– ఇప్పటివరకు అధికారులు తనిఖీలు చేయలేదు
– కాంగ్రెస్ వచ్చిన నాటినుంచి సింగరేణిలో వరుస స్కామ్లు
– స్టాక్ యార్డుల్లో వుండాల్సిన బొగ్గు ఏమయింది?
– నిజం నిగ్గు తేల్చకపోతే సమ్మె తప్పదు
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరిక
– కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి లేఖ
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 5: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి వరుస కుంభకోణాలకు కేరాఫ్ గా మారింది.. నైని కుంభకోణం మొదలుకుని వందల అక్రమాల విషయంలో కేంద్రం నుంచి స్పందన లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈమేరకు ఆయన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాశారు. ఎప్పటికప్పుడు నిల్వలు తనిఖీ చేసే బొగ్గు గనుల శాఖ కానీ, కాగ్ అధికారులు కానీ ఇప్పటిదాకా ఎందుకు తనిఖీలు చేపట్టలేదని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సింగరేణి మనుగడనే దెబ్బతీస్తున్నాయని ఆరోపించారు. కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి మిలాఖాత్ లేకుంటే వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వరుస స్కాంలతో వణికిపోతున్న సింగరేణిలో రూ.1600 కోట్లు విలువ చేసే బొగ్గు మాయం చేసి సంస్థ గొంతుకోసే కుట్రకు తెరతీశారని ఆరోపించారు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 40 లక్షల మెట్రిక్ టన్నుల స్కామ్ జరగడం సంస్థ మనుగడనే ప్రమాదంలోకి నెడుతోందన్నారు. సింగరేణి అధికారిక వెబ్ సైట్ రికార్డుల్లో ఏడు గనుల వద్ద బొగ్గు స్టాక్ ఉన్నట్టు పేర్కొన్నప్పటికీ క్షేత్రస్థాయిలో అది కనిపించకపోవడం ఈ కుంభకోణాన్ని తేటతెల్లం చేస్తోందన్నారు. 40 లక్షల టన్నుల బొగ్గు మీద కోల్ సెస్ తోపాటు, ఇన్ కమ్ టాక్స్ కూడా కట్టామని లెక్కలు చూపిస్తున్నా క్షేత్రస్థాయిలో బొగ్గు లేకపోవడం వెనక ఎవరి హస్తం ఉందో తేలాల్సిన అవసరం ఉందన్నారు. ఏప్రిల్ నెలాఖరు నాటికి మందమర్రిలో 7,20,00 మెట్రిక్ టన్నులు, శ్రీరాంపూర్ లో 8 లక్షల మెట్రిక్ టన్నులు, రామగుండం-1 లో ఆరు లక్షలు, రామగుండం-2 లో నాలుగు లక్షలు, భూపాలపల్లిలో 5 .40 లక్షలు, ఇల్లందులో 3.50 లక్షలు, సత్తుపల్లిలో 2 లక్షల మెట్రిక్ టన్నులతోపాటు ఇతర వాటిని కలిపి సుమారు 40 లక్షల మెట్రిక్ టన్నుల స్టాక్ ఉందని లెక్కలు చూపించారు.. కానీ స్టాక్ పాయింట్ల దగ్గర ఆ బొగ్గు లేకపోవడమే ఈ కుంభకోణానికి అతిపెద్ద ఆధారమని ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్ లోనే గనుల వద్ద నిల్వలను తనిఖీ చేసే గనుల శాఖ అధికారుల బృందాలు రాకపోవడం, చివరికి కాగ్ అధికారులు కూడా ఇప్పటిదాకా తనిఖీలు చేపట్టకపోవడం అనేక అనుమానాలకు తావిస్తున్నదన్నారు. ఈ స్కాంను దాచిపెట్టే కుట్రలు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఒక అఖిలపక్షాన్ని ఆయా గనుల వద్దకు పంపాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కుంభకోణమే కాక ఇటీవల బీఆర్ఎస్ వెలుగులోకి తెచ్చిన నైని బొగ్గు గని టెండర్ల స్కాం కూడా దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిందన్నారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాంటి సింగరేణిని కబళించేందుకు సీఎం రేవంత్ హయాంలో సైట్ విజిట్ సర్టిఫికెట్ అనే నిబంధన పెట్టి కోరుకున్న వారికి టెండర్లు కట్టబెట్టే కుతంత్రాన్ని అమలుచేశారన్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి బావమరిది సృజన్ రెడ్డి కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతుందని తేలినా ఇప్పటిదాకా దీనిపై మీరు చర్యలు తీసుకున్న పాపాన పోలేదని కేటీఆర్ గుర్తుచేశారు.
అక్రమార్కుల భరతం పట్టే దిశగా అడుగు వేయలేదు
నైని కోల్ స్కామ్ ను బీఆర్ఎస్ బయటపెట్టగానే ఆగమేఘాల మీద టెండర్ల ప్రక్రియను రద్దుచేస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు తప్ప టెండర్లలో అక్రమార్కుల భరతం పట్టే దిశగా ఒక్క అడుగు వేయలేదన్నారు. టెండర్ పోటీదారులను బెదిరించి, భయపెట్టి ప్రక్రియ నుంచి తప్పించే పన్నాగాలు సాగినా దీనికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేయలేదు. ఈ టెండర్ల అక్రమాలను నిగ్గు తేల్చడానికి కేంద్రం వేసిన కమిటీ ఇప్పటివరకూ ఏం తేల్చిందో కూడా పత్తాలేదు. నైని కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపి మూడురోజుల్లోనే నివేదిక ఇవ్వాలని ఆదేశించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎందుకు మొద్దునిద్ర పోతోందో సింగరేణి కార్మికులకు సమాధానం చెప్పాలన్నారు.గతంలో నైని స్కామ్ తోపాటు.. 107 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టుల నిబంధనలకు పాతరేసి నేషనల్ యావరేజీని కూడా మించి అత్యధిక ధరలకు టెండర్లు కట్టబెట్టి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి నేరుగా డీజిల్ కొనుగోలు చేసే విధానాన్ని అర్థాంతరంగా రద్దుచేసి అందులోనూ దోపిడీకి తెరలేపారు. అలాగే పేలుడు పదార్థాల కొనుగోళ్లలోనూ కోల్ ఇండియా కంటే 30 శాతం అధిక నిధులు చెల్లించి అనుయాయులకు కట్టబెట్టారు. అంతే కాకుండా చివరికి మెస్సీతో ముఖ్యమంత్రి ఫుట్ బాల్ మ్యాచ్ కోసం రూ.110 కోట్ల సింగరేణి నిధులను దుర్వినియోగం చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇలా వరుస కుంభకోణాలు జరుగుతున్నా అక్రమార్కుల భరతం పట్టకుండా కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడం వెనక కాంగ్రెస్-బీజేపీ చీకటి ఒప్పందాలే కారణమని కార్మికులకు అర్థమైపోయిందన్నారు. సింగరేణిలో జరుగుతున్న అక్రమ దందాలను వెలుగులోకి తెచ్చేందుకు చివరికి ఆర్టీఐ కింద దరఖాస్తు చేసినా వివరాలు బయటకు పొక్కకుండా దుష్టశక్తులు అడ్డుకుంటున్న దుస్థితి నెలకొందన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ వెలుగులోకి తెచ్చిన రూ.1600 కోట్ల సింగరేణి బొగ్గు కుంభకోణంపై వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కార్మికుల పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కుంభకోణంపై ఒకవేళ మీరు విచారణ జరపకపోతే కార్మికలోకంతో కలిసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై బీఆర్ఎస్ పార్టీ జంగ్ సైరన్ మోగిస్తుందని కేటీఆర్ హెచ్చరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




