- ప్రభుత్వానికి ఏ రోగమొచ్చింది..
- ఒకటిన్నరేళ్ళలో తిరోగమన దశలో రాష్ట్రం
- మాటల తూటాలతో విరుచుకుపడిన కెసిఆర్
(మండువ రవీందర్రావు,ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి )
కాంగ్రెస్ అధికారంలోకి వొచ్చిన ఒకటిన్నరేళ్ళలో పురోగమించాల్సిన రాష్ట్రం తిరోగమిస్తున్నది. ఎన్నో అద్భుతాలు సాధించుకున్న తెలంగాణ ఇతర రాష్ట్రాల కన్నా ఇప్పుడు వెనుకబడిపోతున్నది. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను వంచన చేస్తున్నది. ఎన్నికల ముందు ఏవేవో వాగ్దానాలుచేసి నమ్మబలికింది. ఇప్పుడు ఆర్ధిక పరిస్థితి బాగులేవంటున్నది. ఇలాంటి ప్రభుత్వ తీరుపైన ప్రజలు, మేధావి వర్గాలు సరైన పరిష్కారమార్గాన్ని ఆలోచించాలని బిఆర్ఎస్ (BRS) అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు విజ్ఞప్తి చేశారు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి సాధించుకున్న తెలంగాణను గత పదేళ్ళ కాలంలో అభివృద్ధి దిశగా నడిపించాం. ప్రాజెక్టులు నిర్మించి బీడు భూములన్నిటినీ సాగు భూములుగా చేశాం. పంజాబ్ను తలదన్నెవిధంగా అపార పంటలు పండించి నెంబర్ వన్గా నిలిపాం. గత ప్రభుత్వాలకు భిన్నంగా రైతుల నుంచి శిస్తులను వసూలు చేయడానికి బదులు రైతులకు ఆర్థిక వెసులుబాటు కలిగించాం. అలాంటి తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటిన్నరేండ్ల కాలంలో ఒకటవ స్థానం నుంచి 14వ స్థానానికి దిగజార్చిందంటూ ఆవేదన వ్యక్తంచేశారు.
బిఆర్ఎస్ పార్టీ స్థాపించి 25 ఏండ్లు పూర్తయిన సందర్భంగా హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం భారీగా రజతోత్సవ వేడుకల సభ నిర్వహించారు. ఈ సందర్బంగా కెసిఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నిరంగాల్లో ఫెయిల్ అయిందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఆ పార్టీ నెంబర్ వన్ విలన్గా మారిందన్నారు. 1956 నుండి కాంగ్రెస్ పాలకులు తెలంగాణను దగా చేస్తూనే ఉన్నారన్నారు. తెలంగాణను బలవంతంగా ఆంధ్రతో కలిపింది జవహర్లాల్ నెహ్రూనే అన్నారు. నాటి నుంచి అనేక అవమానాలు, అవహేళలను బరించాల్సి వొచ్చింది. వలసవాదుల విషకౌగిలి నుంచి విముక్తి కలిగించేందుకు అనేక పోరాటాలు చేయాల్సివచ్చిందన్నారు. అందులో భాగంగానే 25 ఏండ్ల కింద గులాబి జండాను ఎగురవేశాం. కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసమైన జలదృశ్యం వేదికగా బిఆర్ఎస్ ఏర్పడింది. ఆనాడే చెప్పాం. ఉద్యమ జెండాను దించితే రాళ్ళతో కొట్టమని. చివరకు ప్రాణాలకు తెగించి ఆమరణదీక్ష చేపట్టడంతో కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చింది. స్వరాష్ట్రాన్ని సాధించుకుని గత పదేళ్ళలో అద్భుత ప్రగతిని సాధించాం. రాష్ట్రం సాధించడానికి ముందుగాని ఆ తర్వాతగాని ఏనాడు పదవులకోసం పాకులాడలేదు. కాని టిడిపి, కాంగ్రెస్ నాయకులు పదవు కోసం తమ పెదవులను మూసుకున్నారు. తమ రాజకీయ అవసరాల కోసం బిఆర్ఎస్తో పొత్తులు పెట్టుకున్నారు. రాష్ట్రం ఏర్పడింది మొదలు అనేక రంగాల్లో తెలంగాణను నెంబర్ వన్గా నిలిపాం. ఎన్నో అద్భుతాలు సాధించుకున్నాం. కాని ఏడాదిన్నరలోనే మళ్ళీ 2014 నాటి పరిస్థితులు పునరావృతం అవుతున్నాయి.
