– కెసిఆర్ హాయంలోనే కూలిన కాళేశ్వరం
– కేంద్ర నిపుణలు సూచనల మేరకు నీటి విడుదల
– మీడియాతో మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 14: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందే కాళేశ్వరం కుంగిపోయిందని బీఆర్ఎస్పై మంత్రి పొన్నం ప్రభాకర్ మరోసారి విరుచుకుపడ్డారు. కాళేశ్వరం కూలడానికి కారణం బీఆర్ఎస్ అని ఆరోపించారు. ఊరూరా తిరిగి బీఆర్ఎస్ చేసిన కుట్రలను ప్రజలకు తెలియజేస్తా మన్నారు.మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రక్తం ప్యాకెట్లతో రాజకీయం చేయాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్పై మండిపడ్డారు. ఎన్డీఎస్ఏ తుది నివేదిక ఇచ్చి కాళేశ్వరంలో నీటిని నింపమని చెబితే.. వెంటనే నింపుతామని చెప్పారు. ఇంజినీర్లు ఇచ్చిన సలహాలను పాటిస్తామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగంలోకి రావాలంటే ఏం చేయాలో నిపుణులు చెబితే వెంటనే అమలు చేస్తామని మంత్రి వెల్లడించారు. ఎన్డీఎస్ఏ సూచనల మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. కరవును దృష్టిలో పెట్టుకొని ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే మేడిగడ్డ, కన్నెపల్లి విషయంలో రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. వర్షాలు తక్కువ పడతాయని శాస్త్రవేత్తలు, పర్యావరణ నిపుణులు చెబుతున్నారన్నారు. ఎల్నినోను ఎదుర్కోవడానికి ప్రభుత్వం తరఫున సూచనలు చేస్తున్నామని చెప్పారు. కరవును దృష్టిలో పెట్టుకొని రైతులు ప్రత్నామ్యాయ పంటలు వేసుకోవాలని సూచించారు. ప్రకృతి వైపరీత్యాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలుగా అంతర్గతంగా ఎన్ని సమస్యలు ఉన్నా కలిసి ఎదుర్కోవాలని, బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా సలహాలు, సూచనలు ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





