– పోలీసుల కట్టుదిట్టమైన భద్రతా చర్యలు
– హర్యానా-పంజాబ్ శంభు సరిహద్దు వద్ద ఉద్రిక్తత
న్యూదిల్లీ, జూలై 21: హర్యానా-పంజాబ్ సరిహద్దులోని శంభు సరిహద్దు వద్ద హైటెన్షన్ నెలకొంది. మహాపంచాయత్లో పాల్గొనేందుకు పంజాబ్, హర్యానా నుంచి దిల్లీ వైపుగా వేలాదిమంది రైతులు బయలుదేరారు. దిల్లీలోని కిసాన్ ఘాట్ వద్ద నిరసన తెలిపేందుకు అన్నదాతలు వస్తుండటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపాదిత భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంలో భాగంగా తక్కువ ధరకు, సబ్సిడీతో కూడిన అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు భారత మార్కెట్లను తెరవడాన్ని వ్యతిరేకిస్తూ రైతులు నిరసనకు దిగుతున్నారు. అయితే, వారిని అడ్డుకునేందుకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. దిల్లీలోని కిసాన్ ఘాట్ వద్ద మహాపంచాయత్కు ’దేశ్ బచావో మోర్చా’ పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా సుమారు 550 రైతు సంఘాలు, సామాజిక సంస్థలు ఇందులో పాల్గొననున్నాయి. అయితే, నేడు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ దిల్లీకి బయలుదేరుతున్నట్లు ప్రకటించింది. దీంతో శంభు సరిహద్దును పోలీసులు మూసివేశారు. రైతులను అడ్డుకునేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ అన్నదాతలను నిలువరించేందుకు చర్యలు చేపట్టారు. బారికేడ్లు, ఇనుప కంచెలను ఏర్పాటు చేశారు. సందర్భంగా కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ పంజాబ్ నాయకుడు జర్మన్జిత్ సింగ్ బండాలా మాట్లాడారు. ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం భారతీయ రైతులు, కార్మికులు, చిన్న వ్యాపారులు, విస్తృత ప్రజానీకంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అన్నారు. భారతదేశంలోని చిన్న, సన్నకారు రైతుల ప్రయోజనాలను విస్మరిస్తూ అమెరికన్ కంపెనీలు, రైతులకు ప్రయోజనం చేకూర్చడమే ఈ ఒప్పందం లక్ష్యమని బండాలా ఆరోపించారు. నేడు పంజాబ్ రైతులతో పాటు హర్యానా, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ సహా పలు రాష్టాల్ర నుంచి నిరసనలో పాల్గొనేందుకు అన్నదాతలు వస్తున్నారని తెలిపారు. ఒకవేళ తాము దిల్లీకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటే అక్కడే శాంతియుత సమావేశాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని, ఒప్పందాన్ని కేంద్రం రద్దు చేయకపోయినా, తమ డిమాండ్లను పరిష్కరించకపోయినా ఆందోళనను తీవ్రతరం చేస్తామని బండాలా హెచ్చరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





