాలు. ‘నీట్’ వ్యవహారంపై పారదర్శకంగా సమగ్ర చర్చ జరిపి నిజమైన బాధ్యులను శిక్షించి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





