– ఏఐ సేవలకు మరింత ఊతం
హైదరాబాద్,ప్రజాతంత్ర,ఆగస్ట్7: ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్, భారత్లో తన క్లౌడ్ సేవలను మరింత విస్తరించింది. హైదరాబాద్ కేంద్రంగా ‘‘ఇండియా సౌత్ సెంట్రల్’’ పేరుతో తన నూతన క్లౌడ్ రీజియన్ను ప్రారంభించింది. ఈ కొత్త కేంద్రం ఏర్పాటుతో దేశంలో మైక్రోసాఫ్ట్ క్లౌడ్ రీజియన్ల సంఖ్య నాలుగుకు చేరుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఎంటర్ప్రైజ్ సేవలకు అవసరమైన మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు సంస్థ వెల్లడించింది. తెలంగాణలో ఏర్పాటైన ఈ నూతన రీజియన్ ద్వారా వినియోగదారులు తమ డేటాను స్థానికంగానే భద్రపరుచుకోవచ్చు. దీనివల్ల అత్యున్నత భద్రతతో పాటు వేగవంతమైన సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే పూణె, చెన్నై, ముంబై నగరాల్లో మైక్రోసాఫ్ట్కు క్లౌడ్ రీజియన్లు ఉండగా, తాజా విస్తరణతో భారత్లో అతిపెద్ద హైపర్స్కేల్ క్లౌడ్ నెట్వర్క్ కలిగిన సంస్థగా మైక్రోసాఫ్ట్ నిలిచింది. సేవల్లో ఎలాంటి అంతరాయాలు కలగకుండా ఉండేందుకు వీలుగా ఈ కేంద్రంలో అవైలబిలిటీ జోన్లను ఏర్పాటు చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా, 2030 నాటికి నీటి వినియోగాన్ని గణనీయంగా తగ్గించే లక్ష్యంతో ఇందులో ‘‘జీరో-వాటర్ కూలింగ్’’ సాంకేతికతను వినియోగిస్తున్నారు. అదానీ గ్రూప్, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, పీబీ పే వంటి ప్రముఖ భారతీయ సంస్థలు ఇప్పటికే ఈ హైదరాబాద్ రీజియన్ సేవలను వినియోగించుకుంటున్నాయి. భారత్లో డిజిటల్, ఏఐ మౌలిక సదుపాయాల కోసం మైక్రోసాఫ్ట్ ప్రకటించిన 20.5 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడులలో భాగంగా ఈ నూతన రీజియన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ పునీత్ చందోక్ మాట్లాడుతూ, ఏఐ సాంకేతికతతో విలువైన ఫలితాలను సాధించాలంటే, డేటాకు సమీపంలో నమ్మకమైన మౌలిక సదుపాయాలు ఉండటం అత్యంత కీలకమని పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు