శుభకృత్‌ – ఉగాది ప్రాముఖ్యత

జడప్రాయ జగత్తులో చైతన్యాన్ని రగిలించి మానవాళిలో నూతన ఆశయాలను అంకురింపచేసే శుభదినం ‘ఉగాది’

ఉగస్య ఆది అంటే ఉగాది. ‘‘ఉగ’’ అంటే నక్షత్ర గమనం – జన్మ – ఆయుష్షు అని అర్థాలు. ‘ఆది’ అంటే మొదలు. ‘ఉగాది’ అంటే ప్రపంచం జన్మ ఆయుష్షులకు మొదటిరోజు. మరో విధంగా చెప్పాలంటే, ‘యుగం’ అంటే రెండు లేక జంట అని కూడా అర్ధం. ఉత్తరాయణ, దక్షిణాయనములనే ఆయన ద్వయ సంయుతం ‘యుగం’ (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది యుగాది అయింది. అదే సంవత్సరాది. ఉగాది – వసంతాలకు గల అవినాభావ సంబంధం, సూర్యునికి సకల ఋతువులకు ప్రాతః సాయం కాలాది త్రికాలములకు ఉషాదేవత మాతృస్వరూపం. భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడు,  ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణాలుచెబుతున్నాయి.

వేదాలను దొంగిలించిన సోమకుడనే అసురుని వధించి మత్స్యావతారధారి వేదాలను బ్రహ్మకప్పగించిన శుభ ముహూర్త పురస్కారంగా విష్ణువు ప్రీత్యర్ధం ‘ఉగాది’ ఆచరణలోకి వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి.. చైత్ర శుక్ల పాడ్యమిన విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు కనుక సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరుపుకుంటారని పేర్కొంటారు. శాలివాహన చక్రవర్తి చైత్ర శుక్ల పాడ్యమి నాడు పట్టాభిషిక్తుడై శౌర్య పరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా భాసిల్లినందున ఆ యోధుని తలుస్తూ ఉగాది ఆచరిస్తారని కూడా చారిత్రక వృత్తాంతం ప్రచారంలో ఉంది..  జడప్రాయ జగత్తులో చైతన్యాన్ని రగిలించి మానవాళిలో నూతన ఆశయాలను అంకురింపచేసే శుభదినం ‘ఉగాది’ ఉగాది  నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్త పనులు ప్రారంభించటం పరిపాటి. ఆ రోజు ప్రాతఃకాలాన ఇళ్లు, వాకిళ్లు, శుభ్ర పరచుకుని,. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు.తలంటి స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు.

‘‘ఉగాది పచ్చడి’’ ఈ పండుగకు ప్రత్యేకం. షడ్రుచుల సమ్మేళనం- తీపి (మధురం), పులుపు (ఆమ్లం), ఉప్పు (లవణం), కారం (కటు), చేదు (తిక్త), వగరు (కషాయం)  ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు చెబుతుంది.. ఈ పచ్చడి మనకు ప్రసాదం. దీనిలో  చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలైనవి వినియోగిస్తారు.. ఈ పండగను మరాఠీలు  గుడిపడ్వాగా పిలుస్తారు.

అత్యంత శ్రేష్ఠమైన ఈ ఉగాది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌, ‌కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో విశేషంగా జరుపుకుంటారు. ఆంధ్ర, కర్ణాటకల్లో ఉగాదిగా పరిగణిస్తే మహారాష్ట్రలో ‘గుడిపాడ్వా’ పేరుతో పిలుస్తారు. మలయాళీలు ‘‘విషు’’ అనే పేరుతోను, సిక్కులు ‘‘వైశాఖీ’’ గానూ, బెంగాలీలు ‘‘పొయ్‌లా బైశాఖ్‌’’ ‌గానూ జరుపుకుంటారు. అయితే పండుగను నిర్వహించడంలో పెద్దగా తేడాలు లేవనే చెప్పవచ్చు. తెలుగు రాంష్ట్రాలలో ఉగాది రోజున పంచాంగ శ్రవణం ఆనవాయితీ. ఈ ఏడాది శ్రీ శుభకృత్‌ ‌నామ సంవత్సరం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ శుభకృత్‌ ‌నామ సంవత్సరంలో గ్రహాల స్ధితిగతులను ఆధారంగా జ్యోతిష్యులు రాశిఫలాలను వివరిస్తారు. ఈ సంవత్సరంలోని మంచి చెడులను, కందాయ ఫలాలను, ఆదాయ ఫలాలను, స్ధూలంగా భావిజీవిత క్రమం తెలుసుకొని అందుకు అనుగుణమైన నిర్ణయాలు తీసుకోవటానికి సిద్ధపడతారు.. ఏప్రిల్‌ 2‌వ తేదీ శనివారం తిరుమల శ్రీవారి ఆలయంలో ఉదయం 9 గంటలకు ఉగాది ఆస్ధానం నిర్వహించి పంచాంగ పఠనం చేస్తారు.
– నందిరాజు రాధాకృష్ణ.
 9848128215

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page