ఎన్నికల ముందు కాంగ్రెస్ అనేక మాటలు చెప్పింది. ఇక్కడి వారు చాలదన్నట్లు దిల్లీ నుంచి ఆగాంధీ, ఈ గాంధీ అంటు దిగారు. నాలుగు వందల ఇరవై హామీలిచ్చారు. కెసిఆర్ కన్నా మిన్నగా సహాయం చేస్తామన్నారు. హామీలేమైనాయంటే సంక్రాంతి, ఉగాది అంటూ దాటవేస్తున్నారు. అదేమంటే అప్పు పుట్టడంలేదంటున్నారు. కెసిఆర్ పించను రెండు వేలు ఇస్తే మేము నాలుగువేలిస్తామన్నారు. రైతుబంధు కెసిఆర్ పదివేలు ఇస్తే తాము 15వేలిస్తామన్నారు. విద్యార్థినిలకు స్కూటీ ఇస్తమన్నారు. కల్యాణలక్ష్మి పథకంలో లక్ష రూపాయలతోపాటు తులం బంగారం ఇస్తామన్నారు. ఒక్క కలంపోటుతో రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఏ ఒక్క మాటను ఈ ప్రభుత్వం నిలుపుకోలేదు. బిఆర్ఎస్ ప్రభుత్వం రెప్పపాటుకూడా కరెంటు పోనివ్వలేదు. కాని ఇప్పుడు మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి. భూముల ధరలు తగ్గుతున్నాయి. సాగునీరు, తాగునీటికి కరువు ఏర్పడింది. అంతేకాదు దాదాపు 90 శాతం పూర్తి అయిన ప్రాజెక్టులను కూడా ఈ ప్రభుత్వం పక్కనపెట్టడం వారి అవివేకానికి నిదర్శన్నారు కెసిఆర్. కాంగ్రెస్ అధికారంలోకి వొచ్చిన తర్వాత తగిన సమయం ఇవ్వాలని ఇంతకాలం ఓపిక పట్టాం, ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై ఇప్పటినుండి అందరి తరఫున తాను పోరాటం చేస్తానన్నారు కెసిఆర్.
తాను అసెంబ్లీకి రావడంలేదన్న విమర్శలపై తమ పార్టీనాయకులు అడిగినదానికే సమాధానాలు చెప్పలేకపోతున్నప్పుడు నీ ముచ్చట వినడానికా అంటూ వెటకారమాడారు. పోలీసులు తమ పార్టీవారిపైన అక్రమ కేసులు పెట్టి వేదించడంపై మాట్లాడుతూ డైరీలో రాసుకోండి. వొచ్చేది తమ ప్రభుత్వమేనని హెచ్చరించారు.
బిజెపికి కూడా తెలంగాణకు అన్యాయం చేస్తున్నది. పదకొండు ఏండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తెలంగాణకు పదకొండు రూపాయలు కూడా ఇవ్వలేదు. దేశంలో 107 మెడికల్ కాలేజీలిస్తే తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదు. అయినా మూడు మెడికల్ కాలేజీలను తమ ప్రభుత్వం 33కు పెంచిందన్నారు కెసిఆర్. ఖమ్మం నుండి ఏడు మండలాలను , సీలేరు ప్రాజెకుట్లుకు ఆంధ్రకు బిజెపి ప్రభుత్వం కట్టబెట్టిందని, అంతేగాక తల్లిని చంపి బిడ్డను బతికించారని తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోది చేసిన కామెంట్ ఆయనకు తెలంగాణపట్ల అభిప్రాయాన్ని తెలుపుతున్నదన్నారు.
తెలంగాణలోని కనీసం ఒక్క ప్రాజెక్టుకైనా కేంద్రం జాతీయ హోదా ఇవ్వలేదంటూ ఆయన విమర్శించారు కగార్ అపరేషన్పై మాట్లాడుతూ గిరిజనుపై దాడులను ఆపి నక్సల్స్తో చర్చలు జరుపాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. దీన్ని తీర్మానంగా పంపాలా అంటూ సభికులనుండి ఆయన అవుననే సమాధానాన్ని రాబట్టుకున్నారు. కాగా ప్రసంగానికి ముందు కాశ్మీర్లో ఉగ్రవాదులు 28 మందిని దారుణంగా హతమార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తూ వారి ఆత్మశాంతికి రెండు నిమిషాలపాటు మౌనాన్ని పాటించారు.