నమ్మించి అత్యాచారం చేసి బంగారు నగలు దోచుకుంటున్న వ్యక్తి అరెస్ట్
రిమాండ్ కు తరలింపు
ఆమనగల్లు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 26 : ఒంటరి మహిళలే లక్ష్యంగా చేసుకొని వారిని మాయమాటలతో నమ్మించి మోసగించి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి వారి ఒంటిపై ఉన్న బంగారు నగలను దోచుకెళ్తున్న ఘరానా దొంగను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా అతన్ని రిమాండ్ కు తరలించినట్లు ఆమనగల్లు ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం ఉల్పర గ్రామానికి చెందిన ముకురాల రాజేందర్ గౌడ్ అలియాజ్ రాజు, గోలి శివ చికెన్ షాప్ నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తుండేవాడు. జల్సా లకు అలవాటు పడి మాయమాటలతో మహిళలను మోసగిస్తుండే వారన్నారు. అతనిపై డిండి, ఊరుకొండ, కల్వకుర్తి, లింగాల వంగూరు, కల్వకుర్తి, నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్లలో పలు సెక్షన్ల పై కేసులు విచారణలో ఉన్నాయన్నారు. ఈనెల ఏప్రిల్ 21 న వెల్దండ మండలం కుప్పగండ్ల గ్రామానికి చెందిన ఓ మహిళను లోను ఇప్పిస్తానని ఆమనగల్లుకు తీసుకువచ్చి ద్విచక్ర వాహనంపై కూర్చోబెట్టుకొని చింతలపల్లి ప్రాంతంలో నిర్మానుష ప్రాంతానికి వెళ్ళాడన్నారు. ఆమె ఒంటిపై ఉన్న రూ. 31,000/- విలువ గల బంగారు ఆభరణాన్ని దొంగిలించుకుపోవడంతో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపి నిందితున్ని పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. అతని వద్ద ఉన్న సెల్ ఫోన్ ద్విచక్ర వాహనాన్ని స్వాధీన పరుచుకొని కోర్టులో హాజరుపరచగా రిమాండ్ కు తరలించినట్లు సిఐ వెంకటేశ్వర్లు వెల్లడించారు.





