– చిన్నారెడ్డి అధ్యక్షతన కమిటీ అధ్యయనం
– రాష్ట్ర నిపుణుల కమిటీ తొలి సమావేశం
హైదరాబాద్,ప్రజాతంత్ర,జూలై22: వాతావరణ మార్పుల ప్రభావం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తు సన్నద్ధత అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రంలో ప్రస్తుత ఎల్ నినో పరిస్థితుల ప్రభావాన్ని అంచనా వేయడం కోసం నిపుణుల కమిటీ భేటీ అయ్యింది. వ్యవసాయం దాని అనుబంధ రంగాల కోసం రాష్ట్రస్థాయి అత్యవసర కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం, ఉపశమన, అనుసరణ చర్యలను సిఫారసు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన 27 మంది సభ్యులతో కూడిన బహుళ విభాగాల నిపుణుల కమిటీ తొలి సమావేశం ప్రజాభవన్లో రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు డాక్టర్ జి.చిన్నారెడ్డి అధ్యక్షతన బుధవారం జరిగింది. కమిటీలో భారత వాతావరణ శాఖ, ఇక్రిశాట్, ఐసీఏఆర్-క్రిడా, నాబార్డ్, వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య విశ్వవిద్యాలయాలు, భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ, భారతీయ నూనె గింజల పరిశోధనా సంస్థ, మార్క్ ఫెడ్, ఆయిల్ఫెడ్, జాతీయ విత్తన సంస్థ, రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థతోపాటు వివిధ ప్రభుత్వ శాఖలు, పరిశోధనా సంస్థలు, విశ్వవిద్యాలయాలకు చెందిన నిపుణులు సభ్యులుగా ఉన్నారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత నైరుతి రుతుపవనాల కాలంలో అసాధారణ వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. ఆరు నెలలుగా ఎల్ నినో ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనాలు ఉన్నప్పటికీ, రాష్ట్రంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని చాలా మంది భావించారని, అయితే జూన్ 1 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో సగటున సుమారు 30 శాతం వర్షపాత లోటు నమోదైందని, 10 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదుకాగా, 23 జిల్లాల్లో వర్షపాత లోటు ఉందని తెలిపారు.
—————————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




