ఆన్‌ లైన్‌ ఆటలతో జీవితాలు బలి…!

ఈజీ మనీ కోసం అలవాటు పడినటువంటి చాలామంది యువతీ యువకులు ఆన్‌ లైన్‌ లో ఆటలు ఆడి తమ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. సరదాగా ఆడటం మొదలుపెట్టి, ఆ ఆటలకు  బానిసై, పెయిడ్‌ గేమ్స్‌,బెట్టింగ్‌ గేమ్స్‌  ఆడి  దాచుకున్న డబ్బులను కోల్పోయి అప్పుల ఊబిలో చిక్కుకు పోయి, అప్పులు కట్టలేక తమ ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. అప్పుల పాలైనటువంటి వారు తిరిగి కట్టలేక ఇంట్లో వాళ్లకు చెప్పలేక,తమ ప్రాణాలు తీసుకుంటున్నారు.ఇంకొందరైతే అప్పులు తీర్చేందుకు దొంగలుగా, చైన్స్‌ స్నాచర్లుగా,సైబర్‌ నేరగాల్లు గా మారుతున్నారు.డబ్బుల కోసం ఇంట్లో వారిని చంపడానికి కూడా వెనకాడడం లేదు. బంధాలు బంధుత్వాలను కూడా ఆదమరిచి  ప్రాణాలను తీస్తున్నారు. ఈ పెయిడ్‌ గేమ్స్‌, ఆన్లైన్‌ గేమ్స్‌ బారినపడి నేటి యువత తన భవిష్యత్తును నాశనం చేసుకుంటుంది. ఇందులో ఎక్కువగా 20 నుండి 35 సంవత్సరాల వయస్కులు ఎక్కువగా ఉండడం అందరినీ ఆందోళన కలిగించే విషయం.

ఈజీ మనీ కోసం అలవాటు పడినటువంటి వారు  ఇంటర్నెట్‌ లో లేదా స్మార్ట్‌ ఫోన్‌ లో ఆన్‌ లైన్‌ గేమ్‌ లను వెతికి అందులోని రమ్మి, ఐపిఎల్‌ బెట్టింగ్‌, ఫ్రీ మనీ ఎర్నింగ్‌ యాప్స్‌ అని ఎన్నో యాప్‌ లను ఉపయోగిస్తూ ఆన్‌ లైన్‌ లో సరదాగా మొదలుపెట్టిన ఆటలు,చివరికి వాటికి అలవాటు పడి జీవితాన్ని బలి తీసుకునే దిశగా వెళ్తున్నారు.కొందరికి అవి ఆన్‌ లైన్‌ గేమ్స్‌ అని, క్రికెట్‌ బెట్టింగ్‌ అని తెలియకుండానే ఆ ఊబిలో చిక్కుకొని పోతున్నారు. కరోనా సమయంలో పిల్లలకు ఆన్‌ లైన్‌ క్లాసులు జరిగేవి.అలాంటి సమయంలో పాఠశాల విద్యార్థులు మొదలుకొని కళాశాల లో చదువుకునేటువంటి యువతీ యువకులు, నిరుద్యోగులు, ఉద్యోగ ఉపాధి లేనివారు  ఈజీగా డబ్బులు సంపాదించాలనే యావతో  ఆన్‌ లైన్‌ ఆటలకు ఆడిక్ట్‌ అయ్యి, వాటిపై ఇంట్రెస్ట్‌ చూపి, డబ్బులు డిపాజిట్‌ చేసి గేమ్‌ ఆడితే సంపాదించవచ్చు అన్న ఆశలతో అప్పులు చేసి,అప్పుల ఊబిలో చిక్కుకొని  కష్టపడి సంపాదించిన దాన్నంతా కూడా పోగొట్టుకుంటున్నారు.బెట్టింగులను ఆర్గనైజ్‌ చేసే వాళ్ళు మొదట్లో కావాలనే కొంత డబ్బును యూజర్లు గెలుచుకునేలా చేస్తారు.దీంతో ఉత్సాహంగా మరింత సొమ్ము తెచ్చి గేమ్స్‌ ఆడుతూ బెట్టింగ్‌ కడుతుంటారు.డబ్బులు పోగొట్టుకున్న మళ్లీ రాకపోతాయని ప్రయత్నిస్తుంటారు ఇలా నిండా మునిగిపోతుంటారు. కొద్ది రోజులుగా రాష్ట్రంలో చాలామంది యూత్‌ ఇలాగే నష్టపోయారు. ఆన్‌ లైన్‌ గేమింగ్‌ కంపెనీలు వివిధ రకాల యాప్లు, వెబ్‌ సైట్‌ ల ద్వారా బిజినెస్‌ చేస్తున్నాయి.

