– మొదటి త్రైమాసికంలో 20% ఆదాయ వృద్ధి
– ఆపరేటింగ్ ఈబిట్డా 30% పెరుగుదల
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 5: దేశంలోని ప్రముఖ సమగ్ర ఆరోగ్య సేవల సంస్థ ఆస్టర్ డీఎం క్వాలిటీ కేర్ లిమిటెడ్ 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) బలమైన ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. కంపెనీ సంయుక్త ప్రోఫార్మా ఆదాయం గత ఏడాదితో పోలిస్తే 20 శాతం పెరిగి రూ.2,597 కోట్లకు చేరగా, ఆపరేటింగ్ ఈబిట్డా 30 శాతం పెరిగి రూ.576 కోట్లకు చేరింది. ఈబిట్డా మార్జిన్ 22.2 శాతానికి చేరి 170 బేసిస్ పాయింట్లు మెరుగుపడింది. జూలై 1, 2026 నుంచి అమల్లోకి వచ్చిన ఆస్టర్ డీఎం హెల్త్కేర్-క్వాలిటీ కేర్ విలీనంతో దేశంలోని అతిపెద్ద ఆస్పత్రుల నెట్వర్క్లలో ఒకటిగా సంస్థ అవతరించిందని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం 28 నగరాల్లో 10,800కు పైగా పడకలతో సేవలు అందిస్తున్న ఈ సంస్థ, రాబోయే సంవత్సరాల్లో 15 వేలకుపైగా పడకలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ అజాద్ మూఫెన్ మాట్లాడుతూ, ఈ విలీనం సంస్థ అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతికత, కృత్రిమ మేధస్సు , రోబోటిక్స్, పరిశోధనలతో అత్యుత్తమ వైద్య సేవలను మరింత విస్తరించనున్నట్లు తెలిపారు. మేనేజింగ్ డైరెక్టర్ & గ్రూప్ సీఈఓ వరుణ్ ఖన్నా మాట్లాడుతూ, తొలి త్రైమాసికంలో సంస్థ దాదాపు 20 లక్షల మంది రోగులకు వైద్య సేవలు అందించిందని, ఇది గత ఏడాదితో పోలిస్తే 13 శాతం అధికం అని చెప్పారు. విలీనం ద్వారా ఏర్పడిన సమగ్ర వ్యవస్థను మరింత బలోపేతం చేసి, రోగి సేవలు, సాంకేతిక వినియోగం, ఆస్పత్రుల నిర్వహణలో మెరుగైన ఫలితాలపై దృష్టి సారిస్తామని తెలిపారు. ఈ త్రైమాసికంలో సంస్థ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ (ఆర్ ఓసీఈ) 22.9 శాతానికి పెరిగి 246 బేసిస్ పాయింట్లు మెరుగుపడింది. అలాగే కాసరగోడ్ ఆస్పత్రి ప్రారంభమైన తొమ్మిది నెలల్లోనే నెలవారీ ఈబిట్డా బ్రేక్ఈవెన్ సాధించడం విశేషంగా నిలిచింది. విలీనానికి ముందు సంస్థల పనితీరును పరిశీలిస్తే, ఆస్టర్ డీఎం హెల్త్కేర్ ఆదాయం 22 శాతం పెరిగి రూ.1,311 కోట్లకు, క్వాలిటీ కేర్ ఆదాయం 19 శాతం పెరిగి రూ.1,287 కోట్లకు చేరాయి. రెండు సంస్థలు కూడా ఆదాయం, లాభదాయకత, రోగుల సంఖ్యలో గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




