– నిర్మాణంలో ఉన్న సొరంగంపై విరిగిపడ్డ కొండచరియలు
– పదిమంది కార్మికుల దుర్మరణం
గ్యాంగ్టక్,జూలై 21: సిక్కింలో ఘోర విషాదం చోటుచేసుకుంది. దక్షిణ సిక్కింలోని సమర్దుంగ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న సొరంగం వద్ద కొండచరియలు విరిగిపడటంతో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు పదిమంది మృతిచెందారు. వారి మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు వెల్లడించారు. మరో 20 మందికిపైగా కార్మికులు శిథిలాల కింద చిక్కుకుని ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను నామ్చి జిల్లా కలెక్టర్ అనుప తమ్లింగ్ వెల్లడించారు. సోమవారం తీస్తా స్టేజ్-జలవిద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన సొరంగంలో ఈ ప్రమాదం జరిగింది. పటేల్ ఇంజినీరింగ్ సంస్థ నిర్మాణ పనులు నిర్వహిస్తుండగా, సొరంగం లోపల అకస్మాత్తుగా కొండచరియలు విరిగిపడి మార్గం పూర్తిగా మూసుకుపోయింది. అదే సమయంలో థేన్ గ్యాస్ లీక్ కావడంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. ఘటన అనంతరం జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం, సిక్కిం పోలీసులు, అగ్నిమాపక, అత్యవసర సేవల బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. అయితే సొరంగంలో థేన్ గ్యాస్ స్థాయిలు అధికంగా ఉండటంతో రక్షణ సిబ్బంది లోపలికి వెళ్లడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదనంగా ఎన్హెచ్పీసీకి చెందిన ఆరుగురు సిబ్బంది కూడా లోపలే ఉన్నట్లు సమాచారం. సొరంగంలోకి ప్రవేశించిన తొలి సహాయక బృంద సభ్యులు థేన్ ప్రభావంతో శ్వాస తీసుకోవడంలో పలు సమస్యలను ఎదుర్కొన్నారు. వారిని వెంటనే బయటకు తీసుకువచ్చి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