ఇప్పుడు గూగుల్‌, పేటీఎం,ఫోన్‌ పే లో ద్వారా కూడా ఈ ఆటలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. కొన్ని సంస్థలు  పెయిడ్‌ గేమ్స్‌ ద్వారా గేమర్స్‌ కి మనీ ఇస్తున్నాయి. ఆన్లైన్‌ రమ్మీ వంటి గేమ్‌ లకు రూ.50 నుంచి కూడా డబ్బు పెట్టే చాన్స్‌ ఉంటుంది. ముందు కొంత అమౌంట్‌ గేమ్‌ ఆడే వారి అకౌంట్‌ లోకి వస్తుంది. దీంతో పాటు గేమ్‌ లకు రివార్డ్స్‌ ఇస్తూ ఆకర్షిస్తుంటారు. టి20 లు వన్డేలు,ఐపిఎల్‌, ఆఖరికి టెస్ట్‌ మ్యాచ్లు, ప్రో కబడ్డీ, రమ్మీ, పేకాట వీడియో గేమ్స్‌ ఇలా ఆన్‌ లైన్‌ మోసానికి బలవుతూ  ఉన్నారు. ఇవేకాక  ఆన్‌ లైన్‌ స్పాట్‌, బ్లాక్‌ జాక్‌, బక్కట్‌ పోకర్‌, తీన్‌ పట్టి, అందరు బహార్‌,ఆన్లైన్‌ క్యాష్‌ ను ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో యాప్‌ లు,ఆన్‌ లైన్‌ లో  మోసాలు పెరిగిపోయి,మొదట్లో రూపాయల్లో ఆశపెట్టి వందల్లో లాభాలు చూపి,తర్వాత వేళల్లో ఆశపెట్టి లక్షలు దోచేస్తున్నారు. నేటి యువతీ యువకులకు పలు రకాల ఆటలపై ప్రజల్లో ఉన్న మోజును క్యాష్‌ చేసుకునేందుకు నకిలీ యాప్‌ లను సృష్టించి,వాటి ద్వారా కూడా సులువుగా డబ్బులు సంపాదిస్తున్నారు.ఈ బెట్టింగ్‌ ఆన్‌ లైన్‌ గేమ్‌ ల ద్వారా.ఇంకా కొన్ని యాప్‌ ల గనుక చూస్తే ఇంకా ముందుకు వెళ్లి వారే రుణాలు ఇస్తూ మళ్లీ డబ్బులు కట్టించి అదే గేమ్‌ కు బానిసగా కూడా చేస్తున్నారు. స్మార్ట్‌ ఫోన్లు రాకముందు ప్రశాంతమైన జీవితం గడిపినటువంటి వారు స్మార్ట్‌ ఫోన్లు వచ్చిన తర్వాత జీవితాలను బలి తీసుకుంటున్నారు.ఈ ఆన్‌ లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ ల నిర్వాహకులు చైనా, సౌదీ అరేబియా, అరబ్‌ దేశాల నుంచి ఆపరేటింగ్‌ చేస్తుంటారు.ఇటీవల ఛతీష్‌ గడ్‌  లో వెలుగు చూసిన మహాదేవ యాప్‌ కేసులో ఇదే విషయం తేటతెల్లమైంది.

ప్రముఖులతో యాడ్స్‌ ఇప్పించడం అమాయకులను ముగ్గులోకి దించడం ద్వారా డబ్బులు వసూలు చేయడం, మొత్తంగా ఆటలకు బానిసలు చేయడం నిత్యకృతమైంది. ఇటీవల కాలంలో ఒక కలెక్టర్‌ దగ్గర పనిచేసేటువంటి గన్మెన్‌ సైతం అప్పుల ఊబిలో చిక్కి తన కుటుంబంతో సహా ప్రాణాలను కోల్పోయారు.ఇలా ఆన్‌ లైన్‌ మోసాలతో దేశంలో రోజుకు కొన్ని వందల మంది ప్రాణాలను కోల్పోవడం జరుగుతుంది.ఈ దారుణాలు జరుగుతున్నటువంటి క్రమంలో స్మార్ట్‌ ఫోన్ల వాడకం తగ్గించడం మేలు.ఖాళీగా ఉంటూ ఏదైనా చూస్తున్న కొద్ది ఏవేవో ప్రకటనలు,ఆకర్షించే బొమ్మలు, ఆటలు,మన డిస్ప్లే మీద ఆకర్షిస్తూ ఉంటాయి. మరి అలాంటి తరుణంలో వాటి జోలికి పోకుండా వాటిని యాపులను డౌన్లోడ్‌ చేసుకోకుండా ఉంటే మంచిది. వాటి మీద టచ్‌ చేస్తే ఆ యాప్‌ లు డౌన్లోడ్‌ అయి మీ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు గానీ లేదా డబ్బులు పెట్టి నష్ట పోయేటువంటి పరిస్థితి గానీ వస్తుంది.దానివల్ల ఇంట్లో అనర్ధాలు,ఇబ్బందులు, అప్పుల గొడవలు,మనస్పర్ధలు, ప్రశాంతత లేక ఆత్మహత్యల ఆలోచనలు వచ్చే ప్రాణాలనే బలి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది.అందుకే స్మార్ట్‌ ఫోన్‌ లో కానీ ఇంటర్నెట్లో కానీ తెలిసినటువంటి యాపులను వినియోగించడం మంచిది. తెలియని యాప్‌ల జోలికి వెళ్ళకూడదు.
– మోటె చిరంజీవి
సెల్‌ : 9949194327

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *