– మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 21 : జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి 21మందికి ఆర్థిక సహాయం మంజూరైనట్లు మీడియా అకాడమి చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆయన అధ్యక్షతన నాంపల్లిలోని అకాడమీ కార్యాలయంలో జర్నలిస్టుల సంక్షేమ నిధి కమిటీ 5వ సమావేశం గురువారం జరిగింది. ఆర్థిక సహాయం కోసం వచ్చిన 29 దరఖాస్తులను కమిటీ సభ్యులు పరిశీలించి 17మంది మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు, తీవ్ర ప్రమాదాలకు గురైన, దీర్ఘకాలికంగా అనారోగ్యం బారినపడిన నలుగురు జర్నలిస్టులకు కూడా ఆర్థిక సహాయం మంజూరు చేశారు. మరణించిన 17మంది జర్నలిస్టుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం, ఆయా కుటుంబాలకు ప్రతి నెలా రూ.3 వేల చొప్పున అయిదేళ్లపాటు పెన్షన్ అందజేస్తామని ఆయన తెలిపారు. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలలో ఎల్కేజి నుండి పదవ తరగతి వరకు చదువుతున్న ఇద్దరు పిల్లలకు ఒక్కొక్కరికి నెలకు రూ.వెయ్యి చొప్పున ట్యూషన్ ఫీజును మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. నలుగురు అనారోగ్యం బారిన పడిన వర్కింగ్ జర్నలిస్టులకు జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి ఆర్థిక సహాయం మంజూరు చేసినట్లు కూడా తెలిపారు. ఈ సమావేశంలో సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ డి.ఎస్. జగన్, మీడియా అకాడమి కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వరరావు, అకౌంట్స్ ఆఫీసర్ పూర్ణచందర్ రావు, మేనేజర్ డి.ఆర్.ఎస్. శైలెశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





