- త్వరలో అన్ని పిహెచ్సిలలో సిసి కెమెరాలు
- సి సెక్షన్ ఆపరేషన్లు తగ్గించేలా చర్యలు
- దవాఖానాలలో పరికరాల నిర్వహణపై ప్రత్యేక వ్యవస్థ
- చర్యలపై దృష్టి సారించిన ప్రభుత్వం
ప్రజాతంత్ర, హైదరాబాద్ : వైద్య, ఆరోగ్య శాఖలో సమూల ప్రక్షాళనపై ప్రభుత్వం దృష్టి సారించింది. వైద్య రంగంపై ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తున్నప్పటికీ వైద్యులు, సిబ్బంది అలసత్వ ధోరణితో రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రోగులు ఇబ్బందులు ఎదుర్కుంటూనే ఉన్నారు. ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు వైద్య రంగాన్ని పూర్తిగా విస్మరించడంతో అదే పనితీరుకు వైద్యులు, సిబ్బంది అలవాటు పడ్డారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో వైద్య వ్యవస్థలో సమూల ప్రక్షాళన చేసి వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని వైద్యారోగ్య శాఖ నిర్ణయించింది. రాష్ట్రంలో వైద్య వ్యవస్థలో మార్పులపై మాటలు చెప్పడమే కాదు…అందుకు తగ్గ విధంగా నిధులు కూడా ఇస్తేనే మార్పు సాధ్యమని భావించి ప్రభుత్వం ఈ ఏడాది వైద్య ఆరోగ్య శాఖకు బడ్జెట్ను భారీగా పెంచింది. ఇందులో భాగంగా గత ఏడాది రూ.6925 కోట్లుగా ఉన్న బడ్జెట్ను రూ.11,440 కోట్లకు పెంచింది. మెడికల్ కళాశాలలను 3 నుంచి 30కి పెంచింది.
కాగా, పిహెచ్సి స్థాయి నుంచి టీచింగ్ హాస్పిటల్స్ వరకు వైద్యులు, ప్రొఫెసర్లతో పాటు వైద్య సిబ్బంది సమయ పాలన పాటించడం లేదు. దీంతో రోగులు ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కోల్పోయి ప్రైవేటు హాస్పిటల్స్కు వెళుతున్నారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకొచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా పిహెచ్సిలు మొదలుకుని టీచింగ్ హాస్పిటల్స్ వరకు సిసి కెమెరాల నిఘాను ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఈ పక్రియ ఇప్పటికే సగానికి పైగా పూర్తి కాగా సిసి కెమెరాలు ఏర్పాటైతే సమయ పాలన పాటించని వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటే పరిస్థితిలో కొంత మార్పు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తున్నది. అలాగే, ప్రభుత్వ హాస్పిటల్స్లో నార్మల్ డెలివరీల పైన సైతం వైద్యారోగ్య శాఖ దృష్టి సారించింది.
ఇకపై ప్రభుత్వ హాస్పిటల్లో నార్మల్ డెలివరీ చేస్తే వైద్యులకు ఇన్సెంటివ్లు ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ, ప్రైవేటులో సి సెక్షన్లపై ఆడిట్ నిర్వహించి తగ్గకపోతే సంబంధిత వైద్యులపై చర్యలు తీసుకునే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు, ప్రభుత్వం ప్రతీ ఏటా రూ.కోట్ల వ్యయం చేసి కొనుగోలు చేసిన ఆధునిక వైద్య పరికరాలు వాడకపోవడంతో నిరుపయోగంగా మారుతున్నాయి. వీటిని సమర్థవంతంగా వినియోగించి రోగులకు వైద్య సేవలు అందించడానికి త్వరలో యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ను ప్రవేశపెట్టనుంది. ప్రత్యేకంగా దీనికి నిధులు కేటాయించి ఎప్పటికప్పుడు పర్యవేక్షణకు కమిటీని సైతం ఏర్పాటు చేయనుంది.