కీలకమైన ‘పాలమూరు-రంగారెడ్డి’పై నిర్లక్ష్యం

~ తెలంగాణ వస్తే పాలమూరు ప్రాజెక్టులు పూర్తవుతాయని భావించాం
~ కేసీఆర్ పాలనలో రూ.లక్షా 81 వేల కోట్లు పాజెక్టుల పనులకు ఖర్చు
–  అందులో రూ.లక్ష కోట్లు కేవలం కాళేశ్వరం కోసమే..
~ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలతో 90 టీఎంసీల నీళ్లు అందించొచ్చు
~ పంపులు, లిఫ్టుల కోసమే రూ.వేల కోట్లు ఖర్చు చేసి కమీషన్లు కొల్లగొట్టారు
~ మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, జూన్ 5 : తెలంగాణ వస్తే పాలమÖరు ప్రాజెక్టులు పూర్తవుతాయని భావించామని, అయితే పదేళ్ల బీఆ ర్‌ఎస్ పాలనలో ఈ ప్రాంతానికి అన్యాయమే జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. జూరాల, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి, ఇతర ప్రాజెక్టులు కట్టి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును బీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తి చేసి ఉంటే ఈ జిల్లాకు 26 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించే అవకాశం ఉండేదన్నారు. వట్టెంపాడు పంప్ హౌస్ మూడో లిఫ్టును ఆయన నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఇతర ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మంత్రులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పదేళ్ల కాలంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ ప్రాజెక్టులపై బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. ఏ ప్రాజెక్టును పూర్తి చేయాలన్నా మొట్టమొదట చేయాల్సింది భూసేకరణ అని, అయితే జిల్లాలో ఏ ప్రాజెక్టు తీసుకున్నా వాటికి అవసరమైన భూసేకరణ జరగలేదని, అది పూర్తి చేయకుండానే ప్రాజెక్టులు పూర్తవుతాయని కేసీఆర్ ఎలా భావించారు అని ప్రశ్నించారు. పదేళ్ల కాలంలో పాలమూరు ఎత్తిపోతలకే ముఖ్య‌మంత్రి కేసీఆర్ రూ.27 వేల కోట్లు ఖర్చు పెట్టారంటూ పంపులు, లిఫ్టుల కోసమే వేల కోట్లు ఖర్చు చేసి కమీషన్లు కొల్లగొట్టారని, ఆయన ఆలోచన ఎంతసేపూ పంపులు, లిఫ్టులు, వేల కోట్ల కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లించి కమీషన్లు కొట్టేసుడే అని విమర్శించారు. దీనిపై నాగం జనార్దన్ రెడ్డి ఏండ్లకేండ్లు కొట్లాడారు.. ఈ జిల్లాలో పుట్టి పెరిగిన తాను ఈ ప్రాజెక్టులను ఒక కొలిక్కి తీసుకొద్దామని ప్రయత్నిస్తుంటే బీఆర్ఎస్ రాజకీయ కార్యాచరణతో ముందుకొస్తున్నది.. తిన్నది అరిగేలా నడిస్తే వాళ్ళు చేసిన పాపాలు కొన్నైనా పోతాయి.. కాశీ వరకు నడిస్తే ఇంకా మంచిది అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలు ఛీదరించుకుంటారన్న సోయి కూడా లేకుండా వ్యవహరిస్తున్నారన్నారు. తమ గురించి కొందరు మాట్లాడి జిల్లాకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి పదేళ్లలో కేసీఆర్ కట్టిన అప్పు రూ.84,503 కోట్లు అయితే తాము అధికారంలోకి వచ్చాక 30 నెలల్లో కట్టిన అప్పు రూ.52,120 కోట్లు.. తాము 30 నెలల్లో కాంట్రాక్టర్లకు చెల్లించింది రూ.22 వేల కోట్లు మాత్రమే. ఇందులో రూ.8 వేల కోట్లు పాలమూరు ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టాం.. పాలమూరు కోసం మేం ఎక్కువ ఖర్చు పెట్టినట్టా.. తక్కువ ఖర్చు పెట్టినట్టా అని ప్రశ్నించారు. ప్రాజెక్టులకు సంబంధించి ఇంకా నాలుగు వేల ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉందని, రాబోయే రెండేళ్లలో జిల్లాలో పనులు పూర్తి చేయాలని కంకణం కట్టుకుని పనిచేస్తున్నామని సీఎం రేవంత్ చెప్పారు. ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినా శాంతి కూడగట్టుకుని పనిచేస్తున్నామన్నారు. 90 శాతం పనులు పూర్తయ్యాయని బీఆరఎస్ పచ్చి అబద్ధాలు చెబుతున్నదని.. అంచనాల్లో 50 శాతం కూడా ఖర్చు చేయకుండా 90 శాతం పనులు ఎలా పూర్తవుతాయని నిలదీశారు. ఆ సైన్స్, మ్యాథ్స్ ఏంటో తనక” అర్థం కావడం లేదని.. తాను 80 వేల పుస్తకాలు చదవలేదు అని వ్యంగ్యంగా అన్నారు. ఉన్నదంతా దోచుకుపోయి తమను దోషులుగా చూపే ప్రయత్నం చేస్తున్నారంటూ ప్రజలకు అంతా తెలుసు.. వాళ్ళేం అమాయకులు కాదు అని అన్నారు. పాలమూరు జిల్లా ప్రాజెక్టులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేసెందుకే మా పర్యటన అని తెలిపారు. భూసేకరణకు అందరూ సహకరించాలని, ఇప్పుడు కాకాకపోతే ఇంకెప్పుడూ ఈ పనులను పూర్తి చేసుకోలేం అని అన్నారు. అలా చేస్తే చరిత్ర మనల్ని క్షమించదన్నారు. జిల్లా ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేందుకు తాను సంపూర్ణంగా కట్టుబడి ఉన్నానన్నారు. జిల్లా బీఆరెస్ నేతలు ఏం చేయక్కర్లేదు.. ఈ రెండేళ్లు ఏం మాట్లాడకపోవడమే వాళ్ళు చేసే పెద్ద సాయం అని అన్నారు.

వట్టెం పంప్‌హౌస్ మూడో లిఫ్ట్‌ను సందర్శించిన సీఎం

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను రెండు రోజులపాటు పరిశీలించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామం వద్ద ఉన్న వట్టెం పంపుహౌస్ మూడో లిఫ్టును శుక్రవారం సందర్శించారు. ఎస్‌జెఆర్ పిఆరఎలఐఎస్( పాలమూ రు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్)లో భాగంగా చేపట్టిన ఈ లిఫ్ట్ పనుల పురోగతిని పరిశీలించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. 2020- 2023 సంవత్సరం నాటికి రూ.3300 కోట్లు ప్రాజెక్టుకు ఖర్చు చేయగా 2023 నుంచి ఇప్పటివరకు రూ.800 కోట్లను ఖర్చు చేసి ప్రాజెక్టు పనులను కొనసాగించినట్లు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న మిగతా సివిల్ పనులను రూ.90 కోట్లతో వచ్చే మూడు నెలల్లో పూర్తి చేయనున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఇక్కడ మొత్తం పది పంపులు ఉండగా ఐదింటిని ఏర్పాటు చేసి¾ ట్రయల్ రన్‌ను విజయవంతంగా నిర్వహించామన్నారు. వర్షాకాలంలో నీళ్లు రాగానే వెంకటాద్రి రిజర్వాయర్‌కు ఎత్తిపోతల ద్వారా నీటిని తరలిస్తామన్నారు. ఈ రిజర్వాయర్ సామర్థ్యం మొత్తం 16.74 టీఎంసీలు కాగా స్టాండర్డ్ ఆపరేషన్ సిస్టం ద్వారా విడతల వారీగా రిజర్వాయర్‌ను నింపుతారన్నారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా మొత్తం 12 లక్షల 30 వేల ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించే ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. అలాగే మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల ప్రజలకు తాగునీటికి, పరిశ్రమలకు కూడా నీళ్లు అందుతాయని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

రెండో రోజు సీఎం పర్యటన

ఉదయం 10.30 గంటలకు నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు పంప్‌హౌస్ చేరుకుంటారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్యాకేజీ-3 హెడ్ రెగ్యులేటర్, ప్యాకేజీ-2 నార్లాపూర్ రిజర్వాయర్, ప్యాకేజీ-1 డెలివరీ సిస్టర్న్, ఎంజీకేఎలఐఎస్ లిఫ్ట్-1 పంప్‌హౌస్‌లను పరిశీలించనున్నారు. ఉదయం 11.50 గంటలకు పీఆరఎలఐఎస్ ప్యాకేజీ-3 కాల్వ పనులు, ఏదుల రిజర్వాయర్, పంప్‌హౌస్ పనులను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు కుమ్మెరలో పీఆరఎలఐఎస్ ప్యాకేజీ-8 స్టేజ్-3 పంప్‌హౌస్, వట్టెం రిజర్వాయర్‌కు సంబంధించిన ప్యాకేజీ- 9, 10, 11 పనులను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం కొత్తూర్‌లోని పీఆరఎలఐఎస్‌కు చెందిన కరివేన రిజర్వాయర్ ప్యాకేజీ- 14, 15 పనులను సీఎం పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు అక్కడే మీడియా సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు జడ్చర్ల మండలం ఉద్దండాపూర్‌లో పీఆరఎలఐఎస్‌కు చెందిన ఉద్దండాపూర్ రిజర్వాయర్ ప్యాకేజీలు 17, 18 పనులను పరిశీలించి సాయంత్రం 6.30 గంటలకు జడ్చర్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *